Begin typing your search above and press return to search.

మందకొడిగా సాగుతున్న పరిషత్ పోలింగ్ .. కారణం అదేనా ?

By:  Tupaki Desk   |   8 April 2021 5:15 AM GMT
మందకొడిగా సాగుతున్న పరిషత్ పోలింగ్ .. కారణం అదేనా ?
X
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం నుండి ప్రారంభమైంది. చివరి నిముషంలో ఈ పరిషత్ ఎన్నికలకు హైకోర్టు డివిజనల్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల సిబ్బంది యుద్ధప్రాతిపదికన బుధవారం పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల కోసం 27,752 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 6,492 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. అక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 8 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీపడుతున్నారు. ఇక ఎంపీటీసీల విషయానికొస్తే.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో 2,371 ఏకగ్రీవమయ్యాయి. మరో 735 స్థానాలకు పలు కారణాలతో ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 7,220 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 18,702 మంది పోటీలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే .. పరిషత్ పోలింగ్ ప్రారంభమైనా కూడా పెద్ద సంఖ్య లో ఓటర్లు రావడం లేదు. సాధారణంగా ఓటింగ్ సమయంలో ఓటర్లు , పోలింగ్ స్టేషన్ వద్ద బారులు తీరుతారు. కానీ, ఈసారి వచ్చిన వారు వచ్చినట్టు ఓటు వేసి వెళ్ళిపోతారున్నారు. కేవలం పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి అనే మాట తప్ప , ఆ హడావిడి ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ ఎన్నికలకి సంబంధించిన ఆ అన్ని పనులు గత ఏడాది ముగిసాయి. ప్రస్తుతం పోలింగ్ మాత్రమే జరుగుతుంది. దీనికి తోడు టీడీపీ ఈ ఎన్నికలని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం తో టీడీపీ కార్యకర్తలు , శ్రేణులు అటు వైపు కూడా తొంగి చూడటం లేదు. కనీసం చాలా చోట్ల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. దీనితో గెలుపు పై ధీమా గా ఉన్న అధికార పక్షం కూడా కొంచెం సైలెంట్ గానే ఉంది.

ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో , కొన్నిచోట్ల పోటీకి ధైర్యం చేసినా ఆ పార్టీ తరపున పోలింగ్ కేంద్రాల్లో కూర్చునేందుకు ఏజెంట్లు కూడా కరువయ్యారు. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే మంగళవారం సాయంత్రానికి ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే, ఆ స్టే పై ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించడం, ఇరు పక్షాల వాదనలు విని చివరకు బుధవారం మధ్యాహ్నం ఎన్నికలకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్ణయం హైకోర్టు చేతిలో ఉండటం తో ఎన్నికల సామగ్రి తీసుకెళ్లడానికి వచ్చిన సిబ్బంది కూడా కోర్టు తీర్పు కోసం ఎంపీడీవో ఆఫీస్ ల ముందు పడిగాపులు కాశారు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, అధికారులు పోలింగ్ కి వేగంగా ఏర్పాట్లు చేశారు. దీనితో కొంతమందికి ఈ రోజు పరిషత్ పోలింగ్ జరుగుతుంది అనే విషయం కూడా తెలియదు. ప్రస్తుత పోలింగ్ సరళిని బట్టి చూస్తే .. ఈసారి పరిషత్ పోలింగ్ 50 శాతం దాటితే గగనమే.