Begin typing your search above and press return to search.

మల్టీ నేషనల్స్..విరాళాల మాటెత్తడం లేదే!

By:  Tupaki Desk   |   9 April 2020 12:30 AM GMT
మల్టీ నేషనల్స్..విరాళాల మాటెత్తడం లేదే!
X
ప్రాణాంతక వైరస్ కరోనాతో విశ్వవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలు వణికిపోతున్నాయి. కరోనా కట్టడి కోసమంటూ తమ సరిహద్దులను మూసేసుకుని లాక్ డౌన్ లను ప్రకటించుకుని కూర్చున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయా దేశాలు కరోనా కట్టడి కోసం తమ శక్తికి మించిన పనులను చేపట్టాయి. మరి ఓ వైపు లాక్ డౌన్ తో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారగా... మరోవైపు కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలకు నిధులు లేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వందలు - వేలు - లక్షల కోట్ల టర్నోవర్ తో అలరారిన బడా పారిశ్రామిక సంస్థలు - వివిధ రంగాల ప్రముఖులు ఆయా దేశాలకు పెద్ద ఎత్తున ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయి. భారత్ లో పీఎం కేర్స్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కూ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విరాళాల్లో దేశీయ సంస్థలే తప్పించి బహుళ జాతి సంస్థల పేరు ఒక్కడి కూడా వినిపించడం లేదు. ఇప్పుడీ విషయం ఆసక్తికరంగా మారిపోయింది.

ఇతర దేశాలకు చెందిన కోకా కోలా - పెప్సీ కంపెనీలు... భారత్ తో పాటు చాలా దేశాల్లో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే... ఈ రెండు సంస్థలు భారీ టర్నోవర్ తో పెద్ద ఎత్తున వ్యాపారం నడుపుతూ భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ రెండు సంస్థల నుంచి ప్రతిపాదనలు రావడమే ఆలస్యం... కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా క్షణాల్లో అనుమతులు ఇవ్వడంతో పాటుగా రాయితీలను ఇచ్చేస్తున్నాయి. మొత్తంగా మన ప్రభుత్వాల నుంచి భారీ రాయితీలను అందుకుంటున్న ఈ సంస్థలు.. మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ తరహా పరిస్థితిపై ఇప్పుడు పెద్ద చర్చకే తెర లేసిందని చెప్పక తప్పదు.

కోలా - పెప్సీలతో పాటు మన దేశంలో వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న మల్టీ నేషనల్ సంస్థలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా అటు పీఎం కేర్ కు గానీ - ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ లకు గానీ మల్టీ నేషనల్ సంస్థల నుంచి చిల్లిగవ్వ విరాళం కూడా అందిన దాఖలా లేదనే చెప్పాలి. మన దేశం నుంచి భారీ మొత్తంలో రాయితీలు - లాభాలు అందుకుంటున్న ఈ మల్టీ నేషనల్స్... ఆపత్కాలంలో మాత్రం దేశానికి దన్నుగా నిలబడని వైనం నిజంగానే గర్హనీయమనే చెప్పాలి. ఈ విషయంపై ఆ సంస్థలను అస్సలు ప్రశ్నించిన వారు కూడా లేరనే చెప్పాలి. విరాళం అంటేనే అడగకుండానే ఇచ్చేది. మరి పెను విపత్తులో చిక్కుకున్న దేశానికి ఈ సంస్థల నుంచి సింగిల్ పైసా కూడా రాలేదంటే... ఆశ్చర్యమే కదా. అందుకే... మన దేశం నుంచి ఈ సంస్థలు తీసుకోవడం తప్పించి... ఇవ్వడం అనే మాటను మరిచిపోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.