Begin typing your search above and press return to search.

మందుబాబులకు కేసీఆర్ షాకివ్వబోతున్నారా?

By:  Tupaki Desk   |   20 Nov 2019 7:59 AM GMT
మందుబాబులకు కేసీఆర్ షాకివ్వబోతున్నారా?
X
ఆర్థిక మాంద్యం దెబ్బకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో రాబడి తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సరికొత్త ఆదాయ మార్గాలను ఆయన అన్వేషిస్తున్నారు. తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచేందుకు కేసీఆర్ నడుంబిగించారని తెలిసింది.

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 73 మున్సిపాలిటీల్లో బార్లకు అనుమతిస్తూ తెలంగాణ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణలో మద్యం ధరలు పెంచే దిశగా సర్కారు అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు మద్యం ధరల పెంపుపై ఫైల్ కేసీఆర్ ముందుకు చేరినట్లు సమాచారం. కేసీఆర్ ఇప్పటికే ముగ్గురు మంత్రులతో ఈ మద్యం ధరలను పునసమీక్షించేందుకు కమిటీ వేసినట్లు తెలిసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకే ఇప్పుడు తెలంగాణలో మద్యం ధరల పెంచేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికిప్పుడు తెలంగాణలో మద్యం ధరలను పెంచడానికి కేసీఆర్ సాహసించడం లేదు. త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కేసీఆర్ సర్కారు రెడీ అయ్యింది. మద్యం ధరలు పెంచితే అది ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. అందుకే ఆ ఎన్నికలు ముగిశాక ఈ కొత్త మద్యం ధరల పెంపుదల ఉండనున్నట్టు సమాచారం.

ప్రాథమిక సమాచారం ప్రకారం లిక్కర్ ధరలను 10శాతం పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిసింది. దీంతో ఏటా 1700 కోట్ల అదనపు ఆదాయం కేసీఆర్ సర్కారు వస్తుందని అంచనా. ఇక ఇప్పటికే కొత్త మున్సిపాలిటీలో బార్ల ఏర్పాటుతో భారీగా లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు మద్యం ధరల పెంపుతో కేసీఆర్ ఖాజానా నింపుకోవడానికి రెడీ అయ్యారు. ఇలా ఆర్థిక మందగమనం వేళ కేసీఆర్ సర్కారు ఆదాయం పెంచుకునేందుకు మందుబాబులపై భారం మోపడానికి రెడీ అయ్యిందన్న మాట..