Begin typing your search above and press return to search.

ప్రియుడి కోసం పిచ్చ ప్లాన్ వేసి అడ్డంగా బుక్ అయ్యింది

By:  Tupaki Desk   |   7 March 2021 10:30 AM GMT
ప్రియుడి కోసం పిచ్చ ప్లాన్ వేసి అడ్డంగా బుక్ అయ్యింది
X
తెలివి స్థానే అతితెలివి ఈ మధ్యన ఎక్కువైంది. ఉన్నదేదో సూటిగా.. సుత్తి కొట్టకుండా చెప్పేస్తే సరిపోతుంది. సాధ్యం కాదనుకుంటే కాస్త కష్టమైనా నిజాయితీగా వ్యవహరిస్తే పోతుంది. అందుకు భిన్నంగా అబద్ధాలు.. దరిద్రపుగొట్టు ఐడియాలు వేసి.. మొదటికే మోసం వచ్చే పరిస్థితులకు కారణమవుతున్న ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ప్రియుడితో హోటల్ లో గడిపేందుకు.. చిన్నారిని కిడ్నాప్ చేసిన వైనం కలకలం రేపింది. విన్నంతనే మరీ ఇంత చావుతెలివి ఏమిట్రా బాబు అనుకోకుండా ఉండలేం. ఇంతకూ ఏం జరిగిందంటే..

పంజాబ్ రాష్ట్రంలోని ఫతేపూర్ కు చెందిన 20 ఏళ్ల నిషు తన సోదరుడి కుమార్తె అయిన మూడేళ్ల బాలికను ఇంట్లో నుంచి వెంట పెట్టుకొని వెళ్లిపోయింది. జలంధర్ కు వెళ్లిన ఆమె.. అక్కడ తన ప్రియుడు పాతికేళ్ల నవదీప్ ను కలుసుకుంది. తామంతా ఒక ఫ్యామిలీ అని నమ్మించి.. హోటల్ రూం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి పాప కనిపించకపోవటంతో నిషు సోదరుడి కుటుంబం కంగారు పడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన వారు దర్యాప్తు షురూ చేశారు.

సీసీ కెమేరాలు చెక్ చేయగా.. పాపను పట్టుకొని నిషు వెళ్లిన వైనాన్ని గుర్తించారు. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా జలంధర్ లోని హోటల్ కు వెళ్లారు. పోలీసుల్నిచూడగానే నిషు షాక్ తిన్నది. తాను తన సోదరుడి పాపను కిడ్నాప్ చేయలేదని.. తన కాబోయే భర్తతో గడిపేందుకు వచ్చినట్లు చెప్పింది. తాము పెళ్లి చేసుకోవాలనుకున్నామని.. పాపతో ఉంటే హోటల్ రూం కు ఇబ్బంది ఉండదని తీసుకొచ్చినట్లు చెప్పింది.

పాపకు ఎలాంటి హాని తలపెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పింది. అయినప్పటికి కేసు నమోదు చేసిన పోలీసులు నిషు.. నవదీప్ లను కోర్టు ఎదుట హాజరు పర్చారు. కోర్టుఆదేశాలతో వారిద్దరిని రిమాండ్ కు తరలించారు. ప్రియుడితో కలిసి ఉండాలంటే తనకు తాను నిర్ణయం తీసుకోవాలి. లేదంటే.. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలి. అంతేకానీ.. ఈ తరహా దరిద్రపు గొట్టు ఐడియాలో వేస్తే మొదటికే మోసం రావటమే కాదు.. చిప్పకూడు తినాల్సి ఉంటుంది.