Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ విలయ తాండవం..గరిష్ట స్థాయికి కేసులు.!

By:  Tupaki Desk   |   20 Jan 2022 4:30 AM GMT
ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ విలయ తాండవం..గరిష్ట స్థాయికి  కేసులు.!
X
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు అమాంతంగా పెరుగుతున్నాయి. కేవలం 24 గంటల్లో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

అంతేకాకుండా రోజువారీ పాజిటివ్ రేటు 15 శాతానికి పైగా నమోదవుతోంది. ఈ క్రమంలో మరింత జాగ్రత్త వహించాలని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో కూడా వైరస్ కేసులు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా భారీగా కేసులు వెలుగు చూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కేరళలో నిన్న ఒక్కరోజులోనే 34 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణ లో వైరస్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించిన దాని ప్రకారం బుధవారం ఒక్కరోజే కేసులు గరిష్ఠంగా 10 వేలకు పైగా నమోదయ్యాయి.

అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా ఎనిమిది మంది చనిపోయినట్లు వైద్య అధికారులు తెలిపారు. సుమారు 41 వేలకు పైగా నమూనాలను పరీక్షించగా పదివేలకు పైగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా పాజిటివిటీ రేటు 24 శాతంగా నమోదైనట్లు చెప్పారు. దీని ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రతి 100 మందిలో కనీసం 24 మంది కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే పాజిటివ్ రేటు అమాంతంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ కేసులు ఈ స్థాయిలో వెలుగు చూడడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది జూన్ లో కూడా ఇదేవిధంగా కేసులు నమోదయ్యాయి అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యే కేసుల్లో ఎక్కువ కేసులు చిత్తూరు, విశాఖ జిల్లాల నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 18 వందలకు పైగా కేసులు చిత్తూరు, విశాఖ నుంచి నమోదైనట్లు పేర్కొన్నారు. అతి తక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం 216 కేసులు మాత్రమే బయటపడినట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే జనవరి 23 నాటికి ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ అగర్వాల్ తెలిపారు. అనంతరం ఏ విధంగా అయితే ఏ ఈ విధంగా అయితే కేసుల సంఖ్య పెరిగిందో... అదేవిధంగా తగ్గుముఖం పడుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే కేంద్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రత్యేకంగా జనవరి 2, 3 వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.