Begin typing your search above and press return to search.

బీసీసీఐ గంగూలీ.. ఇదేం తిక్క నిర్ణయం? ధావన్ కు అవమానం కాదా?

By:  Tupaki Desk   |   12 Aug 2022 9:40 AM GMT
బీసీసీఐ గంగూలీ.. ఇదేం తిక్క నిర్ణయం? ధావన్ కు అవమానం కాదా?
X
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అంటే ఇప్పుడు ప్రపంచమే జీ హుజూర్ అనే పరిస్థితి. అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కారణంగా అయితేనేమి? కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరణతో కాసులు కురిపించే యాడ్స్ కారణంగా అయితేనేమి? భారత్ లో క్రికెట్ స్థాయి రీత్యా అయితేనేమి? బీసీసీఐ అంటే ఓ విధంగా మిగతా క్రికెట్ బోర్డులకు భయం కూడా. ఒకప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల బోర్డుల ఆధిపత్యం ఈ స్థాయిలో ఉండేది. వారేం చెబితే అది శాసనం అయ్యేది. కానీ, ఎప్పుడైతే బీసీసీఐ పాలనలో జగ్మోహన్ దాల్మియా శకం ఆరంభమైందో అప్పుడే వాటి ఆధిపత్యానికి గండిపడింది. సౌరభ్ గంగూలీ వచ్చాక సమర్థ నాయకత్వంతో ఆట పరంగానూ మనకు తిరుగులేకుండా పోయింది. ఇక ఐపీఎల్ ప్రారంభమయ్యాక 15 ఏళ్లుగా మనం చెప్పిందే శాసనం అవుతోంది. ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లను బెదిరించడం కాక.. బాబ్బాబు అంటూ బతిమాలుకుంటున్నాయి. అలాంటి బీసీసీఐ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం.. అది కూడా సౌరభ్ గంగూలీ లాంటి దిగ్గజం అధ్యక్షుడి ఉండగా తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయపరిచింది.

పూర్తి ప్రొఫెషనల్ గా..

అసంబద్ధ నిర్ణయాలు.. అనామక ఆటగాళ్లు.. పక్షపాత పాలకులు.. నాసిరకం క్రికెట్.. విదేశాల్లో ఓటములు.. 25 ఏళ్ల కిందట వరకు ఇదీ భారత్ పరిస్థితి. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉన్న సమయంలో హైదరాబాదీ ఆల్ రౌండర్ నోయల్ డేవిడ్ ను ఎంపిక చేస్తే ''ఎవరీ నోయల్''? అని సచినే అడిగే పరిస్థితి. కానీ, దాల్మియా+ గంగూలీ హయాం వచ్చాక ప్రొఫెషనలిజం వచ్చింది. ఎక్కడికక్కడ జవాబుదారీతనంతో పక్కా వ్యవస్థ తయారైంది. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా అనే నిశితంగా పరిశీలన జరుగుతోంది. దీంతో ఏ నిర్ణయమైనా ప్రశ్నించే వీల్లేకుండా పోతోంది. అయితే, తాజాగా జింబాబ్వే పర్యటన ముంగిట బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రోజుల్లోనూ ఇలా చేస్తుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. నెటిజన్లయితే ఏకంగా బీసీసీఐని ఏకి పడేస్తున్నారు.

సిరీస్ కు వారం ముంగిట..

టీమిండియా ఈ నెల 18 నుంచి జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడనుంది. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ తదితరులు విశ్రాంతి తీసుకోవడంతో ఈ సిరీస్ కు ఓపెనర్ శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమించారు. రెగ్యులర్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం, కొవిడ్ కారణంగా దూరం కావడంతో ధావన్ తప్ప కెప్టెన్సీకి వేరే అవకాశం లేకపోయింది. ఇటీవల శ్రీలంకలో, వెస్టిండీస్ దీవుల్లో పర్యటించిన వన్డే టీమ్ కు ధావన్ కెప్టెన్సీ చేశాడు. ఈ నేపథ్యంలో జింబాబ్వే టూర్ కు అతడిని కెప్టెన్ గా నియమించారు. కాగా, రాహుల్ తాజాగా కోలుకుని జట్టు ఎంపికకు అందుబాటులోకి వచ్చాడు.

