Begin typing your search above and press return to search.

కొట్టుకుంటున్న ఆ రెండు రాష్ట్రాలు...ప్రేక్షక పాత్ర వహిస్తోన్న కేంద్రం !

By:  Tupaki Desk   |   31 July 2021 9:30 AM GMT
కొట్టుకుంటున్న ఆ రెండు రాష్ట్రాలు...ప్రేక్షక పాత్ర వహిస్తోన్న కేంద్రం !
X
ఇటీవల అస్సాం, మిజోరాం రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలతో ఇరువైపులా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు రాష్ట్రాల మధ్య 164.6 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అస్సాంలోని కచార్, మిజోరంలోని కొలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న భూభాగం ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో అస్సాం, మిజోరాం వాసులు ఈ భూభాగం కోసం రెండుసార్లు ఘర్షణ పడ్డారు. అప్పట్లో ఒక డజను మంది గాయపడ్డారు. ఆ తరువాత నుంచి వివిధ కారణాలతో ఈ ప్రాంతంలో అనేక హింసాత్మక సంఘటనలు వెలుగుచూశాయి. గతంలో 1987లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. అయితే ఈ వివాదం 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలస పాలన నాటి నుంచే కొనసాగుతోంది.

మొదట్లో మిజోరాం కూడా అస్సాంలో భాగంగానే ఉండేది. 1987లో మిజోరాంకు రాష్ట్ర హోదా లభించింది. ఆ సమయంలో అస్సాం తమ భూములను స్వాధీనం చేసుకుంటోందని పలువురు మిజో గిరిజన నాయకులు ఆరోపిస్తూ సరిహద్దు వివాదాన్ని లేవనెత్తారు. 1995లో మిజోరం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. 1875 నోటిఫికేషన్ ప్రకారం.. లుషాయ్ హిల్స్‌ సరిహద్దుల్లో ప్రజలకు నివాస స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మొదటిసారి ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఆ తరువాత 2018లో మిజో పౌర సంఘాలు వివాదాస్పద సరిహద్దులో గుడిసెలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. ఈ ఘర్షణలో జర్నలిస్టులతో సహా దాదాపు 50 మంది వ్యక్తులపై అస్సాం పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ తరువాత 2019లో రెండు రాష్ట్రాలు యథాతథ స్థితిని కొనసాగించడానికి అంగీకరించాయి. వివాదాస్పద ప్రాంతాన్ని ఆక్రమించే పనులు చేపట్టవద్ధని నిర్ణయించాయి. అయితే 2020, అక్టోబర్‌లో మరోసారి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య జరిగిన వాగ్వివాదం పెద్దదిగా మారింది. ఫలితంగా రెండు వైపులా అనేక మంది ప్రజలు గాయపడ్డారు. ఆ సమయంలో మిజోరాంకు కీలక రవాణా మార్గంగా ఉన్న నేషనల్ హైవే 306ను ఆందోళనకారులు 12 రోజుల పాటు దిగ్బంధం చేశారు.

ఇక ప్రస్తుత వివాదం విషయానికొస్తే .. అస్సాంలోని కచార్ జిల్లా, మిజోరాంలోని కొలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం వివాదం ఈ సోమవారం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇక్కడ చెలరేగిన హింస సందర్భంగా రెండు రాష్ట్రాల పోలీసులు కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మిజోరాం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి చెందారు. అధికారులతో సహా 80 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాటల యుద్ధానికి దిగారు. వివాదాస్పద స్థలంలో మిజోరం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడమే వివాదానికి కారణమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. అయితే ముందు దాదాపు 200 మంది అస్సాం పోలీసు సిబ్బంది తమ భూభాగం వైపు వచ్చిన తరువాతే ఘర్షణలు మొదలయ్యాయని మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్ తంగా తెలిపారు.

అస్సాంలోని కచార్ జిల్లా, మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల సరిహద్దు వెంబడి జులై 26న జరిగిన ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించగా, సదరు ఘటనపై మిజోరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై హత్యాయత్నం, కుట్ర పూరిత నేరం, ఆయుధాలతో దాడి తదితర ఆరోపణలు మోపారు. అస్సాం సీఎంతో పాటు ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులు, గుర్తుతెలియని మరో 200 మందిపైనా ఇవే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాల మేరకు ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 200 పైచిలుకు పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు, టెంట్ సామాగ్రితో మిజోరం సరిహద్దుల్లోకి ప్రవేశించారు. మిజోరం భూభాగాన్ని ఆక్రమించి, కోలాసిబ్ జిల్లా సరిహద్దులోని చెక్ పోస్టును ధ్వంసం చేసి, అక్కడ తమ క్యాంప్ ఏప్రాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కోలాసిబ్ జిల్లా ఎస్పీ అక్కడికెళ్లి అస్సాం పోలీసుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ అస్సాం వాళ్లు ఎంతకీ వినలేదు. అలజడి రేపాలన్న ముందస్తు వ్యూహంతోనే కాల్పులకు తెగబడ్డారు. లభించిన ఆధారాల మేరకు అస్సాం సీఎం, అధికారులు, గుర్తుతెలియని 200 మందిపై మర్డర్ అటెంప్ట్ ఇతరత్రా సెక్షన్ల కింద కేసులు పెట్టాం అని ఎఫ్ ఐ ఆర్ లో మిజోరం పోలీసులు పొందుపరిచారు.

అస్సాంతో సరిహద్దు గొడవల నేపథ్యంలో మిజోరాం తన రాష్ట్ర సరిహద్దును ‘నో ఫ్లై జోన్' గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో డ్రోన్లుగానీ ఇతరత్రా వాహకాలు వేటినీ అనుమతించబోమని చెప్పింది. శుక్రవారం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇండియన్ ఆర్మీకి కూడా ఆంక్షలు వర్తిస్తాయి. ఆర్మీ మిజోరం బోర్డర్ లో ఏవైనా కార్యకలాపాలు చేయాలనుకుంటే, డ్రోన్ల ఎగరవేత లేదా ఇంకేదైనా అనుకుంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ‘నో ఫ్లై జోన్' ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు చనిపోవడంతోపాటు 50 మందికిపైగా తీవ్రంగా గాయపడిన జులై 26నాటి ఘర్షణకు సంబంధించి అస్సాం పోలీసులు.. మిజోరం పోలీసులకు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తునకు సహకరించాలని అస్సాం కోరగా.. అసలు కాల్పులకు పాల్పడింది అస్సాం పోలీసులే అని మిజో సీఎం ఆరోపించారు

ఈశాన్య రాష్ట్రాల మధ్య గతం నుంచీ సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో హత్యాకాండ జరగడం, ముఖ్యమంత్రిపైనే మర్డర్ కేసు పెట్టడం లాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. సరిహద్దులో రక్తపాతం తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడి, సంయమనం పాటించాల్సిందిగా ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గకపోవడం, రెండు ప్రభుత్వాలు పరస్పరం మాటల దాడి, కేసుల నమోదు కొనసాగిస్తుండటం పరిస్థితిని ఇంకాస్త దిగజార్చుతోంది. రాష్ట్రాలు కొట్టుకు చస్తోంటే, కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రేక్షక పాత్ర వహిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.