Begin typing your search above and press return to search.

పెట్రో మంట : వివాదంలో మోడీ..? ఎందుకంటే ??

By:  Tupaki Desk   |   29 May 2022 1:30 AM GMT
పెట్రో మంట : వివాదంలో మోడీ..? ఎందుకంటే ??
X
పెట్రో ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ఇటీవ‌ల ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం ప్ర‌భావం ఆయిల్ డీల‌ర్ల‌పై తీవ్రంగా చూపించింద‌ని తెలుస్తోంది. స్వ‌ల్ప కాల వ్య‌వ‌ధిలో రెండు సార్లు త‌గ్గించిన ఎక్సైజ్ డ్యూటీ కార‌ణంగా ముందుగా త‌మ నుంచి వ‌సూలు చేసిన మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వెన‌క్కు ఇవ్వాల‌ని కేంద్రంను ఏపీ ఆయిల్ డీల‌ర్లు నిలదీస్తున్నారు. దీంతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

వాస్త‌వానికి కేంద్రం నిర్ణ‌యం కార‌ణంగా ఘోరాతి ఘోరంగా తాము న‌ష్ట‌పోయామ‌ని వీళ్లంతా గ‌గ్గోలు పెడుతున్నారు. పెట్రో ఉత్ప‌త్తుల‌కు తాము ముందుగానే చెల్లించిన డ‌బ్బు వెన‌క్కు ఇవ్వ‌కుంటే తాము ఈ నెల 31 నుంచి పెట్రో ఉత్ప‌త్తుల కొనుగోళ్ల‌ను నిలిపివేస్తామ‌ని వీరంతా హెచ్చ‌రిస్తున్నారు. దీంతో స‌మ‌స్య ఏ విధంగా ప‌రిష్కారం అవుతుందో అన్న ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

వీటిపై కేంద్రంతో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అధికారులు, సంబంధిత మంత్రులు మాట్లాడాల్సి ఉంది. కానీ ఒక్క‌సారి అంత మొత్తం కేంద్రం వెన‌క్కు ఇవ్వాలంటే జ‌ర‌గ‌ని ప‌ని. అప్పుడేం చేస్తారు.. ముందున్న కాలంలో చెల్లించాల్సిన ప‌న్నుకు ఈ మొత్తాన్ని స‌ర్దుబాటు చేసేలా ఏదో ఒక సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ ఈ స‌మ‌స్య ఒక్క ఏపీలోనే లేదు క‌దా క‌నుక కేంద్రం తెలివిగా ఈ మొత్తం చెల్లించ‌కుండా (వెన‌క్కు ఇవ్వ‌కుండా) తాత్సారం చేయ‌వ‌చ్చు. వాస్త‌వానికి ఇప్ప‌టికే కేంద్రం ఏం చెప్పినా రాష్ట్రాలు విని పాటించే ప‌ద్ధ‌తులు అయితే లేవు క‌నుక రాష్ట్రం త‌రఫున ఏ మ‌యినా విన్న‌పం వెళ్లినా కేంద్రం కూడా ఇదే స్థాయిలో రియాక్ట్ కావ‌డం ఖాయం.

దాంతో ఆయిల్ సంక్షోభం రావ‌డం కూడా ఖాయమే ! ఇప్ప‌టికే స్టేట్ ట్యాక్సుల మిన‌హాయింపునకు రాష్ట్రాలు ఒప్పుకోవ‌డం లేదు క‌నుక ఇదే అదునుగా ఎక్సైజ్ సుంకం తిరిగి చెల్లింపుపై కూడా కేంద్రం ముఖం చాటేస్తే రాష్ట్రాలు పూర్తిగా మునిగిపోతాయి.

అందుకే సాధ్యం అయినంత త్వ‌ర‌గా ఈ వివాదం ఇరు వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కృతం కావాల్సి ఉంది. పెట్రో ఉత్ప‌త్తుల‌పై ఏటా ల‌క్ష కోట్ల రూపాయ‌లను లాస్ చేసుకుంటున్నామ‌ని ఇప్ప‌టికే ల‌బోదిబోమంటున్న కేంద్రం ఒక్క మ‌న రాష్ట్ర డీల‌ర్లకే మూడు వంద‌ల కోట్ల రూపాయ‌లు వెన‌క్కు ఇవ్వాలంటే ఈ లెక్క దేశ వ్యాప్తంగా ముందుగానే ఎక్సైజ్ డ్యూటి చెల్లించిన వారి గ‌తేం కావాలి?

ఇన్ని విధాలుగా డ‌బ్బులు దండుకుంటున్నా కూడా అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ కొన్ని విష‌యాల్లో కూడా సామాన్యుల‌పై జాలి చూప‌డం లేదు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ చెప్పిన విధంగా ల‌క్ష కోట్ల న‌ష్టం అబ‌ద్ధం అయినా ఉండాలి..లేదా ఎక్సైజ్ డ్యూటీ వెన‌క్కు ఇవ్వ‌నైనా ఇవ్వాలి.