Begin typing your search above and press return to search.

నేను గోడ దూకలేదు... ఎక్కడికి పారిపోలేదు!

By:  Tupaki Desk   |   17 May 2022 2:48 AM GMT
నేను గోడ దూకలేదు... ఎక్కడికి పారిపోలేదు!
X
గత వారం రోజులుగా తెలుగు మీడియాలో కరాటే కళ్యాణి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెల్సిందే. శ్రీకాంత్‌ అనే యూట్యూబర్ పై దాడి చేసినట్లుగా వచ్చిన వార్తలతో ఆమె చాలా రోజుల తర్వాత వార్తల్లో నిలిచింది. ఆ విషయంలో ఒకరి పై ఒకరు పోలీసు కేసు పెట్టుకున్నారు.. ఆ విషయంలో రెండు మూడు రోజుల హడావుడి జరిగింది. అదే సమయంలో ఆమె బాధితులం అంటూ కొందరు మీడియా ముందుకు రావడం.. పోలీసుల ముందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా తాజాగా కరాటే కళ్యాణి ఇంటికి చైల్డ్‌ లేబర్‌ ప్రొటక్షన్ అధికారులు వెళ్లడం.. ఆ సమయంలో అక్కడ ఒక చిన్న పాపకు సంబంధించిన మరియు బాబుకు సంబంధించిన వివరాలు లభించడం.. వారిని కరాటే కళ్యాణి అధికారికంగా దత్తత తీసుకోకుండానే తనతోనే ఉంచుకుంటున్నట్లుగా అధికారులు భావించడంతో మీడియాలో మరింత హంగామా సాగింది. అధికారులు వెళ్లిన సమయంలో కరాటే కళ్యాణి లేకపోవడంతో మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.

కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్ వారు ఏకంగా కారటే కళ్యాణి గోడ దూకి పారిపోయారు.. ఆమె పిల్లలను అమ్ముతుంది అంటూ రకరకాలుగా ప్రచారం మొదలు పెట్టారట. దాంతో కరాటే కళ్యాణి మీడియా ముందుకు వచ్చింది. ఆమె తనపై వస్తున్న విమర్శలు మరియు తన గురించి మీడియాలో వస్తున్న కథనాలకు సమాధానం చెప్పేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

తన వద్ద ఉన్న చిన్న పాప తల్లిదండ్రులను కూడా మీడియా సమావేశంలో కూర్చోబెట్టి అన్ని విషయాలను స్పష్టంగా చెప్పేందుకు ప్రయత్నించింది. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని.. రాజకీయ దురుద్దేశ్యం కూడా ఉందని ఆమె ఆరోపించింది. తన వద్ద ఉన్న పాపను అధికారికంగా దత్తత తీసుకోలేదని.. తాను ఆ పాపను పెంచుతున్నాను.. ఆ పాపతో పాటు ఆ పాప కుటుంబం కూడా తనతోనే ఉంటుందని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.

పాప తండ్రి మాట్లాడుతూ.. మాకు ముగ్గురు పిల్లలు. చిన్న పాప పుట్టిన సమయంలో నా భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తెలిసిన ఒక అన్న ద్వారా కరాటే కళ్యాణి అక్కకు మా పాపను ఇచ్చాము. ఆమె వద్ద ఉంటే మంచి చదువు లభిస్తుందని.. మంచి జీవితం దక్కుతుందని భావించామని చెప్పుకొచ్చాడు. మా పాపను ఇష్టపూర్తిగానే ఇచ్చామని.. ఇంకా దత్తత కార్యక్రమాలు జరగలేదని చెప్పుకొచ్చాడు.

మీడియాలో తన గురించి రకరకాలుగా వస్తున్న వార్తలు బాధ కలిగించాని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. నేను గోడ దూకి పారిపోయాను అని రాశారు.. అసలు మా ఇంటికి గోడే ఉండదు.. నేను అనారోగ్యంతో ఉండటం వల్ల ఫోన్ లు మాట్లాడలేక పోయాను.. కొన్ని కారణాల వల్ల కనిపించలేదని అంతే తప్ప నేను ఎక్కడికి పారిపోలేదు అని స్పష్టం చేసింది.

తన వద్ద ఉన్న బాబు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లో చదువుతున్నాడు. నాకు పిల్లలు అంటే ఇష్టం కనుక నేను ఈ పాపను కూడా తీసుకోవాలనుకున్నాను.. కాని ఒక సంవత్సరం అయిన తర్వాతే పాపను దత్తత తీసుకోవాలని భావించి వారిని కూడా నాతోనే ఉంచుకున్నాను అన్నట్లుగా కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా నేను వాటన్నింటికి సమాధానం చెప్తాను.. నేను తప్పు చేయలేదు అంటూ కరాటే కళ్యాణి మీడియా సమావేశంలో పేర్కొంది.