Begin typing your search above and press return to search.

160 స్థానాల్లో టీడీపీ గెలుపు: నారా లోకేశ్‌ వెల్ల‌డి

By:  Tupaki Desk   |   29 May 2022 3:29 AM GMT
160 స్థానాల్లో టీడీపీ గెలుపు:  నారా లోకేశ్‌ వెల్ల‌డి
X
తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని అనుకున్నవారంతా గాలిలో కలిసి పోయారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. టీడీపీ పునాదులు గట్టిగా ఉన్నాయని.. ఎవరూ ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు శివారు మండువవారిపాలెంలో మహానాడు వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన లోకేశ్‌.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

పెట్రోల్, డీజిల్‌ ధరల్లో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. చెత్త పన్ను, ఇసుక ధరల్లో ఏపీ దూసుకెళ్తోంది. ఇంకా రాష్ట్రం విషయంలో సీఎం జగన్‌కు ఎలాంటి ముందు చూపూ లేదు. కేవలం మందు చూపు మాత్రమే ఉంది. శవాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ రాజకీయాలు చేస్తోందని లోకేశ్ మండిప‌డ్డారు.

మహనీయుడి పుట్టినరోజున మహానాడు జరుపుకుంటున్నామని అన్నారు. ఈ మహానాడు కార్యక్రమం జరగకుండా వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని మండిపడ్డారు. సర్కారుకు చెంపదెబ్బ కొట్టినట్లు మహానాడుకు ప్రజలు తరలివచ్చారన్నారు.

మూడేళ్లుగా టీడీపీ కార్యకర్తలు బయటకు రావాలంటే, నాయకులు మాట్లాడాలంటే భయపడ్డారు. మహానాడు ప్రభంజనం చూస్తుంటే... వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 స్థానాల్లో విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

2019లో తెలిసో, తెలియకో ప్రజలు తప్పు చేశారు. చంద్రబాబును ఓడించటం ప్రజలు చేసిన తప్పు. రూ.లక్షల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించారు. ఈ మూడేళ్లలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు.

మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే అంత ఈజీ కాదు. మళ్లీ చంద్రబాబును గెలిపిస్తేనే.. రాష్ట్రం గాడిన పడుతుంది. హత్యలు చేసిన వైసీపీ నేతలు అమలాపురంలో అల్లర్లు సృష్టించారు. అని లోకేశ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.