Begin typing your search above and press return to search.

పక్కా ప్లాన్ ప్రకారమే మోకా హత్య ... అదే అసలు కారణం !

By:  Tupaki Desk   |   4 July 2020 11:30 AM GMT
పక్కా ప్లాన్ ప్రకారమే మోకా హత్య ... అదే  అసలు కారణం !
X
వైఎస్సార్‌ సీపీ నేత మోకా భాస్కర్‌రావును అతికిరాతకంగా హత్య చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ హత్య పై పోలిసుల విచారణలో అనేక విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా కొల్లు రవీంద్ర అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మోకా భాస్కరరావు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వాటి ని తాను నిరూపించ గలనని సవాల్‌ విసిరారు. దీనిపై కొల్లు రవీంద్ర తో పాటు టీడీపీ కి చెందిన మాజీ కౌన్సిలర్‌ చింతా చిన్ని ప్రత్యారోపణలు చేశారు. దీనితో ఏమి చేసినా మోకా భాస్కర్‌ రావు వెనక్కి తగ్గడం లేదు అని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందేనని టీడీపీ నేతలు రెండన్నర నెలల కిందంటే ఓ నిర్ణయానికి వచ్చారని పోలిసుల విచారణలో తేలినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఐతే , స్థానిక సంస్థల ఎన్నికల తరువాత హతమార్చడం మేలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేసారని, అయితే , లోకల్ గా మోకా జోరు పెరుగుతోందని, ఇప్పుడే అడ్డుకోకపోతే ఎన్నికల్లో సమస్యలు తప్పవని 20 రోజుల కిందట ఆరేడుగురు కలిసి చర్చించుకున్నారని అయన సన్నిహితులు ఆరోపణలు చేస్తున్నారు." మీరు జాగ్రత్తగా ప్లాన్‌ చేయండి. దెబ్బ మిస్‌ కాకూడదు. పనిపూర్తయ్యాక చెప్పండి. ఆ తరువాత వ్యవహారాలన్నీ నాకు వదిలేయండి. నేను చూసుకుంటా.. అయితే ఎక్కడా నా పేరు బయటకు రాకూడదు.. అసలు ప్రస్తావనకే రానీయొద్దు.. నా నెంబర్‌కు మీరు ఫోన్లు చేయవద్దు.. ఫలానా వారికి ఫోన్‌ చేయండి. నేను మాట్లాడతా... అని టీడీపీ ముఖ్య నాయకుడు భరోసా ఇవ్వడంతోనే చింతా కుటుంబీకులు మోకాను గత నెల 29వ తేదీ స్థానిక చేపల మార్కెట్‌ లో దారుణంగా హత్య చేసారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

కాగా, కొల్లు రవీంద్ర, చింతా చిన్ని అన్నదమ్ముల తరహాలో కలిసిమెలిసి ఉంటారనేది అందిరికి తెలిసిన విషయమే. ప్రతి విషయాన్ని వారు చర్చించుకుంటారని, ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారనేది బహిరంగ రహస్యం. అయితే మోకా హత్యకు నాలుగు రోజుల ముందు నుంచి చింతా చిన్ని, కొల్లు రవీంద్రల మధ్య ఫోన్‌కాల్స్‌ ఏవి లేవని, కొల్లు పీఏల ఫోన్లకు చింతా చిన్ని ఫోన్‌ చేసి కొల్లుతో పలుమార్లు మాట్లాడుకున్నారని, మోకా హత్య తరువాత 15 –20 నిమిషాల మధ్య కొల్లు పీఏకి చింతా చిన్ని నుంచి ఫోన్‌ వెళ్లిందని, అన్నకు ఫోన్‌ ఇవ్వమన్న చిన్ని... అన్నా పనై పోయిందనగానే అంతా ఓకే గా అని ఫోన్‌ పెట్టేసినట్లు నిందితులు పోలీసుల విచారణ లో చూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్ని బట్టి హత్య కు ప్రోత్సహించింది కొల్లు అనే ప్రాధమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసులో నాలుగవ నిందితుడిగా మాజీమంత్రిని చేర్చారు అని తెలుస్తుంది. మోకా భాస్కరరావు హత్యలో చింతా చిన్ని, చింతా నాంచారయ్య అలియాస్‌ పులి, చింతా కిషోర్‌ రక్త సంబందీకులు. వీరు వరుసగా మొదటి నిందితులు కాగా నాలుగో నిందితునిగా కొల్లును చేర్చారు.