Begin typing your search above and press return to search.

సైకిల్ రెండు పశువులు మంత్రి మల్లారెడ్డి చరిత్ర ఇదీ

By:  Tupaki Desk   |   4 Dec 2022 5:46 AM GMT
సైకిల్ రెండు పశువులు మంత్రి మల్లారెడ్డి చరిత్ర ఇదీ
X
మంత్రి మల్లారెడ్డిపై ఇటీవల ఐటీ, ఈడీ దాడులతో అందరిలోనూ ఒకటే చర్చ నడుస్తోంది. ఇంతకీ మల్లారెడ్డికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి.? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా ఎదిగాడన్న దానిపై విశ్లేషణలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్ధేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి.అనధికారికంగా లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చించినట్టు పేర్కొన్నారు. ఇక ఐటీ సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

ఇక మల్లారెడ్డి మాత్రం తమ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, ధ్రువపత్రాలు సరిగ్గానే ఉన్నాయని తెలిపారు. కళాశాలలు, ఆస్పత్రులు, ఆస్తుల వివరాలను ఐటీ అధికారులకు అందించాం. ఐటీ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తున్నాం.. అనుమతులతోనే నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే తన ఆస్తుల చిట్టాపై మల్లారెడ్డి బయటపెట్టారు. సంచలన కామెంట్స్ చేశారు. 1976లో తన పెళ్లి నాటికి సైకిల్, రెండు పశువులు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు దేశంలో అత్యుత్తమ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలను నడిపిస్తున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో అందరూ తనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

సికింద్రాబాద్ లోని బోయినపల్లిలో పుట్టిన మల్లారెడ్డి కష్టపడి రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించానని.. సీఎం కేసీఆర్ దయతో మంత్రిని కూడా అయ్యానని తెలిపారు. ఇందుకోసం తానెంతో కష్టపడ్డానని.. అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారాలు ప్రారంభించానని వివరించారు.

మల్లారెడ్డి ప్రముఖ వ్యాపారవేత్తగా ఉండడంతో 2014లో టీడీపీ మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆ సమయంలో గెలవడంతో మల్లారెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు. 2016లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.