Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ ఎఫెక్ట్ : ఉత్తరాంధ్రా నుంచి కోస్తా జిల్లాల వరకూ...?

By:  Tupaki Desk   |   27 Sep 2022 11:30 PM GMT
ఎన్టీయార్ ఎఫెక్ట్ : ఉత్తరాంధ్రా నుంచి కోస్తా జిల్లాల వరకూ...?
X
రాజకీయాల్లో చిన్న విషయం చాలు మొత్తం వ్యవహారాన్ని తారు మారు చేస్తుంది. అందుకే ఆచీ తూచీ వ్యవహారం చేయాల్సి ఉంటుంది. వైసీపీ విషయానికి వస్తే అనుభవం తక్కువ దూకుడు ఎక్కువ అన్నట్లుగా మూడేళ్ళ పాలన ఉంది. అలాగే అన్న ప్రాశాన నాడే ఆవకాయ అన్నట్లుగా అనేక విషయాలను ఒకేసారి ముందుకు తీసుకువచ్చి కలగాపులగం చేసుకోవడం కూడా పాలానాపరమైన ప్రధాన లోపంగా కనిపిస్తోంది.

ఇక చూస్తే వైసీపీ సర్కార్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం వైసీపీ పొలిటికల్ మైలేజ్ ని దెబ్బేసేలా ఉందని అంటున్నారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఎన్టీయార్ హెల్త్ వర్శిటీ పేరుని మార్చేసి వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా పెట్టేశారు. అసెంబ్లీలో బండ మెజారిటీ ఉంది కాబట్టి క్షణాలలో ఈ బిల్లు పాస్ అయిపోయింది. సరే తెలుగుదేశానికి శాసనసభలో బలం లేదు, బయట ఆ పార్టీని ఎటూ రాజకీయంగా బదనాం చేస్తున్నారు.

సో విషయం ఇంతే జస్ట్ అలా క్లోజ్ అయిపోతుంది అని అనుకున్నారు. కానీ అక్కడె పప్పులో కాలేశారు. నిజానికి ఎన్టీయార్ రాజకీయ నేత కాదు, ప్రజా నాయకుడు. ఆయన రాజకీయాలతో సంబంధం లేకుండా సంపాదించుకున్న కొండంత ఇమేజ్ ఉంది. అదే ఇపుడు వైసీపీ తీసుకున్న నిర్ణయంతో బిగ్ ట్రబుల్స్ ని క్రియేట్ చేయబోతోంది అని అంటున్నారు. ఎన్టీయార్ అంటే ఒక సామాజికవర్గానికి చెందిన ఒక పార్టీని చెందిన నాయకుడు కాదు, ఆయన అందరి వాడు, పైగా ఆయన రాజకీయాల్లోకి వస్తూనే విప్లవాత్మకమైన మార్పులను ఎన్నో తెచ్చారు.

ఆయన మధ్యతరగతి వర్గాలకు రాజకీయం అందలాలు చూపించారు. ముఖ్యంగా బీసీలను ఆయన ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళి రాజకీయంగా వారిని ఎంతో ఎత్తున నిలబెట్టారు. ఇక ఆయన సంక్షేమ పధకాల రూపకర్త. ఆయన తెలుగు భాషకు ఎంతో సేవ చేశారు. ఇలా ఎన్టీయార్ పాలనలో చాలా మేలు చేశారు. ఆయన్ని జనం ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. పైగా ఆయన సినిమాల్లో రాముడూ క్రిష్ణుడుగా వేసి దేవుడుగా ఉన్నారు.

ఇక ఆయన దివంగతులు అయ్యారు. అలాంటి వారికి ఏమైనా కొత్తగా ఎవరైనా పాలకులు చేస్తారు కానీ వైసీపీ పెద్దలు ఉన్న పేరు తీసివేయారు. కానీ అలాంటి దుస్సాహసానికి వైసీపీ సర్కార్ ఒడికట్టింది. ఈ చర్య వల్ల వైసీపీ గ్రాఫ్ తగ్గినట్లుగా చెబుతున్నారు. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారమే చూసుకుంటే ఈ పేరు మార్పు విషయాన జనాలు ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారుట.

ఉత్తరాంధ్రా జిల్లాలను మొదలుకుని కోస్తా దాకా ఉన్న ఏడు జిల్లాలలో ఎన్టీయార్ పేరు మార్పు ప్రభావం గట్టిగానే ఉందని అంటున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాలు ఈ చర్యతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని అంటున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. బీసీల ఓట్ల మీద వైసీపీ ఎన్నో ఆశలను పెంచుకుంది. అలాంటిది వారు ఎన్టీయార్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని అంటున్నారు. దాంతో ఎన్టీయార్ ని అవమానించలేదు అని చెప్పుకునేందుకు ప్రభుత్వ పెద్దలు పడరాని పాట్లు పడుతున్నారు.

అదే టైం లో ఎన్టీయార్ పేరుని భారీ ఎత్తున పెంచేలా తాము ఏదైనా గట్టి ప్రయత్నమే చేయాలని వైసీపీ సర్కార్ పెద్దలు ఇపుడు సీరియస్ గా ఆలోచిస్తున్నారుట. ఇపుడు అడుసు ఎటూ తొక్కేశారు. కాళ్ళు కడుక్కోవాలి. అందువల్ల ఎన్టీయార్ గౌరవాన్ని పెంచే గట్టి ప్రయత్నం చేసేందుకు వైసీపీ పెద్దలు బాగా బుర్రలకు పని చెబుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఆ పెద్ద పని గట్టి మేలు ఏమిటో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.