వాస్తవానికి ఆసియా కప్ ఈ నెల 28 నుంచి జరుగనుంది. ఇందులో రాహుల్ ఉన్నాడు. అయితే, హెర్నియా, కొవిడ్ కారణంగా అతడు ఐపీఎల్ తర్వాత క్రికెట్ ఆడలేదు. ప్రస్తుతం అన్ని సమస్యల నుంచి బయటపడి, ఫిట్ నెస్ కూడా సాధించడంతో రాహుల్ ను ఉన్న పళంగా జింబాబ్వే టూర్ కు ఎంపిక చేశారు. అంతేకాదు.. ఏకంగా కెప్టన్ గా ధావన్ ను తప్పించి రాహుల్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం గురువారం రాత్రి తీసుకున్నారు. కెప్టెన్ గా ప్రకటించిన ధావన్‌ను వైస్‌ కెప్టెన్‌గా మార్చారు. దీంతో అటు అభిమానులు, ఇటు నెటిజన్లు.. సెలెక్టర్ల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. జింబాబ్వేతో టీమ్‌ఇండియా ఈనెల 18, 20, 22 తేదీల్లోవన్డేలు ఆడనుంది.

కలిసి ఓపెనింగ్ చేయాల్సిన వారు..

రోహిత్ లేడు కాబట్టి జింబాబ్వేతో వన్డేల్లో రాహుల్, ధావన్ కలిసి ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే కెప్టెన్, వైస్ కెప్టెన్ ఒకేసారి క్రీజులో దిగుతారన్నమాట. అయితే, బీసీసీఐ నిర్ణయం ఎంత లేదన్నా వారిపై ముఖ్యంగా ధావన్ పై ప్రభావం చూపుతుంది. ఒకవేళ రాహుల్‌ను ఈ పర్యటనకు ఎంపిక చేయాల్సి వస్తే బీసీసీఐ ముందే జట్టును ప్రకటించకుండా ఉండాల్సిందని, అలా కాకపోతే ఎలాగూ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు కాబట్టి.. అతడిని అలాగే కొనసాగించాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఒక విధంగా ఇది ధావన్‌ను అవమానించడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ధావన్‌ విండీస్‌ పర్యటనలో 3-0తో సిరీస్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాహుల్‌ భారత జట్టులో చాలా రోజుల తర్వాత చేరుతున్నాడు. భారత టీ20లీగ్‌లో లఖ్‌నవూ జట్టుకు కెప్టెన్సీ చేసిన అతడు తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనకు ముందు కోలుకున్నా.. మళ్లీ కరోనా సోకడంతో విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఫిట్‌నెస్‌ సాధించడంతో రాహుల్‌ జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే, అతడు అన్ని ఫార్మాట్లలోనూ తొలి ప్రాధాన్య వైస్‌ కెప్టెన్‌ కావడంతో ఇప్పుడు జట్టు పగ్గాలు దక్కాయి.

పాకిస్థాన్ బోర్డు తరహా నిర్ణయం

ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముందుంటుంది. కానీ, బీసీసీఐ కూడా అదే విధంగా ప్రవర్తించింది. 36 ఏళ్ల ధావన్ సీనియర్. 150 వన్డేలు ఆడాడు. రాహుల్ కు మరో ఐదారేళ్లు కెరీర్ ఉంది. ఇప్పుడు ధావన్ ను పక్కనపెట్టి రాహుల్ కు అదికూడా మూడు వన్డేల కోసం కెప్టెన్సీ ఇవ్వడం అర్థం లేని నిర్ణయం. పోనీ.. రాహుల్ ను భవిష్యత్ కెప్టెన్ గా చేద్దామనే ఆలోచన కోణంలో చూసినా ఇది తప్పుడు నిర్ణయమే. టీమిండియా కెప్టెన్సీ ఇప్పటికే ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సహా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ పోటీ పడుతున్నారు. వీరందరూ రాహుల్ కంటే నిలకడగా ఆడేవారే. రాహుల్ ప్రతిభావంతుడే అయినప్పటికీ.. మ్యాచ్ ఫినిషర్ కాదు. 8 ఏళ్ల కిందటే జాతీయ జట్టులోకి వచ్చినా ఇంకా ఆ స్థాయికి చేరలేదు. బుమ్రా, హార్దిక్, పంత్ మాత్రం అలా కాదు. మ్యాచ్ విన్నర్లుగా నిరూపించుకున్నారు. కాబట్టి బీసీసీఐ తాజా నిర్ణయాన్ని ఏ కోణంలోనూ సమర్థించలేం.