Begin typing your search above and press return to search.

ప్లీనరీలో కీ పాయింట్ : ఆయనే శాశ్వతం... ఆయనే సర్వస్వం

By:  Tupaki Desk   |   7 July 2022 9:36 AM GMT
ప్లీనరీలో కీ పాయింట్ : ఆయనే శాశ్వతం... ఆయనే సర్వస్వం
X
వైసీపీ ప్లీనరీ రెండు రోజుల పాటు గుంటూరులో జరగనుంది. ఈసారి ప్లీనరీ అట్టహాసంగా నిర్వహించడానికి అంతా సిద్ధం అయింది. మరి కొద్ది గంటలలో జరిగే ఈ ప్లీనరీలో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ ఇది. దాంతో ప్రభుత్వం, పార్టీ రెండూ కూడా అక్కడ కనిపిస్తాయి.

ఈసారి ప్లీనరీలో తొమ్మిది అంశాల మీద చర్చ సాగనుంది. వాటికి సంబంధించి ఎవరెవరు మాట్లాడుతారు, ఎవరు ప్రతిపాదిస్తారు అంతా లిస్ట్ అవుట్ చేశారు. ఇక జగన్ ప్లీనరీలో ప్రారంభ ఉపన్యాసం చేసిన తరువాత తీర్మానాలు వరసగా ప్రతిపాదించి ఆమోదిస్తారు. ఇక ప్లీనరీలో సర్వమత ప్రార్ధనలతో పాటు వైఎస్సార్ విగ్రహానికి నివాళి అన్నది ఒక ముఖ్య ఘట్టం.

అటు పార్టీ ఇటు ప్రభుత్వం సహా అంతా హాజరై ప్లీనరీకి సందడిని తెస్తారు. ఇవన్నీ ఇలా ఉంటే ఈసారి పార్టీ రాజ్యాంగానే ఏకంగా మార్చబోతున్నారు అని తెలుస్తోంది. దాని ప్రకారం జగన్ ఇక మీదట వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారు అన్న మాట. సాధారణంగా ఒక పార్టీ సర్వ సభ్య సమావేశాలు నిర్ణీత గడువు లోగా జరుగుతాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంటుంది. ఇదే హైలెట్ గా ఉంటుంది ఎపుడూ.

దాని కోసం జరిగే తంతు మొక్కుబడి అయినా ప్రజాస్వామిక స్పూర్తిని కలిగించడం కోసం నామినేషన్లు వేయడం, వాటి స్క్రూటినీ ఆ మీదట ఏకైక నామినేషన్ అని ప్రెసిడెంట్ నే తిరిగి ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ వైసీపీ రాజ్యాంగాన్ని మారుస్తోంది. దాని ప్రకారం చూస్తే ఈ మొక్కుబడి తంతు ఈ ఆయాసం కూడా అసలు అవసరం లేదు అనే చెప్పుకోవాలి అన్న మాట.

అదెలా అంటే జగనే శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారు. ఆయనే ఎప్పటికీ వైసీపీకి ప్రెసిడెంట్ అన్న మాట. అలా పార్టీ రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించి వాటిని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కోసం పంపుతారుట. అంటే ఇక మీదట వైసీపీకి ప్రత్యేకంగా ఎన్నికలు ఉండవు. జగనే పర్మనెంట్ ప్రెసిడెంట్.

అయినా కానీ వైసీపీకి సర్వం జగనే. ఆయనతోనే పార్టీ ఉంది. ఆయన కాక ఎవరు ప్రెసిడెంట్ అవుతారని. ఆ మాత్రం దానికి శాశ్వత ప్రెసిడెంట్ అని రాసుకోవాలా. అలా కాకుండా ఎన్నికలు పెట్టి ఆయన్నే తిరిగి ఎన్నుకుంటూ ఉంటే ప్రజాస్వామ్య స్పూర్తిగా ఉండేదేమో. ఏది ఏమైనా అది వైసీపీ వారి ఇష్టం. ఇక జనాల మాటకు వస్తే వైసీపీ అంటే జగనే అని చెబుతారు. కాబట్టి ఆయన శాశ్వత అధ్యక్షుడు అని పక్కన వేరేగా రాయాల్సిన పనేముంది అన్నదే చర్చ.