Begin typing your search above and press return to search.

నేతాజీ.. నీవెక్క‌డ‌?

By:  Tupaki Desk   |   23 Jan 2021 12:30 PM GMT
నేతాజీ.. నీవెక్క‌డ‌?
X
సుభాష్ చంద్రబోస్..' ఈ పేరు వింటే.. యువ‌త‌ నరాలు ఉప్పొంగుతాయి! తెలియని ఉద్వేగం ఆవహిస్తుంది! దేహం రోమాంచితమవుతుంది! భ‌ర‌త‌మాత దాస్య శృంఖ‌లాలు తెంచాలంటే సాయుధ సంగ్రామ‌మే మార్గ‌మ‌ని న‌మ్మ‌ని నేతాజీ.. 'మీరు నాకు రక్తాన్నివ్వండి... నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను' అంటూ.. దేశ ప్ర‌జ‌ల్లో స్వాతంత్య్ర కాంక్ష‌ను ప్ర‌జ్వ‌లింప‌జేశాడు. అటు అతివాదం.. ఇటు మిత‌వాదం త‌మ‌దైన పంథాలో పోరాటం న‌డిపి, మొత్తానికి బ్రిటీష్ వ‌ల‌స‌పాల‌కుల‌ను దేశం నుంచి త‌రిమేశారు. భార‌త‌దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది.. ప్ర‌జ‌లు స్వేచ్ఛావాయులు పీలుస్తున్నారు. నేటికి 70 వ‌సంతాలు దాటిపోయాయి. కానీ.. భ‌ర‌త‌మాత ముద్దుబిడ్డ నేతాజీ జాడ నేటికీ అంతుచిక్క‌ని ర‌హ‌స్య‌మే! ఎప్పుడు చనిపోయాడు? ఎక్కడ చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం ఇప్ప‌టికీ దేశ‌ ప్ర‌జ‌ల‌కు తెలియ‌దు. మ‌రి, ఈ అంశం ఇప్పుడెందుకు తెర‌పైకి వ‌చ్చిందంటే.. రాజ‌కీయానికి అవ‌స‌రం వ‌చ్చింది. బోస్ నడయాడిన నేల‌పై త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అందుకే.. నేత‌లు ఇప్పుడు ఆయ‌న నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నారు. దీంతో.. నేతాజీ మ‌ర‌ణం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

మ‌హావీరుడి జ‌న‌నం..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్‌లో జన్మించాడు. అయితే.. ఆయన కటక్ లో జన్మించినప్పటికీ.. విద్యాభ్యాసం కలకత్తా కేంద్రంగా సాగింది. ఈ క్రమంలో భారత స్వాతంత్య్ర పోరాటంలోకి అడుగుపెట్టిన బోస్.. కలకత్తాలోనే ఉద్యమం కొనసాగించారు. బ్రిటీష్ పాలకులను దేశం నుంచి తరిమికొట్టడానికి ఇతర దేశాల మద్దతు కూడగట్టేందుకు ఎంతో ప్రయత్నించారు బోస్. రష్యా మొదలు చాలా దేశాలు తిరిగారు. ఈ క్రమంలోనే 1945లో ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని చెబుతారు. కానీ.. దానిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.

కొనసాగుతోన్న మిస్టరీ..
75 ఏళ్లు గడిచినప్పటికీ నేతాజీ మృతి మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. బోస్ మృతిపై జస్టిస్ ముఖర్జీతో వేసిన ఏకసభ్య విచారణ కమిటీ 2005లో ఓ నివేదిక సమర్పించింది. అందులోనూ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని పేర్కొనడం గమనార్హం. అయితే.. నేతాజీ ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో గుమ్నామీ బాబాగా బతికే ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. 1960వ దశకం నుంచి 1987 వరకు బోస్ గుమ్నామీ బాబాగా జీవించి ఉన్నారని, ఆయనకు పలువురు శిష్యులు కూడా ఉండేవారని ప్రచారం జరిగింది.

