Begin typing your search above and press return to search.

టీడీపీలో సరికొత్త రాజకీయం ?

By:  Tupaki Desk   |   25 Nov 2021 7:38 AM GMT
టీడీపీలో సరికొత్త రాజకీయం ?
X
తెలుగు దేశం పార్టీ లో ఇక నుండి కొత్త రకం నేతలకే ప్రోత్సాహముంటుందని చంద్ర బాబు నాయుడు ప్రకటించారు. రేణిగుంట దగ్గర వర్షాల బాధితులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఇక నుండి వైసీపీ నేతలను ఢీ అంటే ఢీ అనే వాళ్ళకే టీడీపీలో ప్రోత్సాహముంటుందని చెప్పేశారు. అలాంటి నేతలనే తాను ప్రోత్సహించారట. చంద్రబాబు తాజా నిర్ణయమే కరెక్టయితే మరి ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్న నేతలు ఎలాంటి వారు అనే సందేహం వస్తోంది.

ఇదే సమయం లో వైసీపీ నేతల తో ఢీ అంటే ఢీ అనేంత స్థాయి నేతలు అసలు టీడీపీలో ఉన్నారా ? ఉన్నా ఎంతమందున్నారు ? అనే చర్చ కూడా మొదలైంది. నిజానికి ఇపుడు చంద్రబాబు చెప్పడం కాదు కానీ పార్టీ లోని నేతల్లో చాలా మంది అలాంటి వారే ఉన్నారు. ప్రత్యర్ధులను ఢీ అంటే ఢీ అనే వారే ఉన్నారు. అయితే వారి లో చాలా మంది వివిధ కారణాలతో సైలెంట్ అయి పోయారు. అనంతపురం లో జేసీ బ్రదర్స్ వ్యవహారం చంద్రబాబు చెప్పినట్లే ఉంటుంది.

అధికారం లో ఉన్న సమయం లో వీళ్ళ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువై పోవటం తోనే జనాలు వీళ్ళందరినీ కాదని వైసీపీ కి పట్టం కట్టారు. ఇక పరిటాల సునీత, శ్రీరామ్ కూడా ఇదే కోవలోకి వస్తారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరి లాంటి చాలా మంది నేతల పద్దతిదే. కాకపోతే అప్పట్లో అధికార పార్టీలోనే ఆధిపత్య పోరు పెరిగి పోవటంతో మొత్తం పార్టీనే కుప్పకూలిపోయింది. కర్నూలులో భూమా ఫ్యామిలీ, ఏవీ సుబ్బారెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబం ఏమీ తక్కువ తినలేదు.

కడప లో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సతీష్ రెడ్డి, బిటెక్ రవి లాంటి నేతలు ప్రత్యర్ధులతో సై అంటే సై అన్నవాళ్ళే. వీళ్ళు కాకుండా అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, దేవినేని ఉమ, కేశినేని నాని, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, కోడెల కుటుంబం, కరణం బలరామ్, ఆమంచి కృష్ణమోహన్, గొట్టిపాటి రవి, శిద్ధా రాఘవరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, కూన రవికుమార్ లాంటి నేతలు చాలామందే ఉన్నారు టీడీపీలో. వీళ్ళంతా అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా ప్రత్యర్ధుల పై రెచ్చి పోయిన వారే.

ఇలాంటి వారిలో కొందరు తర్వాత వైసీపీలో చేరినా మిగిలిన వారంతా ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. ఇంత మందిని పార్టీ లోనే పెట్టుకుని ఇంకా ఢీ అంటే ఢీ అనే నేతలనే ప్రోత్సహిస్తానని చెప్పటమే ఆశ్చర్యం గా ఉంది. పై నేతల్లో చాలా మంది ఇప్పటికే వారసులను ప్రమోట్ చేస్తున్నారు. తమ తండ్రుల తరపున నియోజకవర్గాల్లో ఫుల్లుగా బిజీగా తిరుగుతున్నారు. పార్టీ లో వారసులను కాకుండా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరేం చేస్తారో చూడాలి.