Begin typing your search above and press return to search.

కేటీఆర్ జోస్యాలు మామూలుగా లేవుగా?

By:  Tupaki Desk   |   23 Oct 2021 6:30 AM GMT
కేటీఆర్ జోస్యాలు మామూలుగా లేవుగా?
X
భారీగా చేపట్టిన పార్టీ ప్లీనరీకి ముందు ప్రధాన మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు మంత్రి కమ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఆ ఎన్నికపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పలు జోస్యాల్ని ఈ సందర్భంగా వెల్లడించటం విశేషం.

ఇందులో మొదటిది హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదన్నారు. అంతేకాదు.. గోల్కొండ రిసార్ట్స్ లో రేవంత్.. ఈటల రహస్యంగా భేటీ అయ్యారన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు చెప్పారు.

అంతేకాదు.. హుజూరాబాద్ లో ఈటల ఓటమి ఖాయమని.. టీఆర్ఎస్ గెలుపు పక్కాగా తేల్చేశారు. అంతేకాదు.. ఏడాదిన్నర తర్వాత ఈటల కాంగ్రెస్ పార్టీలో చేరతారన్నారు. ఇక.. టీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు కొత్తకొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. వైఎస్ షర్మిలలు బీజేపీ పన్నాగంలో పాచికలుగా అభివర్ణించారు.

టీఆర్ఎస్ లో తిరుగుబాటు వస్తుందని కాంగ్రెస్ అంటోంది కదా? అన్న ప్రశ్నకు కాసింత ఘాటుగానే రియాక్టు అయ్యారు కేటీఆర్. ‘‘టీఆర్‌ఎస్‌లో ఏ కారణం చేత తిరుగుబాటు వస్తది? హుజురాబాద్‌లో బ్రహ్మాండంగా గెలిచిన తర్వాత తిరుగుబాటు ఎక్కడ వస్తదో చూద్దాం. కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ పొలిటికల్‌ అనలిస్ట్‌లాగా ఎక్కడ ఏం జరుగుతోందో చెప్పేకంటే ముందు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కి డిపాజిట్‌ వస్తదా రాదా అది చెప్పు. మా నాయకుడు నీ లాగా దొంగ కేసులు ఎదుర్కొంటున్నడా? ఎప్పుడు జైలుకు పోతవో తెలువదు. అది గాంధీ భవన్‌ కాదు.. గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండు. నేను చెప్పలే.. నిన్న పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ చెప్పిండు’’ అంటూ రేవంత్ పై విరుచుకుపడ్డారు. మొత్తంగా కేటీఆర్ చెప్పిన జోస్యాల్లో ఎన్ని నిజమవుతాయి? మరెన్ని అబద్ధమవుతాయన్నది తేలాలంటే ఆ విషయాన్నికాలమే నిర్ణయించాలి.