Begin typing your search above and press return to search.

బోస్ ను వాడేసేలా మోడీ సర్కారు కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   16 Jan 2022 4:40 AM GMT
బోస్ ను వాడేసేలా మోడీ సర్కారు కీలక  నిర్ణయం
X
కాంగ్రెస్ చేసిన తప్పుల్ని తెలివిగా ఎత్తి చూపుతూ.. వారునిర్లక్ష్యం చేసిన వారిని తరచూ స్మరిస్తూ.. వారి మీద తమకున్న ప్రేమాభిమానాల్ని మాటల్లో చెబుతూ.. మనసుల్ని దోచేసే అద్భుతమైన ప్లానింగ్ మోడీ మాష్టారిదిగా చెప్పాలి. కాంగ్రెస్ అన్నంతనే నెహ్రూ.. గాంధీలు తప్పించి మరెవరూ కనిపించకూడదన్నట్లుగా వ్యవహరించి తప్పు చేసిన దానికి తగ్గట్లే.. అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లిస్తోంది.

దశాబ్దాల పాటు సాగిన కాంగ్రెస్ పాలనలో కనిపించని.. సర్దార్ వల్లభాయ్ పటేల్.. సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయుల్ని.. తెలివిగా వాడేస్తే.. వారిని అభిమానించే కోట్లాది మందిని తమవైపునకు తిప్పుకోవటంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

ఇక్కడ మోడీ మాష్టారి చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారని చెప్పాలి. సర్దార్ పటేల్ పేరును ఎంతలా వాడేశారో తెలియంది కాదు. ఆయన పేరుతో ఒక భారీ విగ్రహాన్ని నిర్మించి.. చేతులుదులిపేసుకున్నారే తప్పించి.. ఆయన భావజాలాన్ని తన ఏడేళ్ల పాలనలో ఎప్పుడూ ప్రదర్శించింది లేదు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 14ను దేశ విభజన సంస్మరణ దినోత్సవంగా.. అక్టోబరు 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దివస్ గా వేడుకల్ని నిర్వహిస్తున్న మోడీ సర్కారు.. తాజాగా బోస్ ను నెత్తిన పెట్టుకున్న భావన కలిగేలా నిర్ణయాన్ని తీసుకుంది.

సుభాష్ చంద్రబోస్ జయంతిఅయిన జనవరి24ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచి జనవరి 24 నుంచి గణతంత్ర వేడుకల్ని నిర్వహించాలని నిర్ణయించారు. అంటే.. జనవరి 26 నిర్వహించే గణతంత్ర వేడుకల్ని రెండు రోజులు ముందు నుంచే జరిపేలా మోడీ సర్కారు ప్లాన్ చేస్తోంది. తద్వారా ఇంతకాలం గుర్తించని బోస్ ను తామే గుర్తించినట్లుగా భుజాలు ఎగరేయనుంది.

భారత చరిత్ర.. కల్చర్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాల్ని స్మరించుకోవటంలో ప్రధాని నరేంద్ర మోడీ నేత్రత్వంలోని ఎన్డీయే సర్కారు తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. అధికారంలోకి వచ్చి ఏడేళ్లుగా గుర్తుకు రాని బోస్.. తాజాగా ఎందుకు గుర్తుకు వచ్చినట్లు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటోళ్లు ఎవరు?