Begin typing your search above and press return to search.

32 పోట్లు పొడిచి క్రూరంగా చంపినోడికి పశ్చాత్తాపమేమీ లేదట

By:  Tupaki Desk   |   31 May 2023 10:28 AM GMT
32 పోట్లు పొడిచి క్రూరంగా చంపినోడికి పశ్చాత్తాపమేమీ లేదట
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మైనర్ బాలిక (సాక్షి) పాశవిక హత్యకు పాల్పడిన ఉన్మాదిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవటం గమనార్హం. పదహారేళ్ల బాలికను అత్యంత కిరాతకంగా చంపిన హంతకుడు ఇరవై ఏల్ల సాహిల్ తన చర్యను సమర్థించుకునేలా వాదన వినిపించటం విస్మయానికి గురి చేస్తోంది. తాను బాలికను చంపానని.. ఆమె తనను పక్కన పెట్టడాన్ని సహించలేకే ఇలాంటి పని చేసినట్లుగా చెబుతున్నారు.

అందరూ చూస్తుండగానే వీధిలో వెళుతున్న బాలికను 32 సార్లు కత్తితో పొడిచేసి.. అనంతరం బండ రాయితోఅదే పనిగా మోది.. ఆ తర్వాత కాళ్లతో తన్ని పారిపోయిన ఉదంతం.. దీనికి సంబంధించిన సీసీ పుటేజ్ వెలుగు చూడటంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

అందరూ చూస్తున్న వేళలో ఎలాంటి జంకు లేకుండా హత్య చేయటం ఒక ఎత్తు అయితే.. ఇంత జరుగుతున్నా.. అక్కడున్న స్థానికులు ఈ కిరాతకాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవటం.. తాపీగా చూస్తూ వెళ్లిపోయిన ద్రశ్యాలు సీసీ పుటేజ్ లో కనిపించాయి. ఢిల్లీ ప్రజల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ ఉన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని విచారించారు. ఈ దారుణానికి ఎందుకు చేశావన్న ప్రశ్నకు అతడు చెబుతున్న సమాధానాలు షాకింగ్ గా మారాయి. అతన్ని రెండు రోజులు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వినతిని కోర్టు అంగీకరించటంతో అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో తాను చేసిన పనికి సాహిల్ ఏ మాత్రం పశ్చాత్తాపాన్ని ప్రదర్శించటం లేదని పోలీసులు చెబుతున్నారు.

సాక్షి తనతో మూడేళ్లుగా డేటింగ్ లో ఉందని.. ఇటీవల తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో చనువు పెంచుకొని.. తనను పక్కన పెట్టేసిందని సాహిల్ విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది.

అందుకే ప్లాన్ ప్రకారం ఆమెను చంపేశానని.. ఆమెను చంపేందుకు పదిహేను రోజుల ముందే కత్తి కొన్న విషయాన్ని పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం. చేసిన దారుణాన్ని సమర్థించుకుంటున్న తీరు చూస్తే.. ఇలాంటోడికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువే అన్న భావన కలుగక మానదు.