Begin typing your search above and press return to search.

ఇలాంటి మాటల వల్లే కదా మోడీపై వ్యతిరేకత పెరుగుతున్నది?

By:  Tupaki Desk   |   14 Jun 2021 3:44 AM GMT
ఇలాంటి మాటల వల్లే కదా మోడీపై వ్యతిరేకత పెరుగుతున్నది?
X
రాజ‌కీయాల్లో ఉండే నేత‌ల్లో కొంద‌రంటే ప్ర‌త్యేకంగా భారీ అభిమానం ఉంటుంది. అలాంటి అభిమానం సొంతం చేసుకున్న వారిలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఒక‌రు. తొలిద‌ఫా ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్ట‌క ముందు, చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అయితే, అన్ని వేళ‌లు ఒకేలా ఉండ‌వు క‌దా! ముఖ్యంగా క‌రోనా క‌ల్లోలం మోడీ గ్రాఫ్ ప‌డిపోతుంద‌న్న టాక్ వ‌స్తోంది. దానికంటే ఎక్కువ‌గా భారీగా పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో మోడీ ఫ్యాన్స్ కూడా హ‌ర్ట‌వుతున్నారంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను అభిమానించే వారుంటారు. అలాంటి క‌రడుగ‌ట్టిన అభిమానులు కూడా ఫీల‌య్యే ప‌రిణామం తాజాగా జ‌రిగింది.

గ‌త కొంత‌కాలంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ను అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుల‌కు అనేక రూపాల్లో భారం ప‌డుతోంది. రోజురోజుకీ కొన్ని పైసలు పెరుగుతూ పలు రాష్ట్రాల్లో సెంచరీని దాటేశాయి. మరికొన్ని రాష్ట్రాల్లో వందకు చేరువలో ఉంది. మ‌రోవైపు ధ‌ర‌ల పెరుగుద‌ల విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోలేక‌పోవ‌డాన్ని అనేక‌మంది త‌ప్పుప‌డుతున్నారు. అయితే ఈ స‌మ‌యంలో తీపిక‌బురు చెప్పాల్సిన కేంద్రం షాకింగ్ వార్త‌ను ముందుకు తెచ్చింది. ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సమస్యాత్మకం అయినప్పటికీ దీన్ని ప్రజలు ఆమోదించాలన్నారు. ఈ డబ్బులను ప్రజలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాల అమల కోసం ఆదా చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

కొన్ని రోజులుగా దేశంలో పెట్రో ధరలు మండిపోతుండ‌టాన్ని కేంద్ర మంత్రి త‌న‌దైన శైలిలో స‌మ‌ర్థించుకున్నారు. ‘ప్రస్తుత పెట్రో ధరలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే విషయాన్ని అంగీకరిస్తున్నా. కానీ ఈ ఏడాది వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో సంక్షేమ పథకాల అమలు కోసం మేం డబ్బులను కాపాడుతున్నాం. పేద ప్రజలకు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఎనిమిది నెలల పాటు ఆహార ధాన్యాలు అందించేందుకు మోడీ సర్కార్ లక్ష కోట్లు ఖర్చు పెట్టింది. పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో వేలాది కోట్ల రూపాయలను వేశాం. ఇటీవ‌లే కనీస మద్దతు ధరనూ పెంచాం. ఇవన్నీ ఒకే సంవత్సరంలో చేశామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అంటే, పౌరుల‌కు సంక్షేమం అందాలంటే మ‌న జేబు నుంచే పెట్రోల్ చార్జీలు పెంచాల‌నే కొత్త సూత్రాన్ని మోడీ స‌ర్కారు సూత్రీక‌రించింది.