Begin typing your search above and press return to search.

పార్టీ నేత‌ల తీరును మ‌హానాడులో త‌ప్పుప‌ట్టిన మాజీమంత్రి

By:  Tupaki Desk   |   28 May 2020 2:30 PM GMT
పార్టీ నేత‌ల తీరును మ‌హానాడులో త‌ప్పుప‌ట్టిన మాజీమంత్రి
X
ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్స‌రం తెలుగుదేశం పార్టీ మ‌హానాడు నిర్వ‌హిస్తుంటుంది. ఈ క్ర‌మంలో తాజాగా బుధ‌వారం నుంచి పార్టీ మ‌హానాడు మొద‌లైంది. మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌బ‌లుతున్న ఈ స‌మ‌యంలో ఆ పార్టీ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌హానాడు నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో డిజిట‌ల్ మ‌హానాడుగా మారింది. ఎందుకంటే చాలామంది నాయ‌కులు వీడియో, ఆడియో కాన్ఫ‌రెన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ నాయ‌కుల తీరు, సంస్థాగత తీరు తెన్నులపై మాజీమంత్రి చినరాజప్ప అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. దీనిపై చేసిన‌ తీర్మానం సంద‌ర్భంగా పలువురు పార్టీ నేతల తీరును ఆయన తప్పుపట్టారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు మనం చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకో లేకపోయామని, కార్యకర్తలను చూసుకోవాలని అధినేత చంద్రబాబు చెప్పినా పట్టించుకోలేదని మాజీమంత్రి చిన‌రాజ‌ప్ప త‌ప్పుబట్టారు. కార్యకర్తలు నిస్తేజంలో ఉన్నార‌ని, అందువల్లే పార్టీ ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పార్టీ అధికారం కోల్పోగానే కొందరు నాయ‌కుల వైఖ‌రిలో మార్పు వ‌చ్చింద‌ని.. వెంట‌నే అధికార పార్టీలోకి జంప‌య్యార‌ని తెలిపారు. ఇక వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోమని మాజీమంత్రి చిన‌రాజ‌ప్ప స్పష్టం చేశారు. వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు కనుమరుగయ్యారని తెలిపారు. అయితే ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోవ‌డం త‌గ‌ద‌ని, ప్రభుత్వం లో లేకుంటే పార్టీ గురించి పట్టించుకోరా? అని అంద‌రినీ ప్రశ్నించారు. ఈ స‌మ‌యంలో బాగా పని చేస్తున్న వాళ్లనే గుర్తించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ముఖ్యం కాదని పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని చినరాజప్ప తెలిపారు.