Begin typing your search above and press return to search.

ఈ వీడియో చూశాక.. జగన్ పరామర్శపై కొత్త డౌట్లు ఖాయం

By:  Tupaki Desk   |   5 Dec 2021 6:42 AM GMT
ఈ వీడియో చూశాక.. జగన్ పరామర్శపై కొత్త డౌట్లు ఖాయం
X
గతంలో మాదిరి పరిస్థితి లేదు. మీడియా చూడని కొత్త యాంగిల్స్ ను నిశితంగా పరిశీలించటం.. వాటిని జనాలకు షేర్ చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇలా చేసే వారికి సోషల్ మీడియాలోనూ..వాట్సాప్ గ్రూపుల్లో ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటి పనే చేసిన ఒక నెటిజన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. టీడీపీ సపోర్టర్ గా చెప్పుకునే సదరు వ్యక్తి.. తాజాగా వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించిన ఒక క్లిప్ ను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన విశ్లేషణ ఆసక్తికరంగానే కాదు.. ఔను కదా? ఇలాంటివి మీడియా ఎందుకు హైలెట్ చేయదు? అన్న సందేహం కలుగక మానదు. ఇంతకీ ఈ వీడియోలో ఉన్నదేమంటే.. పరామర్శకు వెళ్లిన సందర్భంగా బాధితుల వరుసలో ఉన్న ఒక మహిళ చేసిన కామెంట్లే ప్రధానమని చెప్పాలి. సాధారణంగా ఏదైనా అనూహ్య ఘటన చోటు చేసుకున్నప్పుడు.. ఒక భారీ విషాదం జరిగినప్పుడు.. ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం సాధారణం.

తమ ఆవేదనను ఓపెన్ గా చెప్పుకునేందుకు ఏ మాత్రం మొహమాట పడరు. అలాంటి తీరుకు భిన్నంగా.. ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని.. తామే తప్పు చేశామని.. అందుకే అంతటి విషాదం చోటుచేసుకుందన్న మాటను ఒక మహిళ చెప్పిన క్లిప్ ను తనదైన శైలిలో విశ్లేషణ చేసిన వీడియో ఇప్పుడు చర్చగా మారింది. భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తటం.. దాని గురించి సచివాలయ సిబ్బంది తమను ముందే హెచ్చరించారని.. కానీ తామే.. ఏళ్లకుఏళ్లు ఉంటున్నాం. ఎప్పుడైనా వరదను చూశామా? ఏదో చెబుతున్నారన్న నిర్లక్ష్యంతో ఉండిపోయామని.. ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదంటూ సర్టిఫికేట్ ఇచ్చిన వైనం ఇంట్రస్టింగ్ గా అనిపించక మానదు.

ఈ వీడియోపై సదరు వ్యక్తి చేసిన విశ్లేషణను పక్కన పెడితే..కొన్ని సాంకేతిక అంశాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ.. సదరు మహిళ చెప్పినట్లుగా జనాలే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే..అధికారులు ఎప్పుడూ ఆ కోణంలో ఎందుకు మాట్లాడలేదు? తామెంత ప్రయత్నం చేసినా.. ప్రజల మొండితనం కారణంగానే వరదలో భారీ ఎత్తున గల్లంతు అయ్యారన్న వివరణను ప్రభుత్వం ఇచ్చేది కదా? ఇదంతా ఒక ఎత్తు అయితే.. వరద నీరు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించిన తర్వాత.. ప్రజలు సానుకూలంగా స్పందించకుండా.. లైట్ తీసుకుంటే.. వారిని పోలీసుల సాయంతో అయినా బలవంతంగా ఖాళీ చేయటం చూస్తుంటాం.

మరి..సదరు మహిళ చెప్పినట్లుగా ప్రజలు తప్పుచేస్తుంటే.. వారు అలా చేయటాన్ని పోలీసులు.. రెవెన్యూ అధికారులు చూస్తూ ఉండిపోయారా? అన్నది ఒక డౌట్. వరద ముప్పు ఉందన్న సమాచారం వచ్చినంతనే.. యుద్ధ ప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఒకవేళ.. నిజంగానే అధికారులు చెప్పినా వినకుండా మొండిగా ప్రజలు కదలకుండా ఉన్నారనే అనుకుందాం. ఇలాంటప్పుడు వరద వచ్చినప్పుడు ప్రజలకు సాయం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలిగా? మరి.. అలాంటిదేమీ ఎందుకుచోటు చేసుకోలేదు? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారెవరు? అన్నది అసలు ప్రశ్న.