ఎవరీ బాబా..?
యూపీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం గుమ్నామీ బాబా ఎవరు అని తెలుసుకోవాలని ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఓ రిపోర్టు ఇచ్చింది. అయితే.. ఆ నివేదిక మాత్రం బయట పెట్టలేదు. గుమ్నీ బాబా అనే వ్యక్తిని అప్ప‌ట్లో ఇంటెలిజెన్స్ వర్గాలు నియమించాయని, ప్రజ‌ల్లో అయోమ‌యం సృష్టించేందుకే ఇలా చేశార‌ని నివేదిక‌లో పేర్కొన్న‌ట్టు స‌మాచారం. బోస్ ఎక్క‌డో ఒక చోట‌నుంచి వ‌స్తే.. ఈ బాబానే అస‌లు నేతాజీగా చూపించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని చెబుతుంటారు. ఇలాంటి బాబాలు దేశంలో ప‌లు చోట్ల ఉండేవార‌ని ప్ర‌చారంలో ఉంది. అప్పుడు అధికారంలో ఉన్న‌వారికి రాజ‌కీయంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఇలా చేశార‌ని చెబుతుంటారు. అయితే.. ఇందులో వాస్త‌వం ఎంత అనేది ఎవ‌రికీ తెలియ‌దు.

విమానంలో బోస్ లేడా..?
బోస్ మ‌ర‌ణించార‌ని చెప్పే స‌మ‌యానికి రెండో ప్ర‌పంచ యుద్ధం జ‌రుగుతోంది. ఆ సమయంలో యునైటెడ్ సోవియట్ యూనియన్ లో బోస్ ఉన్నారని సమాచారం. అప్పుడు జరిగిన విమాన ప్రమాదంలోనే బోస్ మరణించారని ప్రచారంలో ఉంది. అయితే.. ఢిల్లీకి చెందిన ఇక్బాల్ చంద్ర మల్హోత్రా అనే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ వర్షన్ మాత్రం మరో వాదన వినిపించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో సుభాష్ చంద్రబోస్ తప్పించుకున్నారని చెప్పారు. అయితే.. అందరూ అనుకుంటున్నట్లుగా అప్పుడు విమానంలో ఆయన వెళ్లలేదని.. జర్మనీకి చెందిన సబ్‌మెరైన్‌లో సింగపూర్‌ నుంచి వ్లాడివాస్తోక్‌కు వెళ్లారని ఆయన చెప్పారు. ఇక్కడి నుంచే యూఎస్ఎస్‌ఆర్‌కు చేరుకున్నట్లు చెప్పారు మల్హోత్ర.

ఆ తర్వాత ఎటు వెళ్లారు?
నేతాజీ వ్లాడివాస్తోక్‌లో దిగిపోగానే ఆయన ప్రయాణించిన సబ్‌మెరైన్ టోక్యోకు బయలుదేరిందని మల్హోత్రా చెప్పారు. ఇక వ్లాడివాస్తోక్‌లో దిగిన నేతాజీ ఏమైపోయారన్న విషయం పూర్తిగా ఎవరికీ తెలియదన్నారు మల్హోత్రా. ఈ వాదన ఇలా ఉండగా.. రష్యాలో కొన్నేళ్ల పాటు పరిశోధన చేసిన పురబీ రాయ్ మరో విషయం చెప్పారు. అప్పటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్.. మన బోస్ ను ఎక్కడ ఉంచాలనే విషయమై 1946లో తన ముగ్గురు సన్నిహితులతో చర్చించారని పురబీ రాయ్ చెపుతున్నారు. మరి, ఈ లెక్కన బోస్ రష్యాలోనే ఉన్నారా? అన్నది తేల‌లేదు.

