Begin typing your search above and press return to search.

అక్కడ ఆదరణ.. ఇక్కడ నిరాదరణ.. కౌశిక్ రెడ్డికి విచిత్ర పరిస్థితి..!

By:  Tupaki Desk   |   21 March 2023 9:00 PM GMT
అక్కడ ఆదరణ.. ఇక్కడ నిరాదరణ.. కౌశిక్ రెడ్డికి విచిత్ర పరిస్థితి..!
X
'ఇంటగెలిచి రచ్చగెలవాలన్నారు' పెద్దలు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇంటి సంగతి పక్కనబెట్టి ముందుగా రచ్చ గెలిచి వస్తున్నారు. రాజకీయాల్లో ఈ సామెత ప్రకారంగా నడుచుకొని రాణిస్తున్నారు. కానీ ఇంటికొచ్చేసరికి మాత్రం పరాభావం తప్పడం లేదు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గం 2021 ఉప ఎన్నిక సందర్భంగా హాట్ టాపిక్. బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లి మరీ గెలిచారు. అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ సీటు గెలవలేకపోయింది.

దీంతో అధిష్టానం ఈటలకు బలమైన అభ్యర్థిగా భావించి కాంగ్రెస్ లో ఉన్న కౌశిక్ రెడ్డిని తీసుకొని ఎమ్మెల్సీ చేశారు. ఆ తరువాత ప్రభుత్వ విప్ కూడా ఇచ్చి గౌరవించారు. ఇలా అధిష్టానం మెప్పు పొందిన కౌశిక్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో మాత్రం కార్యకర్తలు ఎవరూ పట్టించుకోవడం లేదన్న ప్రచారం అక్కడ జోరుగా సాగుతోంది. కౌశిక్ రెడ్డి మద్దతు లేదని అంటున్నారు. అసలేం జరిగిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ మళ్లీ బీఆర్ఎస్ ఖాతాలోకే వస్తుందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు కౌశిక్ రెడ్డికి టికెట్ ఖాయమనే సంకేతాలు పంపిస్తోంది. కౌశిక్ రెడ్డి సైతం తనకు కేసీఆర్ అండ బాగా ఉండడంతో పాటు కేటీఆర్ సైతం పలుసార్లు మెచ్చుకోవడంతో కాస్త దూకుడు పెంచారు.

అందులో భాగంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఏకంగా గవర్నర్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఇవన్నీ ప్రతిపక్షాల కుట్రలే అని కౌశిక్ రెడ్డి అనుచరులు కొట్టి పారేస్తున్నారు. కానీ నియోజకవర్గంలోని కార్యకర్తలు మాత్రం ఆయనపై వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కౌశిక్ రెడ్డి ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా పోచమ్మ బోనాల సందర్భంగా కౌశిక్ రెడ్డి సొంత ఊరు జమ్మికుంటలోని ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి కౌశిక్ రెడ్డితో పాటు జమ్మికుంట జడ్పీటీసి డాక్టర్ శ్రీరాం శ్యాం, పలువురు వీణవంక ప్రాంతానికి చెందిన నేతలు మాత్రమే వచ్చారు. మిగతా కార్యకర్తలు ఎవరూ కనిపించలేదు.

సాధారణంగా విప్ పదవి స్వీకరించిన తరువాత ఆ నేతకు భారీగా స్వాగతం పలుకుతారు. పలువురు కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలుపుతారు. కానీ హుజూరాబాద్, ఇల్లందకుంట, కమలాపూర్ ప్రాంతానికి చెందిన నేతలు ఒక్కరూ కనిపించలేదు.

మొత్తంగా కాంగ్రెస్ నుంచి తనతో పాటు బీఆర్ఎస్ కు వచ్చిన నేతలు తప్ప మిగతా వారు ఎవరూ ఇక్కడికి రాలేదు. ఆయనకు స్వాగతం పలకలేదు. దీంతో ఆయనకు కార్యకర్తలు కావాలనే దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

కౌశిక్ రెడ్డి విప్ హోదాలో ఉండి నియోజకవర్గానికి ఏం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నామినేటేడ్ పోస్టులు కేటాయించడానికి అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయన సొంత ప్రయోజనాలకు తప్ప కార్యకర్తల కోసం ఏం చేయడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి రచ్చ గెలిచినా.. ఇంట మాత్రం నిరాదరణకు గురవుతున్నాడని అనుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.