Begin typing your search above and press return to search.

ఉప్పు నీళ్లు తాగండి.. క‌రోనాను జ‌యించండి: కిమ్ హుకుం

By:  Tupaki Desk   |   18 May 2022 11:30 PM GMT
ఉప్పు నీళ్లు తాగండి.. క‌రోనాను జ‌యించండి:  కిమ్ హుకుం
X
కరోనా మహమ్మారి వ‌చ్చిన‌ రెండేళ్ల వరకు తమ దేశంలో ఒక్క కేసు కూడా రాలేదని గొప్పగా చెప్పుకున్న‌ ఉత్తర కొరియా ఇప్పుడు బెంబేలెత్తుతోంది. క‌రోనా విల‌యంతో అల్లాడుతోంది. ఐక్య‌రాజ్య‌స‌మితి నేతృత్వంలోని కొవాక్స్ సహా ఇతర దేశాల నుంచి టీకాల సాయాన్ని గ‌తంంలో తిరస్కరించింది. ఇప్పుడు ఆ దేశంలో కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. ఈ క్రమంలో.. కొవిడ్ను అరికట్టేందుకు దేశ పాల‌కుడు.. నియంత‌గా పేరున్న కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిన ఆదేశం(హుకుం) చర్చనీయాంశంగా మారింది. కరోనాపై పోరాడేందుకు ఉప్పు నీళ్లు పుకిలించటం సహా తాగాల‌ని ఆయ‌న సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ప్ర‌క‌ట‌న విన్న ప్ర‌జ‌లు.. అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

బామ్మ చెప్పింద‌ని!

సంప్రదాయ చికిత్సలే ఉత్తమమని ఓ బామ్మ‌ ఆ దేశ అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. తన పిల్లలు రోజుకు రెండు సార్లు ఉప్పు నీటిని పుకిలిస్తారని తెలిపింది. కరోనా వైరస్పై పోరాడేందుకు వంటింటి చిట్కాల్లోని ఉప్పు నీళ్లు ఉత్తమమైనవి, వాటినే ప్రభుత్వం సిఫార్సు చేస్తున్నట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపిందని, దాంతో పాటు విల్లో ఆకుల నీటిని రోజుకు మూడుసార్లు తాగాలని సూచించినట్లు తెలిపింది. ఈ ఆకులను జ్వరం లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. 'కరోనాపై పోరాటంలో అల్లం టీ ఉపయోగపడుతుంది. కరోనా అనగానే ముందుగా భయపడ్డాను. కానీ, వైద్యుల సలహాలు పాటించాక పెద్ద విషయమేమీ కాదని భావిస్తున్నా.' అని ఆ మహిళ పేర్కొంది. దీంతో ప్ర‌భుత్వం ఈ బామ్మ బాట‌లో న‌డిచిన‌ట్టు తెలుస్తోంది.

17 ల‌క్ష‌ల మందికి జ్వ‌రం

ఉత్త‌ర కొరియా జ‌నాభా.. 2 కోట్ల 80 ల‌క్ష‌ల మంది. అయితే.. ఇప్పుడు 17 ల‌క్ష‌ల మందికి పైగా ప్రజలు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు. బుధవారం ఒక్క రోజే 2.32 లక్షల మందికి జ్వరం లక్షణాలు బయటపడగా.. ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 62కు పెరిగింది. ప్రస్తుతం 6,91,170 మంది క్వారంటైన్లో ఉన్నారు. అయితే, జ్వరం లక్షణాలను కిమ్ సర్కార్ ఇప్పటి వరకు కరోనాగా గుర్తించలేదు. అధికారికంగా చెప్పిన సంఖ్య కంటే కేసులు పలు రెట్లు అధికంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా ఎవ‌రూ కూడా వెల్ల‌డించేందుకు వీల్లేద‌ని మీడియాకు కూడా ఆంక్ష‌లు విధించారు.

10 ల‌క్ష‌ల మంది కోలుకున్నార‌ట‌!

అంత‌ర్జాతీయంగా వ‌స్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఉత్త‌ర‌కొరియా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ఇప్పటికే 10 లక్షలకుపైగా ప్రజలు కొవిడ్ నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. పరీక్షలు చేసేందుకు సరైన వసతులు లేకపోవటం వల్ల చాలా కేసులను కొవిడ్-19గా గుర్తించలేకపోతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అనుమానిస్తున్నారు. సరైన ఔషధాలు, వైద్య సామగ్రి, సౌకర్యాలు లేకపోయినప్పటికీ పది లక్షల మంది ప్రజలు ఎలా కోలుకున్నారనేది ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. జ్వరం లక్షణాలు కాస్త తగ్గగానే క్వారంటైన్ నుంచి పంపించేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

స‌హ‌క‌రించ‌ని కిమ్‌!

కరోనా సమాచారం అందించాలని కోరినప్పటికీ ఉత్తర కొరియా స్పందించటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాలో కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెందుతోంది. ఆ దేశంలోని చాలా మంది ప్రజలు కొవిడ్ బారిన పడే అవకాశం ఉంది. అని పేర్కొన్నారు. ఎలాంటి పరీక్షలు చేయకపోవటం వల్ల జరిగే వ్యాప్తి కొత్త వేరియంట్లు ఉద్భవించేందుకు దోహదం చేస్తుందని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం చీఫ్ డాక్టర్ మైకెల్ ర్యాన్ పేర్కొన్నారు.