Begin typing your search above and press return to search.

మోడీ..జిన్ పింగ్ కూర్చున్న కుర్చీలకు పోటీ ఎంతంటే?

By:  Tupaki Desk   |   15 Oct 2019 6:32 AM GMT
మోడీ..జిన్ పింగ్ కూర్చున్న కుర్చీలకు పోటీ ఎంతంటే?
X
అప్పటివరకూ రాని ఆలోచనలు కొన్ని ఆఖరి క్షణాల్లో వస్తుంటాయి. వాటికి వచ్చే పేరు ప్రఖ్యాతులు అంతా ఇంతా కాదు. తాజాగా ఇలాంటి పరిస్థితే చైనా అధ్యక్షుడి చెన్నై టూర్ లో చోటు చేసుకుంది. దేశ ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు ఇరువురి మధ్య మీటింగ్ కు సంబంధించి ఆఖరి క్షణంలో వచ్చిన ఆలోచన గ్రాండ్ సక్సెస్ కావటమే కాదు.. మంచి పేరు వచ్చింది.

మహాబలిపురంలో పాండవ రథాల ప్రాంగణంలో ఇరువురు దేశాధినేతలు కుర్చీల్లో కూర్చొని కొబ్బరి బోండాలు తాగుతూ సేద తీరిన వైనం తెలిసిందే. మరి.. ఆ ఆలోచన ఎవరిది? ఎప్పుడొచ్చింది? ఈ భేటీకి వినియోగించిన కుర్చీలు ఎక్కడవి? ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? లాంటి ప్రశ్నలు వేసుకుంటే.. వచ్చే సమాధానాలు ఆసక్తికరంగా ఉంటాయి.

ఇరువురు దేశాధినేతల మీటింగ్ కు సరిగ్గా రెండు గంటల ముందు దీని గురించి అధికారులకు ఆలోచన వచ్చిందట. ఇద్దరు అధినేతల్ని కుర్చీల్లో కూర్చొబెట్టి కొబ్బరి బొండాలు ఇస్తే బాగుంటుందన్న ఆలోచనను అమలు చేసేందుకు తొలుత కుర్చీలు ఎక్కడి నుంచి తేవాలన్న దానిపై కాసేపు వాకబు నడిచిందట.

రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులు గిండిలోని ఫర్నీచర్ షోరూంను సంప్రదించి.. అప్పటికప్పుడు రెండు టేకు కుర్చీల్ని.. ఒక టీపాయ్ ను.. అనువాదకులు (ట్రాన్స్ లేటర్స్) కూర్చునేందుకు రెండు కుర్చీలను హుటాహుటిన తీసుకొచ్చారు. వాటికి డబ్బులు కూడా చెల్లించలేదు. తర్వాత చెల్లిస్తామని షోరూం యజమానికి చెప్పి తీసుకొచ్చారు.

ఈ భేటీ హైలెట్ కావటంతో దేశాధినేతలు కూర్చున్న కుర్చీలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఆ కుర్చీల కోసం రాష్ట్ర ప్రజాపనులు శాఖ.. కేంద్రప్రభుత్వ అధికారుల మధ్య పోటీ నడుస్తుంది. తమకు కావాలంటే తమకు కావాలని వారు కోరుతున్నారు.

ఈ భేటీకి గుర్తుగా తమ దగ్గరే కుర్చీలు ఉంచుకుంటామని తమిళనాడు రాష్ట్ర అధికారులు చెబుతుంటే.. చారిత్రక భేటీకి నిదర్శనంగా ఈ రెండు కుర్చీలను తాము భద్రపరుస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు కోరుతున్నారట. కొసమెరుపు ఏమంటే.. ఈ కుర్చీల్ని అప్పుకు ఇచ్చిన షోరూం యజమాని.. మీరు నాకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.. వాడిన కుర్చీల్ని వెనక్కి ఇచ్చేస్తే చాలు..అదే పదివేలు అని కోరుతున్నారట. మొత్తానికి కుర్చీలకు వచ్చిన డిమాండ్.. ఎవరి దగ్గర ఉంచాలన్న విషయం మీద ఒక నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెబుతున్నారు.