Begin typing your search above and press return to search.

పోలీసులకు పొంచి ఉన్న ముప్పు: మ‌హారాష్ట్ర‌లో 114 మందికి వైర‌స్‌

By:  Tupaki Desk   |   31 May 2020 3:50 AM GMT
పోలీసులకు పొంచి ఉన్న ముప్పు: మ‌హారాష్ట్ర‌లో 114 మందికి వైర‌స్‌
X
దేశవ్యాప్తంగా మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభిస్తోంది. ఆ వైర‌స్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. తీవ్ర‌స్థాయిలో దాడి చేస్తుండ‌డంతో కల్లోల వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో ప‌రిస్థితి దారుణంగా మారింది. ఆ రాష్ట్రంలో 24 గంటల్లో 2,682 కొత్త కేసులు నమోదవగా.. 116 మృతులు ఉన్నారు. వీటితో క‌లిపి ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 62,228కి చేరాయి. మరణాలు 2,098కి చేరుకుంది. అయితే తాజాగా వీరిలో పెద్ద సంఖ్య‌లో పోలీసులు వైర‌స్ బారిన ప‌డుతున్నారు. లాక్‌ డౌన్‌ విధుల్లో ఉన్న చాలామంది పోలీసులు వైరస్‌ బారిన పడటం కలవ‌రం రేపుతోంది. తాజాగా న‌మోదైన కేసుల్లో 114 మంది పోలీసులు ఆ వైర‌స్ బారిన పడ్డారు. దీంతో పోలీస్ శాఖ‌లో భ‌యాందోళ‌న‌లు పెరిగాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క పోలీస్ శాఖ‌లోనే వైర‌స్ బారిన ప‌డిన వారి సంఖ్య 1,330 ఉండ‌గా - మృతులు 26కు చేరారు.

వైర‌స్ క‌ట్ట‌డిలో భాగంగా విధులు నిర్వ‌హిస్తున్న పోలీసులు ఈ విధంగా వైర‌స్ బారిన ప‌డ‌డంతో పోలీస్ శాఖలోని అధికారులు - సిబ్బంది ప‌ని చేయ‌డానికి జంకుతున్నారు. ఈ క్ర‌మంలోనే పోలీస్ శాఖ నివార‌ణ చర్య‌లు చేప‌ట్టింది. మ‌ధుమేహం‌ - బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 52 మంది పోలీసు సిబ్బందిని ఇళ్లల్లోనే ఉండాలని ఈ సంద‌ర్భంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. వీరితో పాటు మ‌హ‌మ్మారి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య - పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఆ వైర‌స్‌ బారిన పడుతుండ‌డం ఆందోళ‌న రేపుతోంది.

మహారాష్ట్రలో మొత్తం కేసులు 62,228 - మరణాలు 2,098 ఉండ‌గా రాష్ట్ర రాజధాని - దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న‌ ముంబైలోనే అత్య‌ధికంగా ఉన్నాయి. వాటిలో సగానికి పైగా ముంబై న‌గ‌రంలోనివే. ముంబైలో 36,932 కేసులు - 1,173 మరణాలు ఉండ‌డంతో ఆ న‌గ‌రంలో ప‌రిస్థితి తీవ్రంగా ఉంది.