Begin typing your search above and press return to search.

బాబుకు తెలియ‌ని టెక్నిక్ జగ‌న్ పాటించారా ?

By:  Tupaki Desk   |   29 Jun 2022 11:30 AM GMT
బాబుకు తెలియ‌ని టెక్నిక్ జగ‌న్  పాటించారా ?
X
నాన్న వైఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హా సూత్రం ఒక‌టి జగ‌న్ చాన్నాళ్ల‌కు పాటించారు. అదేవిధంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరు ప్ర‌స్తావించి,ఆయ‌న మాదిరిగానే మీరు కూడా ఈ జిల్లాకు సాయం చేయాలి అని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన అడ‌గగానే ఉదారంగా నిధులు ఇచ్చారు. ఈ రెండు మొన్న‌టి శ్రీ‌కాకుళం జిల్లాలో సీఎం సాగించిన ప‌ర్య‌ట‌న‌లో బాగా వెలుగులోకి వ‌చ్చిన విష‌యాలు.

అదేవిధంగా చిన్న‌వాళ్ల‌ను పట్టించుకోకుండా వెళ్లిపోవ‌డం అన్న‌ది చేయ‌కుండా వారితో వీలున్నంత వ‌ర‌కూ న‌వ్వుతూ మాట్లాడారు. వారి విజ్ఞాప‌న‌లు విన్నారు. వారితో ఫొటోలకు దిగారు. ఇంకా చెప్పాలంటే పెద్ద, పెద్ద నాయ‌కుల క‌న్నా ఈసారి చోటా మోటాలే సీఎం స‌భ‌లోనూ హెలిప్యాడ్ ద‌గ్గ‌ర మిగిలిన చోట్లా సంద‌డి చేశారు. ఆ విధంగా సీఎం స‌భ చిన్నోళ్ల‌కు పెద్ద ప్రాధాన్య‌మే ఇచ్చింది. ఈ పాటి టెక్నిక్ తెలుగుదేశం అధినేత బాబుకు తెలియ‌దా ?

ఎందుకంటే నిన్న‌మొన్న‌టి మ‌హానాడులో దివ్య‌వాణికి అవ‌మానం జ‌రిగింది. దాంతో ఆమె ఆ పార్టీపై మండిప‌డిపోయారు. ఏం లేదు ఆ పాటి కుర్చీ వేసి కూర్చోబెడితే త‌ప్పేంట‌ని? చాలామంది టీడీపీని ఉద్దేశించి కామెంట్లు చేశారు. ఇదే సంద‌ర్భంలో మొన్న‌టి వేళ వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయింద‌ని, చోటామోటాల‌కూ మంచి ప్రాధాన్య‌మే ఇచ్చార‌ని రుజువైంది.

ఆ విష‌య‌మై జ‌గ‌న్ మంచి మార్కులే కొట్టేశారు. చిన్న చిన్న లీడ‌ర్ల‌తో స‌హా అంద‌రితోనూ బాగా మాట్లాడి వెళ్లారు. చాలా మందిని దీవించి వెళ్లారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అప్రాధాన్య వ్య‌క్తులు కొంద‌రు స్టేజీపై హ‌డావుడి చేసినా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. వారితో కూడా మాట్లాడారు. పార్టీ ప‌ద‌వులు లేక‌పోయినా చాలా మంది స్టేజీపై కూర్చొన్నారు. వారితో కూడా వెళ్తూ వెళ్తూ మాట్లాడారే త‌ప్ప ఎక్క‌డా వారించ‌లేదు.

వాస్త‌వానికి సీఎం టూర్ మొత్తం ఇదే విధంగా సాగింది. ఒక్క ప్రొటోకాల్ వివాదం త‌ప్పించి మిగ‌తా వివరం అంతా హాయిగానే సాగిపోయింది. ఇది అధికార పార్టీ కార్య‌క్ర‌మమా లేదా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మ‌మా అన్న డౌట్ కూడా చాలా మందికి వ‌చ్చే విధంగానే ఈ కార్య‌క్ర‌మం సాగింది. ముఖ్యంగా శ్రీ‌కాకుళం న‌గ‌ర నాయ‌కులు చాలా మంది సీఎంతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

వాళ్లంద‌రినీ ఆప్యాయంగానే ప‌ల‌క‌రించి, వారికి ఉన్న చిన్న చిన్న ఫొటో స‌ర‌దాలు కూడా తీర్చారు. ఇంకా చెప్పాలంటే స్టేజీ మీద మంత్రులు, ఎమ్మెల్యే క‌న్నా న‌గ‌ర నాయ‌కులే ఎక్కువ‌గా హ‌డావుడి చేశారు. మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ల‌ను కూడా ఆయ‌న పేరు పేరునా ప‌ల‌క‌రించి వెళ్లారు.ముఖ్యంగా మ‌హిళా నాయ‌కులు ఆయ‌న ఆశీర్వాదాలు తీసుకునేందుకు పాదాభివంద‌నాలు చేస్తే వ‌ద్ద‌ని వారించారు. ఏ విధంగా చూసిన చంద్ర‌బాబు క‌న్నా జ‌గ‌న్ ఈ ఒక్క విష‌యంలో శ్రీ‌కాకుళం న‌గ‌ర, జిల్లా నాయ‌కుల వ‌ద్ద మంచి మార్కులే కొట్టేశారు.