Begin typing your search above and press return to search.

మిస్టరీని ఛేదించారు.. ఆ రాక్షసుడు పదిమందిని ఎందుకు చంపాడంటే?

By:  Tupaki Desk   |   26 May 2020 4:50 AM GMT
మిస్టరీని ఛేదించారు.. ఆ రాక్షసుడు పదిమందిని ఎందుకు చంపాడంటే?
X
వరంగల్ జిల్లా గొర్రెకుంట గోనె సంచుల గోదాము వద్ద పాడుబడిన బావిలో 9 మంది చనిపోయి ఉండటం సంచలనంగా మారింది. తొలుత అనుమానస్పద మరణాలుగా భావించినప్పటికి.. చివరకు అవన్నీ హత్యలుగా తేలటంతో పెను సంచలంగా మారింది. ఇన్ని హత్యలు ఎంతమంది చేశారు? హత్యకు అసలు కారణం ఏమిటి? అన్న విషయాల్ని తేల్చేందుకు వరంగల్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అతి తక్కువ సమయంలోనే నిందితుడ్ని గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను చేసిన దుర్మార్గం గురించి పూస గుచ్చినట్లుగా చెప్పటంతో.. పోలీసులు సైతం అవాక్కు అయ్యారు. సవాలుగా మారిన మిస్టరీ హత్యల్ని కేవలం 72 గంటల్లో ఛేదించటంలో పోలీసులు విజయం సాధించారు. ఇంతకీ.. ఈ తొమ్మిది హత్యలు ఎందుకు జరిగాయన్న విషయంలోకి వెళితే.. ఒక హత్యను కప్పిపుచ్చుకోవటానికే అన్న విషయం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఆరేళ్ల క్రితం బిహార్ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఉపాధి కోసం వరంగల్ కు వచ్చాడు. మిల్స్ కాలనీలోని గోనె సంచుల తయారీ కేంద్రంలో పని చేసేవాడు. అక్కడ వారికి మక్సూద్ కుటుంబంతో పరిచయమైంది. ఈ కుటుంబంతో పాటు మక్సూద్ భార్య నిషా అక్క కూతురు 37 ఏళ్ల రఫికా ఉండేది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త పోయిన ఆమె.. పిల్లలతో కలిసి ఉండేది.

ఈ క్రమంలో రఫికాకు.. సంజయ్ కు వివాహేతర సంబంధం మొదలైంది. వీరిద్దరూ కొంతకాలంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రఫికా పెద్ద కుమార్తె మీద కన్నేసిన సంజయ్.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీనికి రఫికా తీవ్రంగా వ్యతిరేకించేది. బుద్ధిగా తనను పెళ్లి చేసుకోవాలని.. లేనిపక్షంలో పోలీసులకు కంప్లైంట్ చేసుకోవాలని హెచ్చరించేది. దీంతో.. ఆమెను అడ్డు తొలిగించేందుకు భారీ ప్లాన్ వేశాడు. బెంగాల్ లో ఉన్న తమ ఇంటి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందామని చెప్పి.. ఆమెను తీసుకొని బెంగాల్ లకు రైల్లో మార్చి ఆరున బయలుదేరాడు. ట్రైన్లో ఆమె తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. ఆమె నిద్రపోయిన తర్వాత.. చున్నీతో ఆమెను చంపి తెల్లవారుజామున ఏపీలోని నిడదవోలు సమీపంలో రైలు నుంచి ఆమెను బయటకు నెట్టేశాడు.

అనంతరం రాజమహేంద్రవరం స్టేషన్ లో దిగి వరంగల్ కు వచ్చేశాడు. రఫికా బెంగాల్ వెళ్లిందని నమ్మించాడు. అయితే.. మక్సూద్ భార్య నిషా అదేపనిగా రఫిక గురించి అడిగేది. దీంతో.. ఆమెను అడ్డు తొలగించేందుకు వీలుగా దుర్మార్గమైన ప్లాన్ వేశాడు. తాను చేసిన హత్య ఎక్కడ బయటపడుతుందో అన్న సందేహంతో.. నిషా.. ఆమె కుటుంబ సభ్యులు తొమ్మిది మందిని చంపేస్తే.. తన సమస్య తీరుతుందని భావించాడు. ఇందులో భాగంగా మందుల షాపులో 60 నిద్ర మాత్రలు కొన్నాడు.

మే 20న మక్సూద్ పెద్ద కొడుకు షాబాద్ పుట్టినరోజుకావటంతో వారింటికి వెళ్లి కాలక్షేపం చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా వారు వండుకున్న పప్పులో నిద్రమాత్రలు కలిపాడు. వారి కుటుంబం ఇచ్చిన విందుకు మక్సూద్ మరో బంధువు షకీల్ హాజరయ్యాడు. సంజయ్ దుర్మార్గం తెలీని వారు ఆహారం తిన్న తర్వాత నిద్రమత్తులోకి జారిపోయారు. అర్థరాత్రి వేళలో మత్తులో ఉన్న 9 మందిని గోనె సంచుల్లో కట్టేసి.. పాడుబడిన బావిలో పడేశాడు. వారంతా చనిపోయినట్లు నిర్దారించుకున్న తర్వాత ఇంట్లో ఉన్న కిరాణా సామాగ్రి తో పాటు.. షకీల్ పర్సు.. వారి సెల్ ఫోన్లను తీసుకొని వరంగల్ లోని తన ఇంటికి చేరుకున్నాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించటంతో చేసిన దుర్మార్గాన్ని చెప్పేశాడు. తక్కువ వ్యవధిలో సంచలన హత్యల వెనకున్న కసాయిని పట్టుకోవటంలో వరంగల్ పోలీసులు సక్సెస్ అయ్యారు.అందరి అభినందనలు అందుకుంటున్నారు.