Begin typing your search above and press return to search.

కాషాయ మోహనుడు : జగన్ మీద ధర్మాగ్రహం. ...?

By:  Tupaki Desk   |   28 Jun 2022 8:38 AM GMT
కాషాయ మోహనుడు : జగన్ మీద  ధర్మాగ్రహం. ...?
X
తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన విలక్షణమైన సలక్షణమైన నటుడు. విలన్ హీరో, క్యారక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో లీనమై మెప్పించడం అలవాటు. ఆయనే మంచు మోహన్ బాబు. ఆయనకు రాజకీయాల్లో మెరవాలని ఉంటుంది. కానీ అది మాత్రం కుదరడం లేదు. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు 1982లో ఆయనకు సినిమా పరిశ్రమ నుంచి తొట్టతొలిగా మద్దతు పలికింది నటులలో మోహన్ బాబు మాత్రమే. ఆ తరువాత మిగిలిన వారు వెంట వచ్చారు.

ఇక మోహాన్ బాబు ఎన్టీయార్ ని ఎంతగానో గౌరవిస్తారు, ప్రేమిస్తారు అన్నది తెలిసిందే. అలాంటి మోహన్ బాబుకు ఎన్టీయార్ మెచ్చి 1994లో రాజ్యసభ సీటు ఇచ్చారు. అయితే ఆ తరువాత కొద్ది నెలలలో టీడీపీలో ఏర్పడిన అతి పెద్ద సంక్షోభంలో మోహన్ బాబు ఎన్టీయార్ నుంచి దూరం జరిగి చంద్రబాబు వైపు వచ్చారు. ఆ విషయంలో తాను తప్పు చేశాను అని తరువాత రోజులలో ఆయన చెప్పుకున్నారు.

ఇక చంద్రబాబు హయాంలో టీడీపీలో కీలకమైన పాత్ర పోషించాలని మోహన్ బాబు భావించినా కుదరలేదు. దాంతో ఆయన అప్పట్లో అంటే చంద్రబాబు సీఎం గా ఉండగానే టీడీపీ సర్కార్ కి ఎదురు నిలిచారు. ధర్నాలు కూడా చేశారు. ఇక 1998 ప్రాంతంలో ఆయన బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఎల్కే అద్వానీతో కలసి ఏపీలో పలు సభలలో పాలుపంచుకున్నారు.

ఆయన బీజేపీతో చేరతారు అని అంతా అనుకున్నారు. కానీ జరగలేదు. ఇక వైఎస్సార్ ఆద్వర్యాన ఏపీలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడితే అపుడు ఆయనతో సఖ్యతగా మెలిగారు. దాంతో కాంగ్రెస్ లోకి వస్తారని అనుకున్నా అదీ జరగలేదు. ఇక 2019లో వైసీపీకి ఆయన మద్దతు పలికి జగన్ వైపు నిలిచారు. దాంతో మోహన్ బాబు రాజకీయ ప్రస్థానం వైసీపీతోనే అని అనుకున్నారు.

కానీ ఆ ముచ్చటా సాగలేదు. జగన్ తో బంధుత్వం కూడా మోహన్ బాబుకు కుంది. జగన్ చిన్నాన్న కుమార్తెనే మోహన్ బాబు తన కోడలిగా చేసుకున్నారు. ఇక జగన్ సీఎం అయ్యాక తనకు రాజ్యసభ సీటు దక్కుతుందని ఆశించిన మోహన్ బాబుకు ఆ కోరిక తీరలేదు అంటారు. లాగే టీటీడీ చైర్మన్ పదవి అయినా ఇస్తారు అనుకుంటే అదీ జరగలేదు. దాంతో ఆయన పాలిటిక్స్ మీదనే ఒక దశలో విరక్తి చెందారు అని కూడా అంటున్నారు. ఈ మధ్యలో ఆయన రాజమండ్రీలో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీ నేతలతో కలసి పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీని పొగిడారు.

దానికి ముందు కుటుంబ సమేతంగా ఆయ‌న ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలసి వచ్చారు. ఇపుడు తిరుపతిలో ఒక కోర్టు కేసుకు హాజరైన మోహన్ బాబు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తాను బీజేపీ మనిషిని అని తానుగా మోహన్ బాబు చెప్పుకున్నారు. కేంద్రంలో మోడీ అధికారంలో ఉండాలని కోరుకునే వారిలో తాను ఒకరిని అని అన్నారు మరి మోహన్ బాబు ఈసారి బీజేపీ తరఫున ఏపీలో ప్రచారం చేస్తారా. ఆ పార్టీ తరఫున చురుకైన పాత్ర నిర్వహిస్తారా అన్నది చర్చగా ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే వైసీపీకి దూరం అని చెప్పేందుకే మోహన్ బాబు బీజేపీకి తాను దగ్గర అని చెప్పారని కూడా మరో మాట వినిపిస్తోంది. ఒక విధంగా జగన్ మీద కోపంతోనే ఆయన ఈ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఏలుబడిలోకూడా పూర్తి స్థాయిలో తన విద్యా సంస్థలకు ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ మొత్తాలు రాలేదని తెలుస్తోంది. మొత్తానికి మోహన్ బాబు ధర్మాగ్రహం జగన్ మీదే అని అంటున్నారు. దాని ఫలితాలు పర్యవశానాలు ఎలా ఉంటాయో చూడాలి.