Begin typing your search above and press return to search.

ఆగస్టు సంచలనం : రాజధాని రగడకు కొత్త ట్విస్ట్...?

By:  Tupaki Desk   |   18 May 2022 11:30 AM GMT
ఆగస్టు సంచలనం : రాజధాని రగడకు కొత్త ట్విస్ట్...?
X
ఉమ్మడి ఏపీ నుంచి చూస్తే ఆగస్ట్ నెల అంటే రాజకీయాలలో ఒక కీలకమైన మాసంగానే చూస్తారు. ముఖ్యంగా టీడీపీకి ఈ నెల యాంటీ సెంటిమెంట్ ని పండిస్తూ వస్తోంది. దానికి ఉదాహరణలు 1984, 1995లలో జరిగిన రెండు పార్టీ సంక్షోభాలను టీడీపీ తమ్ముళ్లు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. మరో వైపు చూస్తే ఆగస్ట్ వస్తూనే ఏదో జరుగుతుంది అన్న బెంగ బెరుకూ అయితే టీడీపీకి ఈ రోజుకూ ఉన్నాయి.

మరి ఈసారి ఆగస్ట్ కూడా టీడీపీకి గట్టి ఝలక్ ఇచ్చేలా పక్కా ప్లాన్ తో అధికార వైసీపీ ముందుకు కదులుతోంది అని అంటున్నారు. అది ఎలా అంటే ఈసారి ఆగస్ట్ చివరలో వర్షాకాల సమావేశాలను కొన్ని రోజుల పాటు నిర్వహించాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. ఈ సమావేశాలో కీలకమైన బిల్లులను సభలో ప్రవేశపెడతారు అని అంటున్నారు.

ఆ బిల్లులలో అతి ముఖ్యమైనది ఒకటి ఉంది. అదే రాజధానుల బిల్లు అని అంటున్నారు. నిజానికి మూడు రాజధానుల బిల్లు అన్నది గత ఏడాది చివరల్లో వైసీపీ సర్కార్ తానుగానే రద్దు చేసుకుంది. ఆ తరువాత హై కోర్టు నుంచి అమరావతి మీద తుది తీర్పు వెలువడింది. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని ఆ తీర్పు సారాంశం. అంతే కాకుండా బ్లూ ప్రింట్ లో పేర్కొన్నట్లుగా అమరావతిలోనే అన్నీ నిర్మించాలని కూడా హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే దీని మీద ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోలేదు. తమకు కాల పరిమితి పెంచితే వీలు వెంబడి అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తామని వైసీపీ సర్కార్ కోర్టుకు తెలియచేసింది. ఆ విషయం అలా ఉంటే ఈ మధ్యన కర్నూల్ లో మీడియాతో మాట్లాడుతూ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగస్టు నెలలో కీలకమైన పరిణామాలు జరుగుతాయని చెప్పేశారు.

అంతే కాదు న్యాయ రాజధాని కర్నూల్ కి రావడం కూడా కచ్చితమని చెప్పేశారు. ఆయన మాటలు చూస్తే ఏదో పక్కా ప్లాన్ తోనే వైసీపీ ఉందని అంటున్నారు. దానికి ఆగస్ట్ నెలను ముహూర్తంగా పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆగస్ట్ లో జరిగే రైనీ సీజన్ సమావేశాలలో కర్నూలులో హైకోర్టుని తరలించే విధంగా ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెడుతుంది అని ప్రచారం సాగుతోంది.

ఇక అమరావతినే రాజధానిగా ప్రభుత్వం గుర్తిస్తూ అన్ని రకాలుగా పకడ్బందీగా ఈ బిల్లుని తీసుకువస్తుంది అని అంటున్నారు. ఎక్కడా మూడు రాజధానులు అన్న ప్రశ్న లేకుండా కూడా చూస్తుందని చెబుతున్నారు. ఇక కర్నూల్ లో హై కోర్టు అన్న దానికి కేంద్రంలోని బీజేపీ కూడా అంగీకరిస్తుందని చెబుతున్నారు

ఇప్పటికే గడచిన ఎన్నికల్లోని వారి మ్యానిఫేస్టోలో కర్నూల్ లో హై కోర్టుని పెట్టాలని, రెండవ రాజధానిగా చేయాలని తీర్మానించారు. ఇపుడు వైసీపీ ఆ దిశగా చర్యలు తీసుకుంటే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సమర్ధిస్తుందని అంటున్నారు. ఒక విధంగా ఈ వ్యవహారం సాఫీగానే సాగిపోతుందని అంటున్నారు.

ఇక విశాఖ పాలనా రాజధాని విషయం తీసుకుంటే ప్రభుత్వ పరంగా చట్టం చేస్తే కుదిరే వ్యవహారం కాదు. దానికి ఎన్నో న్యాయ అవరోధాలు ఉనాయి. అలా కాకుండా పాలనాపరమైన జీవోను ఒక దాన్ని ఇచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీస్ ని విశాఖలో ఏర్పాటు చేసుకుంటారు అంటున్నారు. ఆ విధంగా విశాఖ నుంచి ఆయన పాలిస్తే అడిగే పరిస్థితి ఎవరికీ లేదు.

ఇలా అమరావతిని రాజధానిగా ఏ మాత్రం కదపకుండా అసలు రాజధానికి ఏ రకమైన భంగం కలగకుండా జగన్ తాను అనుకున్నది సాధించుకుంటారు అంటున్నారు. అంటే ఈసారి ఆగస్ట్ లో రాజకీయంగా అగ్గి రాజేయడానికి జగన్ చూస్తున్నారు అనుకోవాలి. జగన్ అనుకున్న విధంగా కనుక జరిగితే మాత్రం ఈసారి ఆగస్ట్ యాంటీసెంటిమెంట్ మళ్లీ టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉందనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.