Begin typing your search above and press return to search.

ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు కేసీఆర్?

By:  Tupaki Desk   |   12 Feb 2022 5:01 AM GMT
ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు కేసీఆర్?
X
మాటలు తూటాల మాదిరి పేలుతున్నాయి. సాక్ష్యాత్తు దేశ ప్రధానినే ఏకంగా దేశం నుంచి తరిమికొడతం అంటూ మాటల్లో విరుచుకుపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకిలా? పార్టీల మధ్య ఎంత తగాదాలు ఉన్నా.. సైద్దాంతికంగా మరెన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. ఇంత తీవ్రమైన మాట సీఎం కేసీఆర్ నోటి నుంచి ఎందుకు వచ్చినట్లు? ఏదో అన్యాపదేశంగానో.. పొరపాటుగానో ఒక మాట మాట్లాడే తత్త్వం కాని అధినేత నోటి నుంచి ఇంత తీవ్రమైన మాట ఎందుకు? ప్రజల్లోకి పెద్దగా రాకుండా ఉండే ఆయన తాజాగా వరుస సభలు నిర్వహించటం దేనికి సంకేతం? మోడీ మీద కోపం ఉన్నా.. ఆయన పార్టీ మీద మండిపాటు ఉన్నప్పటికీ ఉత్తి పుణ్యానికే పంచాయితీ పెట్టుకునేంత తెలివితక్కువ తనం కేసీఆర్ లో కనిపించదు. ఆయనేం చేసినా.. ముందుచూపుతో.. జరగబోయే కార్యక్రమాలకు.. రానున్న రోజుల్లో వచ్చే ప్రయోజనానికి తగ్గట్లు ఆయన మాటలు కనిపిస్తాయి.

2018లో కూడా షెడ్యూల్ కంటే దాదాపు ఎడెనిమిది నెలల ముందే ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. అప్పట్లో తమను ఉత్తి పుణ్యానికే అనరాని మాటలు అంటున్నారని.. అందుకే ప్రజాక్షేత్రంలోకి వస్తున్నామని.. ప్రజల తీర్పు తాము కోరుతున్నట్లుగా పేర్కొనటం తెలిసిందే. భావోద్వేగ అంశాల్ని గుది గుచ్చి.. తెలంగాణ ప్రజల మీదకు సందించే అలవాటున్న సీఎం కేసీఆర్ నోటినుంచి వచ్చే ప్రతి మాటకు ఏదో ఒక లెక్క పక్కాగా ఉండి ఉంటుంది.

తాజాగా ఆయన చేసిన ప్రసంగ పాఠాన్ని చూస్తున్నప్పుడు.. తెలంగాణ భావోద్వేగాన్ని.. తెలంగాణ రాష్ట్రాన్ని తాము తప్ప మరెవరూ సరైన రీతిలో పట్టించుకోరని.. తెలంగాణ కోసం పోట్లాడేది తాము మాత్రమే అన్న సందేశాన్నిఇవ్వటంతో పాటు.. అత్యంత బలమైన నరేంద్ర మోడీని మీద యుద్ధానికి తాను సిద్ధమని.. కాకుంటే అందుకు తెలంగాణ ప్రజలు సహకారాన్ని.. వారి మద్దతును తాను కోరకుంటున్నట్లుగా స్పష్టం చేశారు.

ఇదంతా చూసినప్పుడు.. ఆయన మాటలన్ని ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నాయనే చెప్పాలి. తాను ఢిల్లీకి వెళ్లాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. నిజంగానే.. ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయితే.. రాష్ట్ర పాలనా వ్యవహారాల మీద ఫోకస్ చేసే పరిస్థితి ఉండదు. సార్వత్రిక ఎన్నికలకు కనీసం ఏడాది ముందైనా గ్రౌండ్ వర్కు మొదలు పెట్టాలి. అందునా.. మోడీ లాంటి రాజకీయ మేరునగాన్ని ఢీ కొట్టటం అంత తేలికైన పని కాదు.

అందుకే.. షెడ్యూల్ కంటే తొమ్మిది నెలల ముందు.. అంటే ఈ ఏడాది చివరకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్ని పూర్తి చేసుకొని.. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది నుంచే మంతనాలు మొదలు పెడితే తప్పించి.. ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేధించలేని పరిస్థితి.

దీనికి తోడు.. ఎప్పటి నుంచో తన సీఎం కుర్చీని తన కుమారుడు కేటీఆర్ కు అప్పజెప్పాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉండటం తెలిసిందే. అయితే.. ఎప్పటికప్పుడు ఎదురుపడే సవాళ్ల నేపథ్యంలో.. కొడుకు కేటీఆర్ కు పట్టాభిషేకాన్ని చేయాలన్న అంశం పక్కకు వెళ్లిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. మోడీ మీద యుద్ధాన్ని ప్రకటించటం ద్వారా ఆయనతో నేరుగా తలపడేది తానేనన్న విషయాన్ని కేసీఆర్ తేల్చేశారు. అలాంటప్పుడు తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ కు తగిన రీతిలో పట్టాభిషేకాన్ని నిర్వహించేందుకు వీలుగా.. తాజాగా అంతలా విరుచుకుపడ్డారని చెబుతున్నారు. రాబోయే రోజులకు అవసరమైన రాజకీయాన్ని.. రాజకీయ వాతావరణ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో దిట్ట అయిన కేసీఆర్.. గురి చూసి విడిచిన బాణం మాదిరి.. మోడీ మీదకు తన భావోద్వేగ అస్త్రాన్ని సంధించారని చెప్పాలి. మరి.. దీనికి మోడీ పరివార్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.