Begin typing your search above and press return to search.

భారత్ లో ఎన్నారైలు భూములు కొనొచ్చు కానీ..

By:  Tupaki Desk   |   25 Sep 2021 4:32 AM GMT
భారత్ లో ఎన్నారైలు భూములు కొనొచ్చు కానీ..
X
విదేశాల్లో స్థిరపడి ఆస్తులు పోగేసుకున్న ప్రవాస భారతీయులు భారత్ లో ఆస్తులు కొనచ్చా? వాటికి హక్కుదారులు అవుతారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనముందు ఉన్నాయి. వాటన్నింటికి తాజాగా భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎన్నారైలు భారత్ లో స్థిరాస్తులు కొనుగోలు చేయడం.. స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలు ‘ఫారెన్ ఎక్స్ ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్’(ఫెమా) ఆధీనంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ ) పర్యవేక్షణలో జరుగుతాయి.

ఫెమా నియమావళి ప్రకారం.. ఎన్నారైలు కూడా భారతీయులే.. అయితే వారు దేశం వెలువల నివసిస్తున్నారంతే.. ఇక భారతీయ పౌరసత్వం లేకపోయినా తల్లిదండ్రులు భారతీయులై ఇక్కడే నివసిస్తుంటే అలాంటి వారిని ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)గా పరిగణిస్తారు. అయితే ఈ రెండు వర్గాలకు చెందిన వారికీ భారత్ లో స్థిరాస్థులు కొనుగోలు చేసుకునే విషయంలో ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టింది.

ఎన్నారైలు భారతదేశంలో రెసిడెన్షియల్, కమర్షియల్ స్థిరాస్థులను కొనుగోలు చేయవచ్చు. వాటి కొనుగోలుకు సంబంధించి ఎన్నారైలపై ఎలాంటి పరిమితి కూడా లేదు. అంతేకాదు.. వీటిని కొనుగోలు చేసే సమయంలో అవసరమైతే భారత్ లో హోంలోన్ కూడా తీసుకునేందుకు ఎన్నారైలకు అనుమతి ఉంది. కానీ పంట పొలాలను, ఫాంహౌస్ లను కొనుగోలు చేయడానికి మాత్రం వీల్లేదు. ఇది మాత్రమే కాదు.. భారత్ లో స్థలం కొనే సమయంలో ఎన్నారైలు చేసే చెల్లింపులపై కూడా ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టడం విశేషం.

ఎన్నారైలు కొనుగోలు సమయంలో చెల్లింపులు బ్యాంకుల ద్వారా కానీ.. లేదా ఎన్నారైల ప్రత్యేకంగా ఉండే ఎన్నార్ ఈ/ఎన్నార్వో లేదా ఎఫ్.సీఎన్ఆర్ ఖాతాల ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రావెలర్స్ చెక్ లేదా ఫారిన్ కరెన్సీలో చెల్లింపులు జరగడానికి వీల్లేదని ఆర్బీఐ నిబంధనలున్నాయి.