Begin typing your search above and press return to search.

థాక్రే తట్టుకోవాలి మరి : ఎంపీలూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారట...?

By:  Tupaki Desk   |   6 July 2022 11:30 PM GMT
థాక్రే తట్టుకోవాలి మరి : ఎంపీలూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారట...?
X
మహారాష్ట్ర రాష్త్ర రాజకీయ సంక్షోభానికి తెర పడింది. శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాధ్ షిండే సీఎం అయ్యారు. బీజేపీ డిప్యూటీగా సర్దుకుంది. సర్కార్ ఏర్పడి రోజులు గడుస్తున్నాయి. దాంతో శివసేన రాజకీయం కాస్తా నీరు పల్లమెరుగు అన్నట్లుగా అధికారం వైపు పాకుతోంది. ఉద్ధవ్ థాక్రే సిద్ధాంతాలు, నీతులు వెన్నుపోటు కధలు చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో ఢక్కా మెక్కీలు తిన్న వారు అయారాం గయారాం సూత్రాన్నే నమ్ముకుంటారు.

రాజకీయాల్లో ఈ రోజే మనది. రేపటి గురించి ఎవరికి తెలుసు అన్న ఫిలాసఫీయే ఎపుడూ వ్యాప్తిలో ఉంటుంది. శివసేనను నడిపించే సామర్ధ్యం ఉద్ధవ్ థాక్రేకు లేవు అని ఇపుడు ఆ పార్టీలోని మెజారిటీ నాయకులు నమ్ముతున్నారా అంటే పరిస్థితులు అవును అంటున్నాయి. ఇంతకాలం ఉద్ధవ్ థాక్రే వెనక కొడుకు ఆదిత్యా థాక్రే, భార్యతో పాటు ఎంపీ సంజయ్ రౌత్ వంటి వారు చక్రం తిప్పారని చెబుతారు.

దాంతో విసిగిన ఎమ్మెల్యేలు ఏకమొత్తంగా ఏక్నాధ్ శిబిరంలో చేరిపోయారు. వారి శ్రమ వృధా కాలేదు. సీఎం సీటే కొట్టేశారు. ఇపుడు అధికారం ఉంది. తామే అసలైన శివసేనవారసులమని చాలెంజ్ చేస్తున్నారు. ఆ తంతు పూర్తి కావాలీ అంటే శివసేన వైపు ఉన్న ఎంపీలు కూడా ఇటు జరగాలి. ఇప్పటికే కొందరు షిండే వర్గంలోకి దూకేశారు. మిగిలిన వారు కూడా టైమ్ చూసుకుని ఇటే దారి పడతారు అని షిండే వర్గం ధీమాగా ఉంది.

ఇక ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తన సంఖ్యా బలాన్ని మించి ఎమ్మెల్సీలను గెలుచుకుంది. అంటే శివసేనలోని ఎమ్మెల్యేల తిరుగుబాటే కారణం. ఇపుడు ఆ సీన్ ని రిపీట్ చేసి ఎంపీలు కొత్త రుచి చూపిస్తారా అన్న చర్చ సాగుతోంది. అదెలా అంటే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలంటూ రాహుల్ షివాలే అన్న శివసేన ఎంపీ ఉద్ధవ్ థాక్రేకి లేఖ రాశారు

దాంతో కలకలం చెలరేగింది. మరో వైపు ఇంకో షిండే వర్గం ఎమ్మెల్యే అయితే ఎంపీలు 18 మంది శివసేనకు ఈ రోజు ఉన్నా అందులో నుంచి 12 మంది దాకా తమ రూటే పడతారు అని సంచలన కామెంట్స్ చేశారు. అంటే రాష్ట్రపతి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అన్న మాట. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధులకు శివసేన ఎంపీలు ఓటు చేస్తే పార్టీలో సంక్షోభం ముదిరి పాకాన పడినట్లే.

అపుడు ఉద్ధవ్ థాక్రే చేయగలిగింది కూడా ఏమీ లేదు. బీజేపీ సెంట్రల్ లో ఉంది. స్టేట్ లో ఉంది. దాంతో చక్రం ఎలా తిప్పాలో వారికే తెలుసు. ఉద్ధవ్ థాక్రే ఇలాంటి సీన్లు చూసి తట్టుకోవడం గుండె దిటవు చేసుకోవడమే ఇక మిగిలింది అన్న మాటలూ ఉన్నాయి. మొత్తానికి షిండే ప్రభుత్వాన్ని చేజిక్కించుకుని శివసేన పార్టీని కూడా తాను లాగేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే ఉద్ధవ్ ఎంతగా వగచినా షిండే వ్యూహం ఫలించి ఆయన శివసేనకు కొత్త పెత్తందారు అవడం ఖాయం. ఇదంతా రాష్ట్రపతి ఎన్నికల వేళ జరిగే ముచ్చటగా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.