Begin typing your search above and press return to search.

మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్, కేటీఆర్ క్లాస్

By:  Tupaki Desk   |   25 Sep 2021 11:30 AM GMT
మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్, కేటీఆర్ క్లాస్
X
తెలంగాణ కేబినెట్ లోనే అత్యంత వివాదాస్పదమైన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మల్లారెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదన్న విమర్శలున్నాయి. మల్లారెడ్డి మీడియా ఎదుట అయినా.. బయట అయినా ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి మల్లారెడ్డిపై సీఎం కేసీఆర్ , కేటీఆర్ కు ఫిర్యాదు చేసే దాకా పరిస్థితి వెళ్లిందన్నది ఇన్ సైడ్ టాక్.

తాజాగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తమపై అవాకులు, చెవాకులు పేల్చుతూ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఆయన కుమారుడు, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేరుగా ఫిర్యాదు చేశారని తెలిసింది. సంస్థాగత కమిటీల్లో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. గ్రూపు రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నందున జడ్పీచైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని శరత్ చంద్రారెడ్డి చెప్పారు.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం శాసనసభ ఆవరణలో మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, శరత్ లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను వేర్వేరుగా కలిశారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ సూచించడంతోపాటు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జిల్లా టీఆర్ఎస్ నేతలతో సమావేశమవుతానని కేసీఆర్ సర్దిచెప్పినట్లు సమాచారం.

త్వరలోనే అన్ని సర్దుకుంటాయని పారట్ీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారని.. అందువల్ల తాను రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శరత్ చంద్రారెడ్డి తెలిపారు.

-అసలు వివాదం ఇదీ..
మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ మండలంలో టీఆర్ఎస్ కమిటీ ఏర్పాటు వివాదాస్పదమైంది. మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి తనను మంత్రి కలుపుకుపోవడం లేదని రాజీనామా చేస్తాననడంతో చెప్పడంతో అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రిని, శరత్ చంద్రను అసెంబ్లీకి పిలిపించుకొని మంత్రి కేటీఆర్ క్లాస్ పీకినట్టు సమాచారం. పార్టీలో విభేదాలు లేకుండా చూసుకోవాలని.. మరోమారు ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరించినట్లు సమాచారం.

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నామని.. ఈ విషయాన్ని కేసీఆర్ ముందు మీరే చెప్పాలని మల్లారెడ్డిని ఆదేశించినట్టు తెలిసింది. అనంతరం వారిద్దరూ సీఎంను కలవగా మంత్రిగా ఉండి అందరినీ సమన్వయంతో కలుపుకుపోవడం తెలియదా? అంటూ కేసీఆర్ మండిపడినట్లు తెలిసింది.. భవిష్యత్తులో ఇలాంటివి పునావృతం కాకుండా చూసుకోవాలని.. ఢిల్లీ పర్యటన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుదామని చెప్పారని తెలిసింది.