Begin typing your search above and press return to search.

జగన్ కి మోడీ శుభ వార్త...?

By:  Tupaki Desk   |   24 Jan 2022 3:30 PM GMT
జగన్ కి మోడీ శుభ వార్త...?
X
కేంద్రంలో మోడీ సర్కార్ ఏపీకి అన్నీ చేసింది. ఏపీ అంటే ప్రధానికి ప్రత్యేకమైన అభిమానం అని తెల్లారిలేస్తే ఏపీ బీజేపీ నేతలు ఊదరగొడతారు. ఏపీలో జరిగినదంతా తమ గొప్పతనమే అంటారు. మరి ఇపుడు అదే మాటను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. ఏపీకి మోదీ బాగా ప్రయారిటీ ఇస్తున్నారు అని ఆయన ఢిల్లీలో మీడియా ముందు చెబుతూంటే వినడానికి చిత్రంగానే ఉంది మరి. ఏపీకి బీజేపీ ఏమీ చేయడంలేదు అని మరో వైపు చాలా మంది వైసీపీ నేతలు అనడమూ అంతా చూస్తున్నారు.

అలాంటిది మోడీ ఏపీకి జగన్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు అని విజయసాయిరెడ్డి అంటున్నారు. గత నెలలో ఢిల్లీ జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. విభజన నాటి నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగులో ఉన్న సమస్యలు అన్నీకలిపి మరీ ఒక వినతిపత్రం ద్వారా జగన్ ఏకరువు పెట్టాదు. అయితే దానికి చాలా తొందరగానే స్పందన వచ్చింది అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.

ఏకంగా ఇరవై మంది కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శులు, అధికారులతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు అంతా కలసి ఒక కీలక మీటింగ్ ఢీల్లీలో ఏపీ ఆర్ధిక పరిస్థితి మీద నిర్వహించడం అంటే ఆషామాషీ కాదనే అంటున్నారు. ఏపీకి కేంద్రం ఇవ్వాల్సింది ఏంటి, విభజన నాటి ఆర్ధిక స‌మస్యలు ఏంటి అన్న దాని మీద రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఏపీకి చెందిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టునకు సంబంధించి సవరించిన అంచనాలను ఎలాంటి మార్పులు లేకుండా ఆమోదించడానికి ఆమోదం కుదిరింది అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అదే విధంగా పునరావాస ప్యాకేజి సహా అనేక అంశాల మీద కూడా అవగాహన కుదిరింది అంటున్నారు. ఇక ఏపీకి రావాల్సిన ఇతర రెవిన్యూ తదితర విషయాల మీద కేంద్ర కార్యదర్శులతో జరిగిన ఈ సమావేశంలో సంతృప్తికరమైన తీరులో సమాధానాలు వచ్చాయని, త్వరలోనే మంచి శుభవార్త వింటామని విజయసాయిరెడ్డి అంటున్నారు.

అంటే తొందరలోనే కేంద్రం ఏపీకి అన్ని కీలక అంశాల మీద మంచి కబురే చెబుతుందని, అది జగన్ చెవిన మోడీ వేస్తారని వైసీపీ నేతలు అయితే ఆశాభావంతో ఉన్నారు. కేంద్ర కార్యదర్శుల సమావేశంలో ప్రధాని ఆఫీస్ అధికారులు కూడా పాల్గొనడంతో నేరుగా ఈ సమావేశం వివరాలు అన్నీ ప్రధానికి చేరవేసే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఆ మీదట దీని మీద త్వరగానే నిర్ణయాలు ఉంటాయని కూడా భావిస్తున్నారు.

అదే జరిగితే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లే మరి. అయితే ఏపీ బీజేపీ నేతల ప్రమేయం లేకుండా నేరుగా ప్రధాని మోడీ జగన్ కి ఇన్నేసి వరాలు ఇచ్చేసి శుభవార్తలు చెబుతూంటే కమలనాధులు చూస్తూ ఊరుకుంటారా. మోడీ తరువాత పెద్ద బాస్ అయిన అమిత్ షా ఏపీ విషయంలో ఎలా రియాక్టు అవుతారో మరి. ఏమో ఎవరేమి చెప్పగలరు, ఫక్తు రాజకీయం ఇది. ఉత్తరాదిన జరుగుతున్న ఎన్నికలలో ఏమైనా తేడా కొడితే ఏపీ వైపే బీజేపీ చూడాలి. మరి అలాంటి ఈక్వేషన్స్ ఏమైనా వర్కౌట్ అయితే మాత్రం ఏపీలో జగన్ పంట పండినట్లే అంటున్నారు.