Begin typing your search above and press return to search.

పెను ప్రకంపనలు సృష్టిస్తున్న కేసీఆర్ నిర్ణయం

By:  Tupaki Desk   |   23 Feb 2020 10:22 AM GMT
పెను ప్రకంపనలు సృష్టిస్తున్న కేసీఆర్ నిర్ణయం
X
ఏ ప్రభుత్వానికి అయినా ప్రధాన ఆదాయం రెవెన్యూశాఖనే. ఇక అత్యధిక అవినీతి కూడా అదే రెవెన్యూశాఖలో ఉంటుంది.. రెవెన్యూ అధికారులు కోట్లకు పడగలెత్తిన దాఖలాలు చూశాం. అవినీతితో పంకిలమైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయడానికి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ తహసీల్దార్లు - ఆర్డీవోలు - జేసీల చేతుల్లో ఉన్న అధికారాలకు కత్తెర వేస్తూ రెవెన్యూ అధికారులకు దిమ్మదిరిగే షాకిచ్చారు.

ఇక రెవెన్యూ అధికారాలన్నీ తహసీల్దార్లు - ఆర్డీవోలు - జేసీల నుంచి కలెక్టర్ కు వెళతాయి. భూముల వివాదాలు - కేసులు - అటవీ భూములు - భూ బదాలయింపులు - కుటుంబ - సర్వే - రద్దు బదల్ - ఇతర వక్ఫ్ - ఇంటి స్థలాలు వగైరా అన్నీ ఇక నుంచి కలెక్టర్లకే దాఖలు పడనున్నాయి. ఈ పరిణామంతో ఇన్నాళ్లు వీటిపై సంపాదించుకున్న రెవెన్యూ అధికారులు గగ్గోలు పెడుతున్నారు.

ఇక నుంచి తహసీల్దార్ - ఆర్డీవో - జేసీల అధికారాలను కేసీఆర్ కట్ చేశారు. అసలు జేసీ పోస్టు తీసేసి అదనపు కలెక్టర్లను నియమించారు. ఇక తర్వలోనే రెవెన్యూ సమస్యలపై ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సివిల్ కోర్టులకు ఉండే అధికారాలు వీటికి కల్పిస్తున్నారు. మాజీ జడ్జీలకు ట్రైబ్యునళ్ల బాధ్యతలు అప్పజెపుతున్నారు. ఈ మేరకు చట్టాల్లో మార్పులు తెస్తున్నారు. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్ లో వేల కేసులను ట్రైబ్యునళ్లతో త్వరగా పరిష్కరించి అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు.

త్వరలోనే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ కీలక బిల్లు తెచ్చి తెలంగాణలోని రెవెన్యూ శాఖలో పెను భూకంపం సృష్టించబోతున్నారు. అవినీతిని రెవెన్యూలోంచి తీసేయడమే లక్ష్యంగా కేసీఆర్ వేస్తున్న అడుగులు తెలంగాణ రెవెన్యూ అధికారుల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.