Begin typing your search above and press return to search.

షాకింగ్... కరోనాతో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి

By:  Tupaki Desk   |   12 Aug 2020 5:40 PM GMT
షాకింగ్... కరోనాతో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి
X
ప్రపంచ దేశాలన్నింటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా నెలలు గడుస్తున్నా తన ప్రతాపం తగ్గించలేదు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్.. తాజాగా తెలుగు నేలలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, సినీ నిర్మాత, పార్ల్డ్ టెక్నాలజీస్ సీఎండీ పాలెం శ్రీకాంత్ రెడ్డి(57)ని కూడా చంపేసింది. కరోనా వైరస్ బారిన పడిన పాలెం బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఈ వార్త తెలుగు నేల ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా పారిశ్రామిక వర్గాలతో పాటు ఎన్నారై సమాజాన్ని కూడా షాక్ కు గురి చేసింది.

ప్రవాసాంధ్రుల్లో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ రెడ్డి.. ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. పారిశ్రామిక రంగంలో ఊపిరి సలపని బిజీ షెడ్యూల్ తో సాగినా.. రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన 2009 ప్రాంతంలో టీడీపీలో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగగా... ఆయనపై శ్రీకాంత్ రెడ్డిని తన అభ్యర్థిగా టీడీపీలో రంగంలోకి దించింది. హోరాహోరీగా సాగిన సదరు ఎన్నికల్లో జగన్ చేతిలో పాలెం భారీ వ్యత్యాసంతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చిన పాలెం... రాయలసీమ హక్కుల కోసం పాటు పడే ఉద్దేశ్యంతో ప్రజాపాలన అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లోనూ ఈ పార్టీ తరఫున పాలెంతో పాటు పలువురు పోటీ చేసినా.. ఎక్కడా విజయం సాధించలేదు.

ఇదిలా ఉంటే... సినీ నిర్మాణంపైనా ఆసక్తి కలిగిన పాలెం శ్రీకాంత్ రెడ్డి... పార్ల్డ్ ప్రొడక్షన్స్ పేరిట ఓ సినీ నిర్మాణ సంస్తను నెలకొల్పి ఎమ్2 (మ్యూజిక్ మ్యాజిక్) పేరిట ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అంతగా ఆడకపోవడంలో సినీ నిర్మాణం నుంచి తప్పుకున్న పాలెం... బిజినెస్ కే పరిమితమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డి కుమారడైన శ్రీకాంత్ రెడ్డి... తెలుగు నేలలో పరిచయం అక్కర్లేని వ్యక్తిగా గుర్తింపు సంపాదించారు. వివిధ రంగాల్లో ప్రవేశించి... వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన శ్రీకాంత్ రెడ్డి కరోనా బారిన పడి మరణించడం యావత్తు తెలుగు ప్రజలను షాక్ కు గురి చేసింది.