Begin typing your search above and press return to search.

భారీ సొరంగం.. జైలు నుంచి 75 ఖైదీల పరార్

By:  Tupaki Desk   |   23 Jan 2020 4:17 AM GMT
భారీ సొరంగం.. జైలు నుంచి 75 ఖైదీల పరార్
X
దక్షిణ అమెరికా ఖండంలోని పరాగ్వే దేశంలో ఓ జైలు ఖైదీలు సాహసమే చేశారు. ఆ దేశంలోని పెడ్రో జాన్ కబల్లెరో నగరంలోని ఒక జైలు నుంచి ఏకంగా సొరంగం తవ్వుకొని 75మంది ఖైదీలు పారిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరాగ్వే దేశం నుంచి బ్రెజిల్ దేశంలోకి పారిపోయేందుకు ఈ సొరంగం తవ్వడం సంచలనంగా మారింది.

బ్రెజిల్ లోని సావో పాలో నగరం కేంద్రంగా పనిచేసే ఓ పెద్ద ‘ఆర్గనైజ్ క్రిమినల్ గ్యాంగ్’ కు చెందిన 75మంది తప్పించుకోవడం సంచలనంగా మారింది. వీరిని ‘ఫస్ట్ కమాండ్ ఆఫ్ ది క్యాపిటల్ (పీపీసీ) ’ గా వ్యవహరిస్తుంటారు. ఈ క్రిమినల్ గ్యాంగ్ లో 30వేల మంది సభ్యులున్నారు. వీరంతా మత్తు పదార్థాలను, ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తుంటారు. బ్రెజిల్ తోపాటు చుట్టుపక్కల ఉన్న పరాగ్వే - బొలీవియా - కొలంబియా దేశాల్లో ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తుంటుంది.

పరాగ్వే దేశంలోని పెడ్రోజాన్ నగరంలోని కబెల్లెరో జైలు బ్రెజిల్ దేశానికి సరిహద్దులో ఉంది. ఈ ఖైదీల్లో చాలా మంది బ్రెజిల్ వాసులే.. వారు సొరంగం నుంచి బ్రెజిల్ దేశంలోకి సరిహద్దు దాటి పారిపోయారని అధికారులు గుర్తించారు.

కాగా ఈ 75మంది ఖైదీలు పారిపోవడంలో జైలు అధికారుల పాత్ర ఉందని.. వారి సహకారంతోనే ఖైదీలు పారిపోయారని పరాగ్వే ప్రభుత్వం గుర్తించింది. జైలు అధికారులందరినీ సస్పెండ్ చేసింది. ఖైదీలను తప్పించడానికి ఏజెంట్లకు సుమారు 57 లక్షలు ఒప్పందం కుదిరినట్లు తమకు సమాచారం అందిందని ఇది పెద్ద అవినీతిగా పరాగ్వే ప్రభుత్వం తెలిపింది.