Begin typing your search above and press return to search.

మా డ్యాడీ చీటర్​.. లూడో గేమ్ లో మోసం చేశాడు.. కోర్టుకెక్కిన కూతురు!

By:  Tupaki Desk   |   27 Sep 2020 5:30 PM GMT
మా డ్యాడీ చీటర్​.. లూడో గేమ్ లో  మోసం చేశాడు.. కోర్టుకెక్కిన కూతురు!
X
బహుశా ఫ్యామిలీ కోర్టు చరిత్రలోనే ఇదో అరుదైన కేసు అయ్యి ఉండవచ్చు. తన తండ్రి ఓ గేమ్​లో తనను మోసం చేస్తున్నాడని.. అతడిని కఠినంగా శిక్షించాలంటూ ఓ యువతి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును చూసిన జడ్జీలే ఆశ్చర్యపోయారు. సదరు బాలికకు కౌన్సెలింగ్​ ఇప్పించాలని.. ఆన్​లైన్​ ఆటలను సీరియస్​గా తీసుకోకుండా మానసిక స్థైర్యం పెంపొందించాలని, గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరించేలా అవగాహన కల్పించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఇంతకు ఈ కేసు ఎక్కడ జరిగింది.. దాని పూర్వాపరాలేమిటో తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కు చెందిన యువతి (24) ఖాళీ సమయాల్లో తన తండ్రితో కలిసి లూడో గేమ్ ఆడుతూ ఉండేది. అయితే ఆమె తండ్రి మాత్రం ఆమె కాయిన్లను చంపుతూ ఎప్పడూ ఆయనే గెలుస్తూ ఉండేవాడు. ప్రతిసారి తండ్రే గెలుస్తుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది. తండ్రిపై ద్వేషం పెంచుకున్నది. అతడిని నాన్న అని కూడా పిలవడం లేదు. మోసం చేసి నాన్న గెలుస్తున్నాడని భావించి ఏకంగా ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదుచేసింది.

‘ఆయన నా తండ్రి. ఎంతో ఉన్నతంగా ప్రవర్తించాలి. నాతో ఆటలో ఓడిపోవాలి. నాకు సంతోషం కలిగించాలి. కానీ ఆయన మాత్రం నా మీద ద్వేషం పెంచుకున్నాడు’ అంటూ కోర్టులో వాదించింది. దీంతో జడ్జీలు ఆమె వాదన విని షాక్​ అయ్యారు. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని భావించి ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ సరిత ఆమెకు నాలుగు సార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. నాలుగు సెషన్ల కౌన్సిలింగ్ తర్వాత ఆమె ఇప్పుడు ఆమెలో కొంత మార్పు వచ్చిందని సరిత చెప్పారు. ఈ విషయంపై సరిత ఏమంటారంటే.. ‘మనం పిల్లలను పెంచేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. గెలుపు ఓటములను సమానంగా తీసుకొనేలా అవగాహన కల్పించాలి. ఓడిపోయినప్పుడు తీవ్రంగా కుంగిపోతే వాళ్లను ఓదార్చాలి. మరోసారి గెలుస్తావంటూ దైర్యం చెప్పాలి. అంతేకానీ వాళ్లను కించపరిస్తే మానసికంగా కుంగిపోతారు. ఆలోచనలు తీవ్రమైతే చివరకు ఇలాగే తయారవుతారు’ కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.