Begin typing your search above and press return to search.

పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన మోడీ

By:  Tupaki Desk   |   6 March 2021 1:30 PM GMT
పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన మోడీ
X
మిగిలిన వేళల్లో ఎలా ఉన్నా.. ఎన్నికలు జరుగుతుంటే చాలు తన మాటల్లో తేడా చూపిస్తుంటారు ప్రధాని మోడీ. వ్యక్తిత్వ వికాస నిపుణుడిలా మాట్లాడే ఆయన ఎన్నికలు వస్తే చాలు.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు ప్రధాని. అలాంటి ఆయన తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలకు తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు మోడీ. ప్రత్యర్థులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని.. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలన్నట్లు చెబుతున్నారు.

తాజాగా చేసిన వ్యాఖ్యలు బెంగాల్.. అసోం రాష్ట్రాల నేతల్ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా.. బీజేపీ నేతలు మాత్రం రెచ్చిపోవద్దని చెప్పారంటున్నారు. వ్యక్తిగత దూషణలకు.. తీవ్రమైన వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ.. హుందాగా ఉండేలా ప్రచారం చేయాలని ఆయన చెప్పినట్లుగా చెబుతున్నారు.

తాజాగా జరిగిన సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ప్రధాని మోడీ.. కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో పాటు.. ప్రముఖ నేతలు పాల్గొన్నట్లు చెబుతున్నారు. తాజా సమావేశంలో ప్రధాని మోడీ చేసిన సూచనలు.. ఇచ్చిన సలహాల్ని ఆధారంగా చేసుకొని ఎవరూ లక్ష్మణ రేఖ దాటొద్దని గట్టిగా హెచ్చరించినట్లు చెబుతున్నారు.

మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. తనకు తాను చెలరేగిపోయి వ్యాఖ్యలు చేసే మోడీ.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా లక్ష్మణ రేఖ దాటొద్దని సొంత పార్టీ నేతలకు హెచ్చరించటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల ఓడిపోయే అవకాశం ఉండటంతో.. హుందాగా వ్యవహరించటం ద్వారానే తాము ఓడిపోయామన్న మాట చెప్పుకునేందుకు వీలుగా మోడీ కొత్త వ్యూహాన్ని తెర మీదకు తీసుకొచ్చారా? అన్న మాట వినిపిస్తోంది.