1946లో బోస్ స్పీచ్ ఇచ్చారా?
బోస్ విమాన ప్రమాదంలో 1945లో చనిపోయారని చెబుతుండగా.. 1946లో ఆయన విదేశాల నుంచి స్పీచ్ ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. నేతాజీకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ 2016లో పరిశీలిస్తున్న సమయంలో ఓ ఫైల్ బయటపడిందట. అందులో 1945 డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 1946 మధ్య విదేశాల నుంచి సుభాష్ చంద్రబోస్ మాట్లాడినట్లుగా ఉందట. బోస్ స్పీచ్ రేడియో ద్వారా ప్రసారం కాగా.. అప్పటి కలకత్తా గవర్నర్ హౌజ్‌లోని ఐబీ స్టేషన్ గుర్తించిందని చెబుతుంటారు. ఆ స్పీచ్ లో.. బోస్ ఇండియాకు తిరిగిరావడం ఖాయమని, దేశానికి స్వాతంత్ర్యం రావడం కూడా తథ్యమనే సంభాషణలు ఉన్నట్టు సమాచారం.

బ్రిటీష్ ప్రధాని కీలక ప్రకటన..
అయితే.. సుభాష్ చంద్రబోస్ ఎప్పటికీ భారత్ కు తిరిగి రాలేదు. ఆయన గురించిన వివరాలు కూడా బయటకు రాలేదు. దీంతో సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడో అక్కడే ఉండనివ్వండంటూ అప్పటి బ్రిటిష్ ప్రధాని 1945 అక్టోబర్ 25న ఓ ప్రకటన చేశారు. అయితే.. నేతాజీని స్టాలినే దాచి ఉంటాడనే ప్రచారం తెరపైకి వచ్చింది. బ్రిటీషర్లకు నెహ్రూ మద్దతుగా ఉన్నారని, కాబట్టి, ఆయనకు వ్యతిరేకంగా నేతాజీని అస్త్రంగా వినియోగించాలని.. స్టాలిన్ భావించారనే వాదన కూడా ఉంది. అయితే.. 1953లో స్టాలిన్ మృతి చెందారు. ఆయన తర్వాత వచ్చిన సోవియట్ యూనియన్‌ కొత్త నాయకులు నెహ్రూతో చేతులు కలిపి నేతాజీని సైబేరియాలో వదిలేశారనే రూమర్స్ వచ్చాయి. కానీ.. ఏది వాస్తవం అనే విషయం మాత్రం ఇప్పటికీ తేలలేదు.

బోస్ చుట్టూ నేటికీ రాజకీయం..
సుభాస్ చంద్రబోస్ మరణం గురించి నాడు మొదలైన రాజకీయం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు వచ్చే ప్రతీ ఐదేళ్లకోసారి బోస్ మరణ వార్త తెరపైకి రావడం.. ఆ తర్వాత ఆయనలాగే కనుమరుగై పోవడం పరిపాటిగా మారింది. కేవలం ఎన్నిక సమయంలోనే బోస్ గురించి మాట్లాడే నేతలు.. ఆయన మరణ రహస్యాన్ని ప్రజలకు చెప్పాలనే నేతలు.. ఆ తర్వాత మౌనముద్రలోకి వెళ్లిపోతారు.

అదే బోస్ కు నిజమైన నివాళి..
బోస్ మరణానికి సంబంధించిన డాక్యుమెంట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా ఉన్నాయనే ప్రచారం ఉంది. అదేవిధంగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా మరికొన్ని ఉన్నాయి. ఈ పత్రాల్లో బోస్ మరణానికి సంబంధించిన సమాచారం తప్పకుండా ఉంటుందనేది మెజారిటీ ప్రజలు నమ్ముతున్న విషయం. దీన్ని నిజం చేస్తూ.. గత ఎన్నికలప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొన్ని డాక్యుమెంట్లను రిలీజ్ చేశారు కూడా. కేంద్రం తన దగ్గరున్న డాక్యుమెంట్లను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు కూడా. కానీ ఆయన మరణ రహస్యం బయటకు రాలేదు. కానీ.. బోస్ ఏమయ్యాడనే వాస్తవం తెలుసుకోవడం ఈ దేశ ప్రజల హక్కు. భరత మాత ముద్దుబిడ్డగా దేశం కోసం బోస్ చేసిన పోరాటం మహిమాన్వితమైనది. కాబట్టి, ఆయన మరణ రహస్యాన్ని దేశం ముందు ఉంచడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అనడంలో సందేహం లేదు.