Begin typing your search above and press return to search.

టార్గెట్ ఓకే : ఎంపీ అభ్యర్ధులు ఎక్కడ సామీ... ?

By:  Tupaki Desk   |   7 Oct 2022 2:30 PM GMT
టార్గెట్ ఓకే : ఎంపీ అభ్యర్ధులు ఎక్కడ సామీ... ?
X
ఏపీలో వచ్చే ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని అందుకోవాలని ప్రతిపక్ష టీడీపీ ఉవ్విళ్ళూరుతోంది. ఏకంగా 160 అసెంబ్లీ సీట్లు వీలైతే పాతికకు పాతిక ఎంపీ సీట్లూ కూడా దక్కించుకోవాలని బిగ్ ప్లాన్ తో ఉంది. ఆశలు వరకూ చూస్తే బాగానే ఉన్నాయి. కానీ దానికి తగిన కసరత్తు ఉందా అంటే అదే కదా అసలైన సమస్య అన్నట్లుగా టీడీపీలో ప్రస్తుతం సీన్ ఉందిట.

ఏపీలో చూస్తే పాతిక ఎంపీ సీట్లలో దాదాపుగా పది వరకూ కీలకమైన స్థానాలలో టీడీపీకి క్యాండిడేట్లు లేరని అంటున్నారు. దాంతో ముందు దాని మీద ఫోకస్ పెట్టాల్సిందే అని సూచనలు వస్తున్నాయిట. రేపటి ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తే వారే ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు అన్నది ష్యూర్. ఎందుకంటే ఈసారి అక్కడ ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే సీన్ అయితే లేదు.

దాంతో టీడీపీ తన ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఎంపీ అంటే చిన్న విషయం కాదు, ఏడు అసెంబ్లీ సీట్లను కలుపుకుని పోవాలి. దాంతో పాటు ఆర్ధికంగా కూడా అన్ని రకాలుగా తట్టుకుని నిలబడాలి. దాంతో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి బిగ్ షాట్స్ ఆ రేంజిలో దొరుకుతారా అన్నది ఒక చర్చగా ఉంది. అదే టైం లో చాలా మంది నాయకులు ఎందుకొచ్చిన ఢిల్లీ పదవి. హ్యాపీగా ఎమ్మెల్యేగా పోటీకి దిగితే ఖర్చుకు ఖర్చు తగ్గుతుంది, లక్ సమకూరితే మినిష్టర్ పోస్టు కూడా వస్తుంది అని లెక్కలేసుకుని నో చెప్పేస్తున్నారుట.

దీంతో రాయలసీమ నుంచి మొదలెడితే కోస్తా జిల్లాల దాకా కీలకమైన ఎంపీ సీట్లలోనే పోటీకి అభ్యర్ధులు గట్టి వారు లేరు అంటున్నారు. ముందుగా అనంతపురం ఎంపీ సీటు తీసుకుంటే అక్కడ జేసీ దివాకరరెడ్డి కుమారుడు పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయిన తరువాత ఆయన క్యాడర్ కి తో పెద్దగా కలవడంలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది చూడాలని అంటున్నారు. కాకపోతే ఇక్కడ అభ్యర్ధిని వెతకాలి.

అలాగే గోదారి జిల్లాలఓ చూస్తే కాకినాడ నుంచి 2019 ఎన్నికల్లో చలమలశెట్టి సునీల్ టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే ఆయన వైసీపీలో చేరడంతో టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేసేందుకు ఈ రోజుకీ ఎవరూ లేరు. ఇది చాలా కీలకమైన నియోజకవర్గం. మరి టీడీపీ ఇక్కడ ఏం చేస్తుంది అన్నది చూడాలని అంటున్నారు.

అలగే చిత్తూరు ఎంపీగా 2019 ఎన్నికల దాకా పోటీ చేస్తూ వస్తున్న సినీ నటుడు కమ్ పొలిటీషొయన్ అయిన శివప్రసాద్ మరణించాక ఇక్కడ సరైన అభ్యర్ధి అయితే టీడీపీకి లేరు అంటున్నారు. చిత్రమేంటి అంటే చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులోని ఈ ఎంపీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే కీలకమైన నేత కావాలని అంటున్నారు.

అలాగే తిరుపతి ఎన్నికల కోసం అప్పటికపుడు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని తెచ్చి పోటీకి దించారు. అయితే ఆమె ఓడిన తరువాత చూస్తే పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. వచ్చే సారి ఆమె ఎంపీకి పోటే నో చెబుతారు అనే అంటున్నారు. తిరుపతిలో పోటీ చేసేవారి కోసం టీడీపీ ఇప్పుడు వెతుక్కోవాల్సిందే అని అంటున్నారు.

అలాగే నరసరావుపేట విషయానికొస్తే 2019 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు, ఓడారు. ఆయన మళ్ళీ పోటీకి రెడీ అన్నా వయోభారం దృష్ట్యా టిక్కెట్ ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. అలాగే, 2019లో బాపట్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మాల్యాద్రి శ్రీరామ్‌ ఓడిపోయారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఎక్కడా లేకపోవడంతో తాజాగా టీడీపీ వెతుకుతున్నట్లు టాక్.

మచిలీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును పోటీకి పెట్టవద్దు అని పార్టీ నాయకులే అంటున్నారుట. ఆయనకే టికెట్ ఇస్తే సహకారం ఉండదని చెబుతున్నారుట. దాంతో ఇక్కడ కూడా అభ్యర్ధిని వెతికి పట్టుకోవాలని అంటున్నారు. దీంతో పాటు రాజమండ్రీ విషయం తీసుకుంటే అక్కడ 2019 ఎన్నికల్లో సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు రూపాదేవి పోటీ చేసి ఓడారు. ఆ తరువాత రాజకీయానికి స్వస్తి చెప్పేశారు. దాంతో ఈ సీటు మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంది అంటున్నారు.

ఇక కర్నూల్ సీటు చాలా ఇంపార్టెంట్. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరావు ఈ సీటు నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఆయన వయోభారం దృష్ట్యా టికెట్ ఇవ్వకపోవచ్చు. కానీ గట్టి క్యాండిడేట్ ఇక్కడ కూడా టీడీపీకి కావాలని అంటున్నారు. కడప ఎంపీ సీటుకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని పోటీకి దించారు కానీ ఆయన ఓడిన తరువాత బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ కూడా అభ్యర్ధి వెతుకులాట టీడీపీకి అవసరం అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఎంపీ అభ్యర్ధులు కావాలని టీడీపీలో ఇపుడు వినిపిస్తున్న మాట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.