Begin typing your search above and press return to search.

దసరా నాడు`ధరణి`కి ముహూర్తం పెట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   26 Sep 2020 5:41 PM GMT
దసరా నాడు`ధరణి`కి ముహూర్తం పెట్టిన కేసీఆర్
X
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చని సీఎం కేసీఆర్...వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో సమగ్ర భూ సర్వేతోనే భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భూవివాదాలన్నింటికీ ధరణి పోర్టలే పరిష్కారమని కేసీఆర్ స్పష్టం చేశారు. అవినీతికి తావులేని విధంగా ఇకపై భూమి రిజిస్ట్రేషన్లన్నీ ధరణి పోర్టల్ ద్వారా జరుగుతాయని, భూ యజమాని అనుమతి లేనిదే మార్పులు చేయలేమని, అరగంటలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్డేషన్ పూర్తవుతుందని చెప్పారు. ధరణి పోర్టల్‌లో మార్పులు చేసే అధికారం ఎమ్మార్వోలకు కూడా లేదని, బయోమెట్రిక్‌, ఐరిస్‌, ఆధార్‌, ఫోటోలతో పకడ్బందీగా ధరణిలో వివరాలు అప్డేట్ అవుతాయని కేసీఆర్ గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించబోతున్నాట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ధరణి పోర్టల్ ప్రారంభానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

ధరణి పోర్టల్ కు సంబంధించి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్ విడ్త్‌లను సిద్ధం చేయాలని కేసీఆర్ చెప్పారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, మ్యుటేషన్, అప్‌డేట్ అంశాలకు సంబంధించిన విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లకు అవసరమైన శిక్షణ ఇస్తామని కేసీఆర్ అన్నారు. మండలానికి ఒకరు, ప్రతీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందే సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. దసరాలోగా అన్ని రకాల ఆస్తుల సంబంధించిన డేటాను ధరణి పోర్టల్‌లో ఎంటర్ చేయాలని ఆదేశించారు. దసరా రోజు నుంచే పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతాయని కేసీఆర్ అన్నారు.