Begin typing your search above and press return to search.

మూలాల్లోకి వెళ్లిపోతున్న శ్రీదేవి.. డ్యామేజ్ భారీగా జరిగిపోతోందిగా?

By:  Tupaki Desk   |   27 March 2023 5:02 PM GMT
మూలాల్లోకి వెళ్లిపోతున్న శ్రీదేవి.. డ్యామేజ్ భారీగా జరిగిపోతోందిగా?
X
ఏ గూటి పక్షులకు ఆ గూటి ముచ్చట్లు అన్ని తెలుస్తుంటాయి. వైసీపీ వ్యవహారం ఇప్పుడు అలానే ఉంది. గుప్పిట మూసి ఉన్నంతవరకు గుప్పిట్లో ఏం ఉందో అర్థం కాదు. కాస్తంత సడలినా.. లోపల ఉందేమిటో అర్థమైపోతుంది. ఏపీ అధికార పార్టీలో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. ఏ ముహుర్తంలో వచ్చాయో కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎందుకు వచ్చాయా? అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ఏ ఎన్నికల్లోనూ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురుకాకపోవటం.. ఇప్పుడు ఎదురైన ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో అర్థంకాని పరిస్థితిలో పార్టీ అధినాయకత్వం ఉందంటున్నారు.

దీంతో.. ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నంతనే పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. తన మీద రూ.10-20 కోట్ల ముడుపుల ఆరోపణలతో పాటు.. తనను వ్యక్తిగతంగా దారుణంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం.. గుంటూరులోని తన ఆఫీసుపై దాడి జరగటం లాంటి అంశాలతో తాడికొండ ఎమ్మెల్యే తీవ్ర ఆవేదనలోనూ.. ఆగ్రహంలోనూ ఉన్నారు. ఆమె ప్రస్తావించిన పలు అంశాలు ఇప్పుడు చిన్న వీడియోల రూపంలో తెగ షేర్ అవుతూ వైరల్ అవుతున్నాయి. ఇప్పటిదాకా ఆరోపణలు విన్న స్థానే.. ఇప్పుడు శ్రీదేవి వాదనను వింటున్న వారు కాసింత కన్ఫ్యూజన్ కు గురి కావటంతో పాటు.. ఆమె చెప్పే మాటలు నమ్మదగ్గవిగానే ఉన్నాయి కదా? అన్న భావన కలుగుతోంది.

రూ.20కోట్ల ప్రలోభంతో తాను క్రాస్ ఓటింగ్ నకు పాల్పడినట్లుగా పేర్కొన్న వైనంపై ఎమ్మెల్యే శ్రీదేవి స్పందిస్తూ.. ''నేను ఎవరికి ఓటేశానో.. ఎవరైనా లోపలకువచ్చి చూశారా? టేబుల్ కింద ఎవరైనా ఉన్నారా? కెమెరాలు ఏమైనా పెట్టారా? లేనిపోని నిందలు మోపం.. అందరితో తిట్టించటం.. పారిపోయినట్లుగా కట్టుకథలు అల్లటం అందులో భాగమే. నాపై ఉద్దేశ పూర్వకంగా దాడి జరుగుతుంది. ఏ దేవాయానికి అయినా వెళదాం. నేను ప్రమాణం చేస్తాను. మరి.. వాళ్లు ప్రమాణం చేస్తారా?'' అని ప్రశ్నించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయాన్ని ఆమె వెల్లడిస్తూ.. ''ఒక డాక్టర్ గా వివరాలు వెల్లడించటంలో గోప్యత పాటిస్తాం. ఒక ఇల్లు ఖాళీ చేయాలంటే ముందస్తు నోటీసులు ఇస్తాం. అలాంటిది ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండగా నాపై సమన్వయకర్తల పెత్తనం ఏమిటి? ఒక ఎమ్మెల్యేకు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉండదా?'' అంటూ ఆమె వేస్తున్న ప్రశ్నలకు వైసీపీ అధినాయకత్వం ఉలిక్కిపడే పరిస్థితి.

తన కమిట్ మెంట్ గురించి చెప్పిన ఆమె.. ఎంపీటీసీ.. జడ్పీటీసీ ఎన్నికల వేళ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వెనుకాడకుండా తాను ప్రచారానికి వెళ్లానని.. అభ్యర్థులకు పూర్తి మద్దతు ఇచ్చినట్లుగా చెప్పారు. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీమద్దతుతో నిలిచిన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారని.. పోలింగ్ వేళకు తాను కరోనా బారిన పడటమే కాదు.. వెంటిలేటర్ వరకు వెళ్లి వచ్చిన వైనాన్ని గుర్తు చేస్తూ.. 'నా పట్ల పార్టీ పెద్దలు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? నిబద్ధతో ఉంటే నాకు సస్పెన్షన్ బహుమతి ఇస్తారా? వారికి రిటర్న్ గిఫ్టు ఇస్తా' అన్న మాటలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయింటున్నారు.

మిగిలిన వారి మాదిరి తాను చాక్లెట్లు.. బిస్కెట్లకు ఆశపడే బ్యాచ్ కాదని.. డాక్టర్ గా కష్టపడి పని చేస్తే ఎన్నోడబ్బులు వస్తాయన్నారు. తాను హైదరాబాద్ లోని పేరున్న ఆసుపత్రుల్లో పని చేసిన విషయాన్ని గుర్తు చేసిన శ్రీదేవి.. ''నేను డాక్టర్ ను మాత్రమే కాదు. ఐవీఎఫ్ నిపుణురాలిని. నాకు పదకొండు ప్రపంచ రికార్డులు వచ్చాయి. అమెరికాలో టీవీ షోలు చేశా'' అని తన గురించి చెప్పుకొచ్చారు. తనకు టికెట్ ఎలా లభించిందన్న విషయంపై శ్రీదేవే కాదు.. ఆమె భర్త కూడా ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చారు.

వారిద్దరు చెప్పిన విషయాల్నిచూస్తే.. ''చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారు. ఈ ప్రాంతంలోమనం గెలవాలంటే మీలాంటి గొప్ప వైద్యులు ప్రజా జీవితంలోకి రావాలి. రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయొచ్చు అని జగన్ చెప్పారు. మా నాన్న సుబ్బారావు కోరిక మేరకు ప్రజాసేవ చేయాలనుకున్నా. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా? అని బాధ పడుతున్నా. దొంగ ముద్ర వేశారు. ఎన్నికల వేళలో మాకున్న ఓట్లను చూసి టికెట్ల ఇచ్చారు'' అని చెప్పారు.

ఈ సందర్భంగా శ్రీదేవి భర్త మాట్లాడుతూ మరిన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ''మేమిద్దరం వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వాళ్లం. నియోజకవర్గంలో నా సామాజిక వర్గం (కాపులు) ఓట్లు 15వేల ఓట్లు ఉన్నాయి. అందులో సగం ఓట్లు తెచ్చుకుంటే గెలుపు మీదే అని చెప్పారు. ఎన్నికల్లో నా సామాజికవర్గం ఓట్లు దాదాపు పది వేలుగా పడటంతో 4,400 ఓట్ల మెజార్టీతో గెలిచాం. ఇది మా రాజకీయ నేపథ్యం. అలాంటి మేం రూ.10 కోట్లకు అమ్ముడుపోతామా?' అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.తమపై చేసే ప్రతి ఆరోపణపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బలంగా కౌంటర్ ఇస్తున్న వైసీపీ వర్గాలను కలవరానికి గురి చేస్తుందని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.