Begin typing your search above and press return to search.

రైతుల ఉద్యమానికి కేసీఆర్ నేతృత్వం

By:  Tupaki Desk   |   23 Sep 2020 1:30 AM GMT
రైతుల ఉద్యమానికి కేసీఆర్ నేతృత్వం
X
కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లులతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. రాజ్యసభ అట్టుడికింది. రచ్చ చేసిన ఎంపీలను బీజేపీ సర్కార్ సస్పెండ్ చేయించింది. వాళ్లు రాత్రంతా పార్లమెంట్ వద్దే నిరసన తెలిపారు. పంజాబ్, హర్యానా... బీజేపీ పాలనలో ఉన్న కర్ణాటకలోనూ రైతులు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంపై రైతులంతా ఆగ్రహంగా ఉన్న వేళ వారి తరుఫున దేశవ్యాప్త రైతు ఉద్యమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నడుం బిగించినట్లు సమాచారం.

‘ఇప్పటిదాకా రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదు. రైతుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న బీజేపీ శిక్ష అనుభవించక తప్పదు. అవసరమైతే రైతుల ఉద్యమానికి సీఎం కేసీఆర్ నేతృత్వం వహిస్తారు’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

విద్యుత్ బిల్లు, వ్యవసాయ బిల్లులపై ఉద్యమించడానికి సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు తలసాని ముందుస్తుగా చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా వ్యవసాయ బిల్లులకు ఆమోదం పొందడం ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఇష్టం లేదని.. అందుకే ఆయన బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు సభలో లేరని తలసాని వ్యాఖ్యానించారు.జీఎస్టీ సహా అన్నింట్లోనూ రాష్ట్రాలను కేంద్రం మోసం చేసిందని ఇక కేంద్రం ఆటలు తెలంగాణలో సాగవని తలసాని స్పష్టం చేశారు.

తెలంగాణలో 92.05 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని.. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లు రైతుల మెడపై కత్తిపెట్టేలా ఉన్నాయనే వాదన టీఆర్ఎస్ నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రైతుల శ్రేయస్సు కోసం జాతీయ ఉద్యమం దిశగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తలసాని మాటలను బట్టి తెలుస్తోంది.