Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం !

By:  Tupaki Desk   |   17 Jun 2021 3:08 AM GMT
ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం !
X
దేశ రాజధాని ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )లో బుధవారం అర్దరాత్రి దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిమ్స్ బిల్డింగ్ తొమ్మిదో అంతస్తులో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అయితే , అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లోర్‌లో రోగులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇప్పటి వరకూ ఎవరూ గాయపడలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం అందినట్టు అగ్నిమాపక శాఖ తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మంటలను ఆర్పడానికి మొత్తం 22 ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దింపారు.

ఎయిమ్స్ కన్వర్జెన్స్ బ్లాక్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఇందులో పలు డయాగ్నిస్టిక్ ల్యాబొరేటరీలు, ఎగ్జామినేషన్ విభాగాలు ఉంటాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం తొమ్మిదో అంతస్తులోని ఓ రిఫ్రిజిరేటర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపులో తెచ్చాయి. లొపలి ఉన్న అందర్నీ రక్షించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం కలవరానికి గురిచేస్తోంది. గతవారం లజపత్ నగర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగి భారీ ఆస్తి నష్టం సంభవించింది.