Begin typing your search above and press return to search.

బీజేపీ, కేసీఆర్ పై ఓవైసీ హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   5 Dec 2020 6:00 AM GMT
బీజేపీ, కేసీఆర్ పై ఓవైసీ హాట్ కామెంట్స్
X
గ్రేటర్ ఎన్నికల వేళ పాత్ర మిత్రులు మళ్లీ కలిసే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. బీజేపీ బలంగా నిలబడుతున్న వేళ టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి ఎదుర్కోవడం తప్పితే మరో మార్గం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు.

బీజేపీని ఎదుర్కోగల సమర్థ నాయకుడు కేసీఆర్ మాత్రమే అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆయన సమర్థంగా పాలిస్తున్నారని.. కొన్ని సీట్లు పోయినంత మాత్రాన రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

దక్షిణ భారతదేశంలోనే సీఎం కేసీఆర్ భవిష్యత్తు నాయకుడని ఓవైసీ కొనియాడారు. కేసీఆర్ ను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానని తెలిపారు.

తక్కువ సీట్లలో పోటీ చేసినప్పటికీ 44 సీట్లను నిలబెట్టుకున్నామని ప్రస్తావించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక విషయంలో శనివారం పార్టీలో చర్చిస్తామన్నారు. నగరంలో అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్‌ పర్యటించిన డివిజన్లలో బీజేపీని ఓడించామన్నారు. పాత బస్తీలో సర్జికల్‌ స్ర్టైక్స్‌ చేస్తామన్న బీజేపీని డెమోక్రటిక్‌ స్ట్రైక్స్‌తో చిత్తు చేశామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 34 డివిజన్లు ఉండగా 33 గెలిచామని, సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో 12 డివిజన్లు పోటీ చేసి 9 గెలిచామని, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో 2 డివిజన్లు పోటీ చేసి రెండూ గెలిచామని తెలిపారు.

కేరళ, అసోంలలో ముస్లిం పార్టీలు గట్టిగా పని చేస్తున్నందున ఆ రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేయదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ విషయమై కేసీఆర్ స్పందన బట్టి ముందుకెళుతామని తెలిపారు.