Begin typing your search above and press return to search.

కొత్త పార్లమెంట్ సాక్షిగా మోడీ వన్ మాన్ షో

By:  Tupaki Desk   |   29 May 2023 7:00 AM GMT
కొత్త పార్లమెంట్ సాక్షిగా మోడీ వన్ మాన్ షో
X
ప్రధాని నరేంద్ర మోడీ గత తొమ్మిదేళ్లుగా ఈ సువిశాల దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఆయన మార్క్ పాలనలో చూపిస్తున్నారు. మోడీ పేరు చరిత్రలో నిలవాలన్న తపనతో ఆయన చాలా కీలకమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. మోడీ హయాంలో అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుపుకుంటోంది. కాశ్మీర్ కి 370 స్వయం ప్రతిపత్తి రద్దు చేసి దేశంలో అంతర్భాగం అని చాటి చెప్పారు. ఇక ఏడున్నర పదులుగా నెహ్రూ నుంచి నేటి వరకూ కొనసాగిన భారత పార్లమెంట్ పాతది అయింది.

కొత్తగా అద్భుతమైన పార్లమెంట్ ని రెండున్నరేళ్ళ కాలంలోనే మోడీ ప్రభుత్వం నిర్మించి జాతికి అంకితం చేసింది. ఈ పార్లమెంట్ ప్రారభోత్సవం అంతా వన్ మ్యాన్ షోగా మోడీ చేతుల మీదుగానే సాగింది. ఆయన ఒక్కరి పేరు మాత్రమే శిలా ఫలకాల మీద ఉన్నాయని అంటున్నారు. విపక్షాలు సైతం గైర్ హాజరు అయి మోడీకే ఆ క్రెడిట్ మొత్తం తాముగా ఇచ్చేశాయి. దాంతో మోడీ అనుకున్నదే అయింది. ఆయన ప్రశాంతంగా మొత్తం కార్యక్రమం తన చేతుల మీదుగా చేసి తానే అంతా అనిపించారు.

ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం విపక్షాల వ్యూహాత్మక రాజకీయ వైఫల్యం అని అంటున్నారు. పార్లమెంట్ అంటే దేశం మొత్తం ప్రజలది. అక్కడ చర్చలు జరుగుతాయి. ఎంపీలు అంతా అక్కడికే వెళ్లాలి. ఈ రోజున గైర్ హాజరు అయినా తరువాత జరిగే పార్లమెంట్ సెషన్స్ కి వెళ్ళకుండా ఉంటారా. విమర్శలు చేయవచ్చు. కానీ జరిగేది జరిగిపోతున్న వేళ అనివార్యం అయిన వేళ తమ అభిప్రాయాన్ని మీడియాకు చెప్పి అక్కడితో నిరసనను సరిపెట్టాల్సి ఉంది.

కానీ కర్నాటక ఎన్నికల తరువాత కేంద్రంలో వచ్చేది తామే అన్న భావనతో లేక మోడీ మీద మూకుమ్మడిగా రాజకీయ బలాన్ని చూపించాలనుకున్నారో తెలియదు కానీ అంతా కలసి మేము రామని చెప్పారు. అయితే మాత్రం ఏమైంది, కార్యక్రమం ఆగిందా. ఎంచక్కా జరిగిపోయింది. రేపటి భారత రాజకీయ చరిత్రలో మోడీ పేరు చిరస్థాయిగా నిలిచేలా ఈ ఓపెనింగ్ సాగింది.

మరో వైపు చూస్తే దేశంలో మోడీ ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అధ్యక్ష తరహా పాలన తేవాలన్నది మోడీ ఆలోచన అని కూడా అంటున్నారు. నిజంగా అలా జరుగుతుందా. మోడీకి కానీ బీజేపీకి కానీ ఆ ఉద్దేశ్యాలు ఉన్నాయా అన్నది కూడా చర్చకు వస్తోంది.

అధ్యక్ష తరహా పాలన తేవాలని గతంలో ఇందిరా గాంధీ ప్రయత్నం చేసింది అని ప్రచారంలో ఉన్న మాట. తాను రాష్ట్రపతిగా తన కుమారుడు సంజయ్ గాంధీ ప్రధానిగా ఉండాలని ఆమె కోరుకున్నారని అప్పట్లో చెప్పుకునేవారు. ఇపుడు చూస్తే మోడీ శక్తివంతమైన నాయకుడిగా ఉన్నారు. రెండు సార్లు ఫుల్ మెజారిటీ తో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2024లో కూడా 300 కంటే ఎక్కువ సీట్లు తమకు దక్కుతాయని అమిత్ షా ఇటీవలే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

నిజంగా బీజేపీకి అన్ని సీట్లు దక్కి మిత్రులకు కూడా బాగా సీట్లు వస్తే దేశంలో రాజ్యాంగ సవరణ చేసి అధ్యక్ష తరహా పాలన దిశగా బీజేపీ అడుగులు వేస్తుందా అన్నది ఒక ఆసక్తికరమైన చర్చగానే ఉంది. బీజేపీ ఇప్పటికే చాలా టాస్క్ లను సాధించింది. ఇక బీజేపీ కి మరికొన్ని మిగిలి ఉన్నాయి. అవి కూడా ఈ టెర్మ్ లో కొన్ని వచ్చే టెర్మ్ లో మరికొన్ని పూర్తి చేసుకుంటే కనుక భారత్ అధ్యక్ష తరహా పాలన చూసినా ఆశ్చర్యం అయితే లేదు అని అంటున్నారు. మోడీ ప్రధానిగా మూడు సార్లు పనిచేశాక రాష్ట్రపతి అవుతారు అని చాలా కాలంగా బీజేపీ నుంచి వినిపిస్తున్న మాట.

ఆయన వంటి శక్తివంతమైన నాయకుడు రాష్ట్రపతిగా ఉంటే అది అధ్యక్ష తరహా పాలనకే దారి తీస్తుంది అని అంటున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో సీపీఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ రాజదండం అన్నది ప్రజాస్వామ్య సంకేతం కాదని నెహ్రూ దాన్ని పక్కన పెడితే మోడీ తీసుకుని వచ్చి స్పీకర్ చెయిర్ పక్కన ప్రతిష్ట చేయడం అంటే ఎలా చూడాలని ప్రశ్నించారు. బీజేపీ విధానాలు ప్రజాస్వామిక పోకడలకు దూరంగా ఉంటున్నాయని అంటున్నారు.

ఎవరేమి అనుకున్నా బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది. ఆ దిశగా తన ప్రయత్నాలను చేసుకుంటోంది. 2047 దాకా కూడా బీజేపీ అధికారంలో కొనసాగాలన్న మాస్టర్ విజన్ కూడా ఉందని అంటారు. దాని కోసం బీజేపీ వ్యూహాలు దానికి ఉన్నాయి. ఎవరేమన్నా ప్రధానిగా మోడీ అనుకున్నది సాధిస్తున్నారు. అలా ముందుకు సాగుతున్నారు. విపక్షాలు గతం కంటే కాస్తా మెరుగు కావచ్చు కానీ సిద్ధాంతపరంగా బలంగా ఉన్న బీజేపీని, శక్తివంతమైన మోడీని, అలాగే ఆరెస్సెస్ భావజాలాన్ని సమిష్టిగా సంఘటితంగా పటిష్టంగా ఎదుర్కోవడంలో ఈ బలం అసలు ఏ మాత్రం సరిపోదు. అదే బీజేపీకి కానీ మోడీకి కానీ ఎప్పటికీ శ్రీరామ రక్షగానే చూడాలని అంటున్నారు.