Begin typing your search above and press return to search.

కన్నడ ఎన్నికలు.. తెలుగు తారకలు..

By:  Tupaki Desk   |   29 March 2023 6:42 PM GMT
కన్నడ ఎన్నికలు.. తెలుగు తారకలు..
X
భాషాపరంగానే కాదు.. కల్చర్ పరంగానూ తెలుగు-కన్నడ చాలా దగ్గరగా ఉంటాయి. తమిళం - మలయాళం కూడా దగ్గరగానే ఉన్నా కన్నడం మాత్రం చాలా సామీప్యం. దీనికితోడు కొన్ని దశాబ్దాల కిందటే ఆంధ్రాకు చెందిన కొందరు కర్ణాటక వెళ్లి స్థిరపడ్డారు. సింధనూరు - బళ్లారి - రాయచూర్ - బీదర్ ప్రాంతాల్లో తెలుగు వారి ప్రాబల్యం అధికంగా ఉంటుంది.

తాజా గా ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో తెలుగు వారి లేదా తెలుగు మూలాలున్నవారి ఓటు ఎటు ప్రాధాన్యం పై చర్చ మొదలైంది. హోరా హోరీ లో కీలకం కేంద్రంలో ప్రధాని మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అనేలా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీకి ప్రతిష్ఠాత్మకం. ఓ విధంగా ఈ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్ గా భావించాలి. ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ - రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - ఛత్తీస్ గఢ్ ఎన్నికలు సెమీఫైనల్స్. అందులోనూ బీజేపీకి దక్షిణాదిలో అధికార ముఖ ద్వారమైన కర్ణాటకలో గెలవడం చాలా కీలకం. 223 స్థానాలున్న కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్)దీ కీలక పాత్రే. ఆ పార్టీ నేరుగా అధికారం సాధించలేకున్నా..మరో పార్టీని అధికారానికి దూరం చేయగలదు. ఈ క్రమంలో మిగతా ప్రాధాన్య వర్గాలు ఎవరు? అనే ప్రశ్న వస్తుంది.

తెలుగోళ్లు తీసిపోరు..కర్ణాటకలో తెలుగు ప్రజల ఓట్లు చాలా నియోజకవర్గాల్లో కీలకం.కొన్నినియోజక వర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా. సహజంగానే వీరంతా సినీ అభిమానులు. అక్కడ తెలుగు హీరోల కు మంచి క్రేజ్ ఉంది. అక్కడి రాజకీయాలతో నేరుగా సంబంధాలు లేకున్నా.. నందమూరి - మెగా కుటుంబాలకు కన్నడ సినీ పరిశ్రమతో సత్సంబంధాలున్నాయి.

కాగా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలాగూ తమకు వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించిన బీజేపీ.. వీరిని ఓట్లుగా మలచుకొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజధానితో పాటుగా..కర్ణాటక రాజధాని బెంగళూరులోనే కాకుండా కోలార్ - చిక్ బళ్లాపురం - రాయచూరు ప్రాంతాల్లో తెలుగువాళ్లు ఎక్కువ. వీరి ఓట్లను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ -బీజేపీనే కాక జేడీఎస్ ప్రయత్నాలు సాగించడం ప్రారంభించాయి. దీంతో తెలుగు హీరోల ద్వారా అభిమానుల ఓట్లను తమ వైపు మలచుకొనేందుకు బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. తారక్ తో అందుకేనా షా భేటీ? నాలుగైదు నెలల కిందట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో భేటీ అయ్యారు. దీని మర్మం ఏమిటో నాడు తెలియరాలేదు.

కేవలం ఆర్ఆర్ఆర్ సినిమా అభినందన అని అనుకున్నారు. కానీ, దీనివెనుక కర్ణాటక ఎన్నికల వ్యూహం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ తల్లిది కుందాపూర్. ఆ విధంగా ఎన్టీఆర్ కు కర్ణాటకలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే.. తారక్ కు కర్ణాటక సీఎం బొమ్మై ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న విశిష్ట పురస్కారం వేళ ప్రత్యేకంగా కర్ణాటక ప్రభుత్వం నుంచి తారక్ కు ఆహ్వానం అందింది. చిరు-చరణ్ తోనూ..నాటునాటు పాటకు ఆస్కార్ అందుకున్నాక రాంచరణ్ తో ఢిల్లీలోనే అమిత్ షా భేటీ అయ్యారు. చరణ్ తండ్రి చిరంజీవితోనూ సమావేశమయ్యారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ప్రత్యేకంగా గౌరవించినట్లు వెల్లడించారు.

అదే సమయంలో చిరంజీవిని ఆహ్వానించటం.. ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ, ఢిల్లీలో చిరంజీవికి కేంద్ర హోం మంత్రి ఇచ్చిన ప్రాధాన్యం వెనుక పక్కా లెక్కలు ఉన్నాయనే వాదన ఉంది. పవన్ నూ వాడుకుంటారా? పవర్ స్టార్, జన సేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో బీజేపీ భాగస్వామి. కానీ, ఆ బంధం తెగదెంపుల దగ్గరగా ఉంది. అయితే, పవన్ గతంలో బీజేపీకి అనుకూలంగా కర్ణాటకలో పర్యటించారు. అసలు కర్ణాటక బెంగుళూరు చెందిన యువ ఎంపీనే ఏపీలో బీజేపీ - జనసేన మధ్య పొత్తు కుదిర్చారని చెబుతారు. కానీ, పవన్ ఇప్పుడు ఏపీలోనే బీజేపీతో దూరంగా ఉంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో మద్దతిస్తారా? అంటే చెప్పలేని పరిస్థితి.ఆ ప్రకాశం ఎవరి వైపే..బహు భాషా నటుడు ప్రకాశ్ రాజ్ ది కర్ణాటక. ఆయన గతంలో అక్కడ పోటీ కూడా చేశారు. అయితే, పక్కా మోదీ వ్యతిరేకి అయిన ప్రకాశ్ రాజ్ ఓటమిపాలయ్యారు.

కానీ, ఆయనను తెలంగాణ సీఎం కేసీఆర్ చేరదీశారు. ఈసారి ఎన్నికల్లో జేడీఎస్ కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నందున ప్రకాశ్ రాజ్ ను కేసీఆర్ బరిలో దింపుతారా? అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇక బరిలో దింపితే ఆయన తరఫున కేసీఆర్ ప్రచారం చేయడం ఖాయం. ఆ విధంగా తెలుగు సినీ హీరోలే కాక రాజకీయ నాయకులూ కర్ణాటకలో అడుగుపెట్టినట్లు అవుతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.