Begin typing your search above and press return to search.

వెన్నుపోటు ఎపిసోడ్ లో ఆయన కూడానట...?

By:  Tupaki Desk   |   25 Sep 2022 4:00 AM GMT
వెన్నుపోటు ఎపిసోడ్ లో ఆయన కూడానట...?
X
ఒక మేరు నగధీరుడు, తెలుగు వల్లభుడు ఎన్టీయార్ ని వెన్నుపోటు పొడిచే ఎపిసోడ్ లో చాలా మంది ఉన్నారని చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తుంది. అలా ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఉన్నారని నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అంటున్నారు. అప్పట్లో ఎన్టీయార్ ఉత్తరాంధ్రా పర్యటనలో ఉండగా ఆయన్ని దించేసే అతి పెద్ద కుట్ర జరిగిందని, అందులో అయ్యన్నపాత్రుడు కూడా భాగస్వామి అని సంచలన కామెంట్స్ చేశారు.

ఎన్టీయార్ ఆనాడు నర్శీపట్నంలో పర్యటించే సమయంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు ఎన్టీయార్ వెంట ఉండకుండా వెన్నుపోటు కుట్రకు బాబుతో కలసి ఉన్నారని పెట్ల పాత విషయాన్ని కొత్తగా చెప్పారు. అయ్యన్నపాత్రుడు కూడా ఎన్టీయార్ ని దించేయడంలో ముఖ్య భూమిక పోషించారని ఆయన విమర్శించారు. అలాంటి ఆయన ఇపుడు ఎన్టీయార్ గురించి తనకే అభిమానం ఉన్నట్లుగా మంచిగా మాట్లాడుతూంటే చిత్రంగా ఉందని సెటైర్లు వేశారు.

కేవలం ఎన్టీయార్ కే కాదు అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్రాకే తీరని ద్రోహం చేస్తున్నారని నిందించారు. ఆయన చంద్రబాబు ఇద్దరూ వెనకబడిన ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని పెట్ల ఉమాశంకర్ డిమాండ్ చేశారు. టీడీపీ పాలనలో సుదీర్ఘ కాలం మంత్రిగా ఉన్న అయ్యన్న విశాఖ సహా ఉత్తరాంధ్రాకు ఏమీ చేయకపోగా ఇపుడు వెన్నుపోటు పొడుస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.

విశాఖలో రాజధాని పెట్టాలని జగన్ ఆలోచిస్తూంటే అమరావతి మన రాజధాని అంటూ చంద్రబాబుతో కలసి అయ్యన్న పాట పాడడం కంటే దారుణం మరోటి ఉండదని వైసీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. విశాఖ జిల్లాలో అడుగుపెట్టకుండా అమరావతి పాదయాత్రను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాదయాత్ర తప్ప మరోటి కాదని ఆయన పేర్కొన్నారు.

తాము పాదయాత్రను అడ్డుకుంటామని, అయ్యన్న వచ్చినా మరెవరు వచ్చినా వెనక్కు తగ్గేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే అయ్యన్నపాత్రుడిని ఎన్టీయార్ వెన్నుపోటు వెనక ఉన్న వారిగా వైసీపీ ఎమ్మెల్యే చెప్పడమే విశేషం. మరి దీని మీద అయ్యన్న రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.