Begin typing your search above and press return to search.

మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   5 Dec 2022 9:04 AM GMT
మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్
X
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన కొడుకును డాక్టర్ ను చేస్తే తనకు డాక్టర్ కోడలు వచ్చేదని.. రెడ్డి అమ్మాయిని చేస్తే పిక్నిక్ లు, కిట్టీ పార్టీలు అంటూ వెళ్లేదని.. నా కోడలుకు అమ్మానాన్న లేరని.. తను నాకు మూడో కొడుకు అని మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బర్త్ డే పార్టీలు, పిక్నిక్ లు అంటూ తల్లిదండ్రులే తమ పిల్లలను చెడగొడుతున్నారని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు.

జీవితంలో సాధించాలంటే.. ప్రేమ, ఫ్రెండ్ షిప్ లాంటి వాటికి దూరంగా ఉండాలని.. కొన్ని సాధించాలంటే కొన్నింటిని వదులుకోవాల్సిందేనని తెలిపారు. తనంత అదృష్టవంతుడు ఎవరూ లేరని.. కలలను నిజం చేసుకున్నానంటూ తెలిపారు.

భూమి అమ్మి కొడుకును డాక్టర్ చదువు చదివించానని.. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయ్యానని చెప్పారు. తాను ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని.. మనసులో ఏమీ దాచుకోనని మల్లారెడ్డి తెలిపారు.

మెడికల్ కాలేజీల్లో డొనేషన్ సీట్లే లేవని.. అన్నీ ఆన్ లైన్ అడ్మిషన్ సీట్లేనని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన కొడుకు సీటు కావాలన్నా నేను ఇవ్వలేదన్నారు. నేను భూమి అమ్మి కొడుకును ఎంబీబీఎస్ చేయించానని.. నాపై ఐటీ దాడులు చేసినా అసలు భయపడేది లేదన్నారు. 400 మంది ఐటీ అధికారులు వచ్చి వాళ్ల పని వాళ్లు చేసుకొని వెళ్లారన్నారు. ఐటీ దాడుల్లో ఏమీ దొరక్కపోవడంతో అధికారులు నాపై నిరాధారమైన ఆరోపణలు చేసి వెళ్లారని మల్లారెడ్డి విమర్శించారు.

నన్ను కొంతమంది బ్లాక్ మెయిలర్స్ ఇబ్బంది పెట్టారని.. మూడు ఎంబీబీఎస్ బ్యాచ్ లు రాకుండా ఇబ్బంది పెట్టారని.. తుఫాన్ లు వచ్చినా తట్టుకునే ధైర్యం నాకు ఇప్పుడు వచ్చిందని మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

ఇటీవల మల్లారెడ్డిపై రెండు రోజుల పాటు ఐటీ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కోట్ల నగదుతోపాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్ధేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చించినట్టు పేర్కొన్నారు. సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.